నడచి వచ్చే భక్తుల కోసం టిటిడి విశ్రాంతిషెల్టర్ల నిర్మాణం

– ఏడాది లోపు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ కుంభాభిషేకం

టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

స్థానిక సలహా. మండలి చైర్మన్ గా శ్రీ శేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

చెన్నై నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నడచివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రతి 20 నుంచి 30 కిలోమీటర్లు దూరానికి వసతి షెల్టర్లు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ
వై వి సుబ్బారెడ్డి చెప్పారు. చెన్నై టీ నగర్ లోని టిటిడి సమాచార కేంద్రం లో స్థానిక సలహామండలి చైర్మన్ గా శ్రీ శేఖర్ రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, శ్రీ శేఖర్ రెడ్డి తిరుమల శ్రీవారి పరమ భక్తుడు అని చెప్పారు. హిందూ ధర్మ ప్రచారం కోసం ఆయన ఇతోధిక సహాయం చేస్తున్నారని అన్నారు. వచ్చే ఏడాది పెరటాసి మాసం ప్రారంభమయ్యే లోపు కాలినడకన వచ్చే భక్తుల సదుపాయం కోసం షెల్టర్లు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

చెన్నై లో నిర్మిస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేసి కుంభాభిషేకం నిర్వహిస్తామని చైర్మన్ తెలిపారు. తిరుమల తరహాలో చెన్నై నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఓఎంఆర్, ఈసిఆర్ ప్రాంతాల్లో భూమి ఇవ్వడానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు టిటిడి ఇంజనీర్లు ఈ రెండు భూములను త్వరలో పరిశీలించి, స్వామివారి ఆలయ నిర్మాణానికి ఏ భూమి అనుకూలమో నిర్ణయిస్తారని చెప్పారు.

అనంతరం త్వరలోనే ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభిస్తామని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు. చెన్నై నగరంలోని రాయపేట లో ఉన్న రెండు ఎకరాల భూమిలో మధ్య, దిగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా టిటిడి కళ్యాణ మండపం నిర్మిస్తామన్నారు . ఈనెల 11వ తేదీన ఎస్ వి బి సి హిందీ, కన్నడ ఛానళ్ళను ముఖ్యమంత్రులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీ బసవ రాజ్ బొమ్మై ప్రారంభిస్తారన్నారు. అలిపిరి వద్ద శ్రీ శేఖర్ రెడ్డి నిర్మించిన గో మందిరాన్ని అదే రోజు ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకే తిరుమల శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నామన్నారు.

స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా అలిపిరిలో గోమందిరం నిర్మిస్తున్నామని చెప్పారు.ఇక్కడ గో తులాభారం కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్వామి వారు ఇది తనకు ఇచ్చిన భాగ్యమని ఆయన అన్నారు.
రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ శంకర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *