ఆయన మరణంతో ఎందుకు దేశం శోకించిందంటే…

అరుణ్‌ ఫెరెరా

(అనువాదం : రాఘవ శర్మ)

భీమాకోరెగాన్ కేసులో అరెస్టైన గిరిజన హక్కుల కార్యకర్త, క్రైస్తవ మత బోధకుడు, 84 ఏళ్ళ స్టాన్ స్వామి గత జులై 5వ తేదీన మృతిచెందాడు.  స్టాన్‌స్వామి అరెస్టయ్యారన్న వార్త 2020, అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం తెలిసి ఆశ్చర్యపోయాం .

మర్నాడు ఆయన మా పక్క బారెక్‌ లోని ఖైదీలతో హిందీలో చక్కగా మాట్లాడుతున్నాడు. నేను జైలు ఆస్పత్రిలోని సెల్ లో నా సహనిందితుడు వరవరరావు, వెర్నన్ గోన్సాల్వెస్ లతో   ఉన్నాను.

ఉదయం టిఫిన్ తినడానికి ముందు వరవరరావును వీల్ చైర్ లో కూర్చోబెట్టుకుని రోజూ రెండు వరుసలు తిరిగే వాళ్లం.స్టాన్ స్వామిని జుడీషియల్ కస్టడీకి పంపడానికి రెండు రోజుల ముందు కస్టోడియల్ ఇంటరాగేషన్ కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (NIA)కోరి ఉంటుందని ఊహించాం.కానీ, మా ఊహ తప్పు.

ఎందుకంటే, ఎస్ ఐ ఏ అతన్ని జైలులో పెట్టదలుచుకుంది. మమ్మల్ని చూడగానే స్టాన్ స్వామికి ప్రాణం లేచొచ్చింది. స్టాన్ స్వామితో మేం ముగ్గురం రెండు నెలలు స్నేహంగా ఉన్నాం.

అంతులేని తన అనుభవాలతో, తరుచూ పాడే పాటలతో ఏర్పడిన ఆ స్నేహం ఎన్న‌టికీ మర్చిపోలేం.హైకోర్టు ఆదేశాలతో వరవరరావును ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించడంతో అప్పటివరకు వరవరరాను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన  మమ్మల్ని వేరు వేరు బారెక్‌లకు తరలించారు.

రోజు వారి పనులల్లో తన  సహాయంతో  అర్ధవంతంగా ఇతర సంభాషించాలన్నా సాయంకావాలి స్టాన్ స్వామి జైలు అధికారులతో వాదించాడు. దానిఫలితంగా నన్నూ,  మేం ‘చాచా’ అని పిలిచే మరొక ఖైదీతో ని  స్టాన్ స్వామి సెల్ కు 2020 డిసెంబర్ 5న మార్చారు.

తనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిపైన చెరగని ముద్ర వేసే  స్టాన్ స్వామితో మేం రోజుల, నెలల తరబడి గడిపాం. నిర్మలమైన, స్వచ్చమైన నిరాడంబరత వల్లే అతనిలో ఆ మిరుముట్లు గొలిపే శక్తి వచ్చింది. ప్రతి చర్యలో, ప్రతి అంశంలో అతని నిరాడంబరత చొరబడింది. తన చేతిని గుండె మీద ఆనించి, తల వంచి అవతి వ్యక్తి చెప్పిన విషయాలను ఆమోదించే మర్యాద ని మేం మరిచిపోలేం.

తన కంటే చిన్న వయసులో ఉన్న ఖైదీలను,  జైలు అధికారులతో  పాటు ఆయన మాట, మర్యాద  ప్రతి ఒక్కరిని క‌దిలించింది.

తన కంటే చిన్న వారితో అననుచితంగా, వారిని తీసేసినట్టుగా ప్రవర్తించినట్టు మేం ఎప్పుడూ చూడలేదు. ఏదో ఒకటి పంచుకోవడమే ప్రేమ అని నమ్మిన వ్యక్తి స్టాన్.  పంచుకోవడమంటే ఇతరులకు ఏదో ఒకటి ఇవ్వటం కాదు. ఇతరుల బాధలో, వారి విషాదంలో పాలుపంచుకోవడం.

స్టాన్ స్వామిని అరెస్టు చేయడానికి రెండు రోజుల ముందు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ  తీసిన వీడియో  సందేశం ఇది.

స్టాన్ స్వామిని మరింత తినమని నేను, చాచా దాదాపు ప్రతి రోజూ అడిగేవాళ్ళం.  ఆహారం తక్కువగా తీసుకోవడం ఖైదీల పరిస్థితికి సరైనది కాదని మేం గాభరాపడే వాళ్ళం .

ఒక యువ జెస్యూట్ గా జార్ఖండ్ లోని చైబసలో ఉన్న గిరిజన కుటుంబంతో కలిసి జీవిస్తున్నప్పుడు వారిలాగానే తాను కూడా అర్ధాకలితో ఉండే వాడినని చెప్పాడు.యాభై ఏళ్ళుగా ఇలా తినడం వల్ల తన పొట్ట కూడా అంటుకుపోయిందని చెప్పాడు.

స్టాన్ స్వామి చెప్పిన సమాధానంతో మేం సంతృప్తి చెందలేదు. అతని కోసం జైలు క్యాంటిన్లో పళ్ళు, బలవర్ధకమైన బిస్కెట్లు కొన్నాం. కానీ అతని కఠినమైన జీవన విధానం వల్ల జైల్లో కూడా మాతో ఏమాత్రం రాజీపడలేదు.

తన కిష్టమైన వేయించిన వేరుశెనగ పప్పుల్ని మాత్రమే కొనమని అడిగేవాడు. ఇతరుల విషాదాలలో పాలుపంచుకోవడమే ప్రేమకు లోతైన అర్థం అన్నది ఆయన తత్వం. జెంషెడ్ పూర్ లోని జెస్యూట్ ప్రావిన్స్ లో క్రైస్తవ మతబోధకుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి అనుభవాలను గుర్తు చేసుకునేవాడు.

చర్చి ధార్మిక కార్యక్రమాలలో భాగంగా పేదలకు ఆహారం సరఫరా చేస్తున్న రోజులవి.  ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న స్టాన్ స్వామి, తొలి రోజులలోనే ఇంత కంటే ఎక్కువ చేయవచ్చు అనుకున్నాడు.

జెస్యూట్ చర్చి వ్యవస్థాపకుడు సెయింట్ ఇగ్నటిస్ లయోలా చెప్పిన ‘ఒకటి అత్యవసరం’ అనేది చాలా ముఖ్యమని స్టాన్ స్వామి చెప్పేవాడు. ఈ దోపిడీకి మూలాలేమిటో తెలుసుకోవాలి. అప్పుడే విముక్తి సాధ్యమవుతుంది అనేది దీనర్థం.

ప్రజా పోరాటాల కేంద్రీకృత వ్యవస్థకు, సామాజిక పరివర్తనకు మార్కిస్టు విశ్లేషణే నిజమైన మార్గమని స్టాన్ స్వామి విశ్వ‌సించాడు. తరువాత బెంగుళూరులోని ఇండియన్ సోషల్ ఇస్టిట్యూట్ డైరెక్టర్ గా ఈ ఆలోచనకు పదును పెట్టాడు.

సామాజిక చర్యల్లో పాల్గొనేలా యువతను చైతన్యపరిచాడు. అలా చైతన్యవంతులైన వారిలో యువకుడిగా ఉన్నప్పటి వెర్నన్ గోన్‌ సాల్వెస్ కూడా ఉన్నారు.

ఆలోచనలో స్పష్టత

ఒకే సెల్ లో ఉన్నప్పుడు ఆస్తికవాదం, మతవాదం, విప్లవం, రాజకీయాలు, రాజకీయ పక్షాలు, గిరిజన సమాజం క్యాథలిక్ చర్చి వంటి అనేక విషయాలపైన చర్చలు, గోష్టులు జరిపాం.

సాయంత్రం మమ్మల్ని మా సెల్ లోకి పంపి తాళాలు వేశాక వేయించిన వేరు శెనగపప్పులు తింటూ ఈ చర్చలు సాగించాం. ఈ అన్ని ఆంశాలలో స్టాన్ స్వామి చెప్పే కారణాలు ఎక్కడా డొంకతిరుగుడు లేకుండా, చాలా సూటిగా, స్పష్టంగా ఉండేవి.

అతని వాదనలను పూర్వపక్షం చేయడానికి చేసే మొండివాదనలను చూసి నవ్వుకునేవాడు.  ప్రజల హక్కులకు సంబంధించిన విషయాలలో స్టాన్ స్వామి దృఢచిత్తంతో ఉండేవాడు. వాస్తవాలు చెపుతున్నప్పుడు చాలా సరళంగా, నేర్చుకోవాలనే ఆసక్తితో ఉండేవాడు.

మత బోధకుడిగా చేరిన తొలి రోజుల్లోనే, చర్చిపైన కీలకమైన ప్రశ్నలను సంధించిన 1968నాటి ఫ్రెంచి విద్యార్థుల తిరుగుబాటు, ఆస్తికవాద విముక్తి పట్ల ఆయన ప్రభావితుడైనట్టు అర్థం చేసుకున్నాను. క్రీస్తు జీవితం ప్రభావంతో స్టాన్ స్వామిలో నిరాడంబరత ఏర్పడింది.

స్టాన్ స్వామి దృష్టిలో జీసెస్ అంటే భగవంతుడి పాలనను కోరిన గెలిలియన్. అది భవిష్యత్తుకు సంబంధించి కాకుండా, వర్తమానానికి సంబంధించింది. పీడనకు, తిరస్కారానికి గురైన వారి పట్ల ప్రేమ. తిరుగులేని రోమన్ సామ్రాజ్యంపట్ల, దాని ధర్మాలను అనుసరించడం పై జీసెస్ చెప్పిన మాటలను తరుచూ ఉదహరించేవాడు. మత సంప్రదాయాలను గౌరవిస్తున్నప్పటికీ, సమాజమూలాలను, సామాజిక సారాంశాన్ని అర్థం చేసుకోవాలని భావించేవాడు.

స్టాన్ స్వామి గిరిజన సమాజానికి , సంఘానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరుతో ప్రభుత్వం చేపట్టే హింస నుంచి గిరిజన సమాజాన్ని కాపాడాలని భావించాడు.  అంటే ఆ సంఘం ఆత్మకు రక్షణ కల్పించాలన్నాడు.

స్టాన్ స్వామి ప్రతిఘటన గురించి చదివేటప్పుడు కేవలం మావోయిష్టులని చెప్పబడేవారితో సంబంధాలుగానో, నిబద్ధతగానో భావించడమంటే ప్రజా సంఘం పట్ల అతని నిబద్ధతను గుర్తించడంలో వైఫల్యమే అవుతుంది.

స్టాన్ స్వామి నా కంటే రెట్టింపు వయసున్నవాడు.మా నాన్నకంటే కాస్త చిన్న వాడైనప్పటికి ఆయనతో చాలా పోలికలున్నాయి.  ప్రీస్ట్ గా ఉన్న మా మేనమామకు మంచి స్నేహితుడు.

మా మేనమామ మరణించక ముందు ఇద్దరూ ఆస్తికత్వ విముక్తి విషయంలో సహచరులు.  ముంబయి వెళ్ళినప్పుడల్లా అతని ఇంట్లోనే బస చేసేవాడినని స్టాన్ స్వామి గుర్తు చేసుకునేవాడు.

తమపై పెట్టిన తప్పుడు కేసుల గురించి స్టాన్ స్వామికి అర్థమయ్యేలా చేసేందుకు  నేను, వెర్నెన్ ప్రయత్నించాం.  వెర్నన్ వెళ్ళిపోయాక స్టాన్ స్వామికి చట్టపరమైన విషయాలు చెప్పే బాధ్యత నేను తీసుకున్నాను. మా సంబంధాలు వీటన్నిటికీ అతీతమైనవి.

ఇతర సహ నిందితులకంటే మేం చాలా మంచి స్నేహితులమయ్యాం.  ఇద్దరం కలిసి ఒకే న్యాయం కోసం చేసే పోరాటంలో కుటుంబ సభ్యులయ్యాం.  ఫాదర్ స్టాన్ స్వామి మా అందరి మధ్య కేవలం స్టాన్ గా ఉండిపోయారు.

రాజ్యం ఊహాతీతంగా మా అందరిని ఏకం చేస్తూ కట్టిపడేసింది. బొంబాయి హైకోర్టు 2021 ఫిబ్రవరిలో వరవరరావుకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.

ఆ ఉత్తర్వుతో మేమంతా చాలా సంతోషించాం.  స్టాన్ స్వామి ఆనందానికి అవధులు లేవు. వరవరరావుకు బెయిల్ మంజూరు చేస్తూ, ముంబయి దాటి వెళ్ళకూడదని, సహ నిందితులతో సంబంధాలు నెరపకూదడదని, భీమాకోరేగాన్ కేసులో తన అభిప్రాయాలను పత్రికలకు, చానెళ్ళకు, సామాజిక మాధ్యమాలకు చెప్పకూడదని విధించిన నిబంధనలపట్ల స్టాన్ స్వామి చాలా బాధపడ్డాడు.

చట్టపరమైన ఎత్తుగడల తలతిక్క వ్యవహారాల గురించి చర్చించేటప్పుడు ఆయన దృష్టి కోణాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నిజానికి స్వేచ్చ అంటే ఏమిటో తన లోతైన అవగాహన పట్ల ఆయన అమాయకపు దృష్టి కనిపించింది.

ఆంక్షలు లేని ఉద్యమం మాత్రమే దాని అర్థం కాదు, సత్యం మాట్లాడకలిగే శక్తి, సత్యాన్ని మరొకరికి చెప్పడం, సత్యాన్ని మరొకరితో పంచుకోవడం కూడా ఎవరికయినా ముఖ్యం.

తన జెస్యూట్ సహచరులకు, న్యాయవాదులకు తన బెయిల్ కు సంబంధించిన సమాచారాన్ని తెలియచేయాలన్నది ఆయన కోర్కె. గత మే నెలలో హైకోర్టు స్టాన్ స్వామి వాదనలను వీడియో ద్వారా విన్నప్పుడు ఈ అవకాశాన్ని ఒదులుకున్నాడు.

జైలు నుంచి విముక్తి మాత్రమే తనను జార్ఖండ్ లోని రాంచీ వద్ద ఉన్న తన ప్రజల వద్దకు చేర్చుతుందని భావించాడు. ఇది బోధించడం కాదు, గొప్ప ఆలోచన. స్టాన్ స్మామి అత్యుత్తమ మానవుడు.  ఈ అంచనాల ప్రపంచంలో స్టాన్ స్వామి ఒక మనిషిగా జీవించదలుచుకున్నాడు.

తాను రాసినా, మాట్లాడినా ఎంతో దృష్టి సారించేవాడు. అతని మాటలు అతని అభిప్రాయాలకు ప్రాతినిథ్యం వహించేవి. అతను ఏమైనా చెపుతుంటే ఎవరైనా సరే దృష్టి సారించాల్సిందే. చాలా అరుదుగా మాత్రమే అతను అర్థం లేకుండా మాట్లాడే వాడు.

అధికారులు కూడా అతని మాటలను అర్థం చేసుకోలేకపోయేవారు.  స్థిర చిత్తంతో పలికే అతని కొద్దిపాటి మాటలైనా తీవ్ర ప్రభావం కలగచేసేవి.  అతను చెప్పే చిన్న చిన్న పదబంధాలు కూడా పతాక శీర్షికలవుమతాయి.

మరణ శయ్య పైనుంచి ఆయన చెప్పిన మాటలు కూడా మన నేర న్యాయవ్యవస్థపైన, న్యాయవ్యవస్థపైన, ప్రజాస్వామ్యం పైన మొత్తంగా ఒక గొప్ప వ్యాఖ్యానమవుతుంది.

మే 28వ తేదీ 2021న మేం చివరి సారిగా కౌగలించుకుని, వీడ్కోలు చెపుతున్నప్పుడు ఈ జైలు నుంచి బైటపడతాడనుకున్నాం.

ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే, ఈ వ్యవస్థపైన స్టాన్ స్వామికి నమ్మకం సన్నగిల్లుతోంది. గిరిజనుల, పేదల హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాటం తర్వాత, సమష్టి చర్యల ద్వారా, సహేతుకమైన కారణాల ద్వారా వ్యవస్థ మారుతుందని స్టాన్ స్వామి నమ్మాడు.

భీమాకోరేగాన్-ఎలగార్ పరిషత్ ప్రాసిక్యూషన్ ఈ నమ్మకాలను మాటి మాటికీ వమ్ము   చేస్తూ వ‌చ్చింది. ఈ కేసులో తనని ఇరికించడాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. అతని కంప్యూటర్లో కనుగొన్నట్టు చెపుతున్న ఎలక్ట్రానిక్ ఫైళ్ళు అసలు తన దగ్గర ఉండడం అసంభవం అని స్టాన్ స్వామి చెప్పేవాడు.

అతన్ని అరెస్టు చేసిన కొన్ని నెలల వరకు ఎన్ఐఎ తనను కస్టడీకి ఇమ్మని మాటిమాటికీ తప్పుడు వాద‌న‌లు వినిపించ‌డాన్ని తొలి రోజుల్లో అర్థం చేసుకోలేకపోయాడు.  సున్నితత్వం లేని ఈ  అన్యాయ వ్యవస్థ వల్ల తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు వీటన్నిటినీ గమనించి తనకు బెయిల్ మంజూరు చేస్తుందని నమ్మకంతోనే చివరి వరకు ఉన్నాడు. బెయిల్ పిటీషన్ పై మొదలైన విచారణ విసుగెత్తేటట్టు కొనసాగింది.

ఈ విచారణను కొనసాగించడానికి ఎన్ ఐఏ   రాంచీ లోని ఆయ‌న నివాసంలో తవ్వితీయడానికి ప్రయత్నించి, అతని పూర్వ జెస్యూట్ సహచరులను వేధించింది. ఇది స్టాన్ ని బాగా బాధించింది.

స్టాన్ స్వామి బెయిల్ ను తిరస్కరిస్తూ చివరికి ప్రత్యేక ఎన్ ఐఏ జడ్జి ఇచ్చిన ఆదేశాల సారాంశాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. ఎస్ ఐ ఏ చేసిన ఆరోపణలన్నిటినీ న్యాయస్థానం అంగీకరించింది. బెయిల్ పిటీషన్‌ను తిరస్కరిస్తూ జడ్జి ఇచ్చిన ఆదేశాలను మాటిమాటికీ చదువుతూ సాయంత్రమంతా మౌనంగా ఉండిపోయాడు. ఇది ఏప్రిల్ తొలిరోజులు. స్టాన్ స్వామి ఆలోచనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

అతనిలో ఉన్న హాస్యప్రియత్వం క్రమంగా మాయమవుతోంది. ఏప్రిల్ 26వ తేదీన అతని పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన లెక్కలేనన్ని శుభాకాంక్షలు కూడా అతని పరిస్థితిని మెరుగుపరచ లేకపోయాయి.

అతనిలో పెరిగిన బలహీనత అతని నరాల సమస్యకు పాకింది.  వినికిడి సమస్య పెరిగింది.  అతనికున్న పార్కిన్సన్ సమస్య మరింత తీవ్ర‌త‌ర‌మైంది.  పత్రికలు కూడా చదవలేనంతగా చూపు మందగించింది.

స్టాన్ స్వామికి మేం చివరి సారిగా వీడ్కోలు పలుకుతున్నప్పుడు , అతను కోలుకుంటాడనుకున్నాం. (బెయిల్ తిరస్కరించిన బాంబాయి హైకోర్టు స్టాన్ స్వామిని ప్రైవేటు హెలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించాలని మే 28న ఆదేశించింది).

నా అంచనా తప్పు. అతను కోరుకున్న స్వేచ్చ చాలా దూరంగా ఉంది. ఎంత దూరంగా ఉందంటే అలసిన అతని శరీరం కూడా ఓర్చు కోలే నేంతగా.

‍(అరుణ్‌ ఫెరెరా , తలోజా జైలులో స్టాన్ స్వామి సహచరుడు. How the System Broke Stans Swamy ఆయన తన జ్ఞాపకాలను పంచుకున్నారు. సౌజన్యం scroll.in)  )

అనువాదం : రాఘవ శర్మ

(ఆలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *