ఆంధ్ర నార్కోటిక్స్ కేంద్రంగా మారింది

·       రాష్ట్రం నుంచి గంజాయి అక్రమ రవాణాపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  ట్వీట్స్

‘ఆంధ్రప్రదేశ్ నార్కోటిక్స్ కు కేంద్రంగా మారింది. ప్రతీ స్థాయిలోనూ డ్రగ్ మాఫియాలు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయి. యావత్తు దేశం మీద దీని ప్రభావం చూపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వంలో ఉన్న నేతలు కావాలని చర్యలు చేపట్టకపోవడమే’ అని జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్  విమర్శించారు.

. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ రంగనాథ్ మీడియాలో మాట్లాడిన వీడియో క్లిప్ ను కూడా ఇందుకు జత చేశారు. గంజాయికి సంబంధించిన అక్రమ రవాణాపై ఈ రోజు పలు ట్వీట్స్ చేశారు.  పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్స్…

“నేను  2018లో పోరాట యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్రంలో ప్రజల సామాజిక, ఆర్థిక అంశాలను తెలుసుకోవడం. ఈ సందర్భంగా- ఆంధ్ర-ఒడిశా బోర్డర్లో ఉన్న గిరిజన ప్రాంతాలలో పర్యటించినప్పుడు… గిరిజనుల నుంచి చాలా ఫిర్యాదులు అందాయి. ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్, ప్రధానంగా గంజాయి వ్యాపార మాఫియా వంటి అంశాలపై నాకు ఫిర్యాదులు అందాయి. ఏఓబీ (ఆంధ్ర- ఒడిశా బోర్డర్) ప్రాంతాల్లో విస్తృతంగా ప్రయాణించడం జరిగింది. ఇక్కడ విభిన్నమైన నేరపూరిత ముఠాలు ఉన్నాయని అక్కడి స్థానిక ప్రజలు తెలిపారు. ఈ విషయాలు చెప్పటానికి కూడా వారు భయపడ్డారు. ఈ ముఠా కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర టాస్క్ ఫోర్స్ ను కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి.

గంజాయి సాగు నిజంగా సామాజిక ఆర్ధిక అంశం. విశాఖ మన్యం నుంచి తుని వరకూ ఉపాధి లేని, చదువు పూర్తయిన కుర్రాళ్ళు ఈ ట్రేడ్ లో చిక్కుకుంటున్నారు. కింగ్ పిన్స్ మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారు.
మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్య దశలో ఉంది. నవంబర్, డిసెంబర్ నుంచి కటింగ్ మొదలవుతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ బయటకు వెళ్తుంది. గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారు. ఆ పని వదిలి… బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారు. ఇక్కడ సీజ్ చేసిన దాని కంటే, రాష్ట్రం దాటిపోతున్న సరుకు ఎక్కువగా ఉంటుంది” అని ట్వీట్స్ పోస్ట్ చేశారు.

 

రూట్ మ్యాప్ చూపించిన హైదరాబాద్ సీపీ
ఈ ట్వీట్స్ లో భాగంగా ఇతర రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు గంజాయి ముఠాలను అదుపులోకి తీసుకొని ఆ మత్తు పదార్థం మూలాలూ ఏపీలో ఉన్నాయి అనే విషయాన్ని వెల్లడి చేసిన విషయాన్ని శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు జత చేశారు. వాటిలోని వివరాలు… హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ అంజనీ కుమార్ ప్రెస్ మీట్ లో ఏపీలో నర్సీపట్నం నుంచి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కు వెళ్ళే రూట్ మ్యాప్ ను వివరించిన వీడియోను శ్రీ పవన్ కల్యాణ్ గారు ట్వీట్ చేశారు. రోడ్డు మార్గం ద్వారా నక్కపల్లి క్రాస్ రోడ్డు మీదుగా అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట్, హైదరాబాద్, కర్ణాటకలోని ఉమ్నాబాద్, అహ్మద్ నగర్ కు వెళ్తుందని తెలిపారు.

బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ కమల్ పంత్ కూడా ప్రెస్ మీట్లో గంజాయి ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ జిల్లా నుంచి వస్తుందని ప్రకటించారు. కేరళలోని షాడో పోలీస్ విభాగం గంజాయి ముఠాలను అరెస్ట్ చేసి ఆంధ్ర ప్రదేశ్ లోని గోదావరి ప్రాంతం నుంచి సరఫరా అయినట్లు ప్రకటించింది. మధ్యప్రదేశ్ పోలీసులు ఆంధ్ర ప్రదేశ్ లోని చింతూరు ప్రాంతం నుంచి గంజాయి వచ్చినట్లు మీడియాకు తెలిపారు. పుణె, ముంబైల్లో పట్టుపడిన గంజాయి అంతా విశాఖపట్నం నుంచి వచ్చినట్లు ముంబై పోలీసులు చెప్పారు. రాజస్థాన్ పోలీసులు పట్టుకొన్న గంజాయి కూడా విశాఖపట్నం నుంచి వచ్చినట్లు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏసీపీ శ్రీ సంతోష్ కుమార్ మీనా మీడియాకు గంజాయి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి చేరినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *