‘కోవిడ్ సాకుతో ఉప ఎన్నిక వాయిదా, స్కూళ్ళు తెరిపించినవ్, ఏందిది?’

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్న

 

కోవిడ్ సాకుతో హుజూరాబాద్ ఉప ఎన్నికలను వాయిదా వేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా సంస్థలను ప్రారంభించడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు.

ఓడిపోతారనే భయంతోనే టీఆర్ఎస్ నేతలు ఉప ఎన్నికను వాయిదా వేయించారని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లు ఒక్కో విద్యార్ధి నుండి లక్షల రూపాయలు వసూలు చేసి టీఆర్ఎస్ నేతలకు కమీషన్లు ఇచ్చాయని పేర్కొన్నారు. ఫీజులు వసూలు చేసిన తరువాత కార్పొరేట్ సంస్థలు కోవిడ్ సాకుతో స్కూళ్లను మూసేసిన విషయాన్ని గుర్తు చేశారు.

భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జయంతిని పురస్కరించుకుని మాందాన్ పల్లి శిబిరంలో బండి సంజయ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు టీచర్లను బండి సంజయ్ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దేశానికి, సమాజానికి ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను కొనియాడారు. తాను ఈ స్థాయిలో ఉన్నాననంటే తన తండ్రి టీచర్ కావడమే కారణమన్నారు. తన తండ్రివల్ల దేశం, ధర్మం గురించి ఆలోచించడం నేర్చుకోవడంతోపాటు నిత్యం ఆర్ఎస్ఎస్ శాఖ సమావేశాలకు వెళుతూ ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు.

రాష్ట్రంలో కిలోమీటర్ కు ఓ పాఠశాల ఉండాలని….కేసీఆర్ పాలనలో అందుకు భిన్నంగా కిలోమీటర్ కు ఓ వైన్స్ షాపు, బార్ ఉన్నాయని విమర్శించారు. కొత్త టీచర్ పోస్టుల భర్తీ ఊసే లేదని, ఉన్న స్కూళ్లను మూసివేయిస్తూ టీచర్ల సంఖ్యను తగ్గిస్తున్నారని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ ఉపాధ్యాయ సంఘాలను రద్దు చేస్తానని బెదిరించడంతో భయపడిన టీచర్లు టీఆర్ఎస్ కు ఓటేసి పొరపాటు చేశారని పేర్కొన్నారు. దేశాన్ని తీర్చిదిద్దాల్సిన టీచర్లే భయపడితే ఇక సమాజం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ప్రభుత్వాలను మార్చిన చరిత్ర టీచర్లకు ఉందని, ఇకపై ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని వారికి అండగా బీజేపీ ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో పీఆర్సీ కోసం లాఠీదెబ్బలు తిన్న చరిత్ర తమకుందన్నారు. నరేంద్రమోదీ 18 గంటలు పనిచేస్తే కేసీఆర్ మాత్రం 18 గంటలు నిద్రపోతారని ఎద్దేవా చేశారు

పెద్దోళ్లు చస్తే పూలబొకేలు తీసుకెళ్లి సంతాపాలు తెలిపి మీడియాకు ఫోజులిచ్చే కేసీఆర్ పేదలు, విద్యార్థులు, టీచర్లు చనిపోయినా పట్టించుకోలేదని, కనీసం పరామర్శించిన దాఖలాల్లేవని మండిపడ్డారు. ప్రజాకంటక, అవినీతి పాలన చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేసి శక్తివంతమైన తెలంగాణను నిర్మించేందుకే తాను ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నానని, ఈ యాత్రకు రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా బాసటగా నిలవాలని కోరారు.

బీజేపీ నేత డికె  అరుణ మాట్లాడుతూ…దేశంలో టీచర్లకు ఉన్న విలువ మరెవరికీ లేదని అన్నారు. ఉఫాధ్యాయ బోధనలవల్లే తాము ఈ స్థాయికి రాగలిగామని స్మరించుకున్నారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయ్యాక చదువులు తగ్గించి వైన్స్, బార్లు పెంచారని ఎద్దేవా చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *