టిడిపి ఆఫీసు మీద దాడులు అభిమానుల రియాక్షన్ మాత్రమే

(అంబటి రాంబాబు )
టీడీపీ ఆఫీసుల మీద దాడులు జరిగినట్టు, అది చాలా ఘోరమైన అంశంగా చిత్రీకరించేందుకు టీడీపీ, వారి తోక పార్టీలు, వారికి వత్తాసు పలికే ఓ వర్గం మీడియా ఒక కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నాయి వైఎస్ ఆర్ సి నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబువ్యాఖ్యానించారు.
వాస్తవానికి నిన్న ఏం జరిగిందో క్షుణ్ణంగా పరిశీలిస్తే.. యాక్షన్ కు రియాక్షన్ గా మాత్రమే జరిగింది. ముఖ్యమంత్రి జగన్ గారికి ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో కడుపుమండినవారు తిరగడ్డారు. చంద్రబాబు చేయించినది చర్య అయితే.. జగనన్న అభిమానులు తిరగబడటం కేవలం ప్రతిచర్య..అని  రాంబాబు వ్యాఖ్యానించారు.
 ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రేపు తలపెట్టిన 36 గంటల నిరసన దీక్ష ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు
“మొదటిది లేకపోతే.. అంటే బూతులు తిట్టించకపోతే, ప్రతి చర్యకు అవకాశమే లేదు. ఈ విషయం టీవీలు చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది,” అని ఆయన అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
 మహారాష్ట్రలో కేంద్రమంత్రి నారాయణ్ రాణే చెప్పుతో కొడతానని రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే.. ఏం జరిగిందో మీకు తెలుసు.
టీడీపీ నాయకుల బూతులు, దారుణమైన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపైన, ఒక పార్టీ అధ్యక్షుడిపైన చేసిన కామెంట్లు.. సహజంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిస్పందనలకు దారితీశాయి.
చంద్రబాబు నాయుడు మాదిరిగా, జగన్ మోహన్ రెడ్డిగారు వెన్నుపోటు పొడిచో, కుట్రలు పన్నో, అడ్డదారిలోనో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కాదు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు గెలుచుకుని, ఇప్పటికీ చెక్కు చెదరని ప్రజాభిమానంతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ గారు.
 రెండున్నరేళ్ళుగా అద్భుతమైన పరిపాలన సాగిస్తూ, తన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తోన్న ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడతారా..? బోషడీకే, వెధవ, సన్నాసి అన్న మాటలను చంద్రబాబు ఖండించకుండా, ఇంకా సమర్థిస్తున్నారా..? ఇలాంటి పదజాలాన్ని ఎందుకు చంద్రబాబు మాట్లాడిస్తున్నారు?
చీమ చీమ ఎందుకు కుట్టావ్.. అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు.. టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడితే, రెచ్చగొడితే.. ఎవరైనా ఊరుకుంటారా.. కొంతమంది ఆవేశపరులో, మరొకరో.. లేక వారి కుట్రదారులో.. ఎవరో దాడి చేసి ఉంటారు. ఎవరు దాడి చేశారు అన్నది పోలీసు విచారణలో తేలుతుంది.
 రాష్ట్ర డీజీపీ గురించి చంద్రబాబు ఏం మాట్లాడిస్తున్నారు. పోలీసు బాసును పట్టుకుని పాలేరు అని మాట్లాడతారా..? డీజీపీ సవాంగ్ గారు మీ హయాంలో కూడా విజయవాడ సీపీగా పనిచేశారు కదా.. అటువంటి డీజీపీని పట్టుకుని ఏరా అని, పాలేరు అని మాట్లాడతారా..? మొన్నటికి మొన్న టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఐపీఎస్ అధికారులను “ఎస్పీ నా కొడుకులు వచ్చి సలాం చేసేవారు” అని మాట్లాడారు. టీడీపీ నేతల భాష చూస్తే ఎవరికైనా అసహ్యం వేస్తుంది. ఎవరికి ఎవరూ పాలేరులు కాదు. నోరు పెద్దది అయినప్పుడు మూతి మీద వాత పెట్టే కార్యక్రమాలు ప్రజలు చేస్తున్నారు. అదే ఈరోజు జరుగుతుంది.
 చేయాల్సిందంతా చేసి, చంద్రబాబు దీక్ష చేస్తాడట. కొంగ జపం ఎందుకు చేస్తున్నావు చంద్రబాబూ?  దీనిని బట్టే, మీ కుట్ర రాజకీయం బయట పడటం లేదా..? బూతులు తిట్టించి, ప్రజలను రెచ్చగొట్టి, అందులో నుంచి ఏదో సానుభూతి పొందాలని మీరు కుట్రలు చేస్తున్నట్లు ప్రజలకు అర్థం కావడం లేదా. ఇటువంటి చీప్ ట్రిక్స్ ఉపయోగించి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై బురద జల్లాలనుకుంటే అది సాధ్యం కాదు. ఈ రాష్ట్రానికి అద్భుతమైన పరిపాలన అందిస్తోన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండమైన విజయాలను అందించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా టీడీపీ ముందుకు రాని పరిస్థితి.
 36 గంటలు కాకపోతే.. 360 రోజులు నిరాహార దీక్ష చేయండి. ఏం చేసినా మిమ్మల్ని ప్రజలు నమ్మరు. గుంట నక్క రాజకీయాలను ప్రజలు హర్షించరు. చంద్రబాబు అధికారంలోకి ఎలా వచ్చారు.. ? ఆ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎన్ని మర్డర్లు చేశారు..? ఎన్ని బస్సులు తగుల బెట్టించారు..? ఇదంతా చంద్రబాబు చరిత్ర కాదా..?. ఈరోజు కొంగ జపాలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరు గాక నమ్మరు.
 ఇప్పటికైనా చంద్రబాబుకు ఒక విషయం స్పష్టంగా తెలియాలి. “తప్పుగా మాట్లాడించకూడదు. మాట్లాడిస్తే ప్రజలు ఊరుకోరు. తిరగబడతారు” అని చంద్రబాబు తెలుసుకోవాలి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని పట్టుకుని నోటి కొచ్చినట్లు తిట్టడానికే మీ అనుభవం అంతా ఉపయోగిస్తున్నారా బాబూ..?
 టీడీపీ కార్యాలయం ప్రజాస్వామ్య దేవాలయం కాదు.. కుట్రలకు, కుతంత్రాలకు, వెన్నుపోట్లకు వేదిక. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నక్క జిత్తులు పన్నినా.. చంద్రబాబుకు, లోకేష్ కు చివరికి మిగిలేది బూడిదే. కుళ్ళు, కుతంత్రాలతో రాజకీయాలు చేసే వారికి ఆఖరికి అదే మిగులుతుంది. చంద్రబాబును సపోర్ట్ చేస్తున్న తోక పార్టీలు, కొంతమంది నాయకులు.. చంద్రబాబు తిట్టించింది తప్పు అని మాట్లాడి, ఆ తర్వాత సపోర్ట్ చేయండి. ఇది సరైన విధానం కాదు.
 మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎవర్నో కూర్చోబెట్టి, వారికి కీ ఇచ్చి, బూతులు మాట్లాడిస్తే.. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిగారిని, డీజీపీని, రాష్ట్ర ప్రజలను డీమోరలైజ్ చేస్తుంటే.. వ్యవస్థలు చూస్తూ ఊరుకోవు. ఈరోజు చంద్రబాబును సపోర్ట్ చేస్తున్న ఇతర పార్టీల నేతలకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాం.
రేపు మిమ్మల్ని కూడా టీడీపీ నాయకులు ఇలానే తిడతారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిపై అన్న మాటలు.. ఇక్కడితే ఆగిపోవు.. రాజ్యాంగ పదవులైన జడ్జిలపైనా, ప్రధానమంత్రిపైనా, రాష్ట్రపతిపైనా.. చివరకు మీ పైన కూడా మాట్లాడతారు.  అసలు ఇలాంటి మాటలను ప్రజాస్వామ్యంలో మాట్లాడటం కరెక్టేనా అని అంతా ఆలోచించాలి.
చంద్రబాబు 36 గంటలు నిరాహార దీక్ష చేస్తుంటే.. ఆయన చేసిన ఘోరాలు-నేరాలు గురించి ఆ 36 గంటలూ ప్రజలు మాట్లాడుకుంటారు. టీడీపీకి సింపథీ వస్తుందనుకుంటే పొరపాటు, ఆఖరికి చంద్రబాబు, వారి పార్టీనే అభాసుపాలవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *