కేసిఆర్ పదిమంది ప్రశాంత్ కిశోర్ ల పెట్టు

“కొందరు మేధావులు ఎక్కడో బాగా మండితే తప్ప ఇలా రాయలేరు”

 

(బి ఎస్ రాములు)

కేసిఆర్ పది మంది ప్రశాంత్ కిషోర్ లపెట్టు అని పేరు. ఎన్నికల్లో గెలుపు వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్, కెసిఆర్ లను మించి పోయి కౌశిక్ రెడ్డి అనే ఒకాయన గవర్నర్ కోటాలో యం ఎల్ సీ సీటు సంపాదించారు. ఏకంగా రాష్ష్ట్రమంత్రి వర్గం వారికి అండగా నిలిచింది. ఇరవై ఏళ్లుగా పార్టీ కోసం , ఉద్యమం కోసం పని చేస్తున్న వాల్లు చూస్తుండగానే గద్ద తన్నుక పోయినట్టు ఎమ్మెల్సీ తన్నుక పోయారు. ఇది కెసి ఆర్ పై , టిఆర్ ఎస్ సీనియర్లపై కౌశిక్ రెడ్డి సాధించిన విజయం. స్పష్ఠంగా ఇది కెసిఆర్ ఓటమి.

స్పీకర్ మధుసూధనాచారి మొదలుకొని ఎమ్మెల్సీ కోసం చాంతాడంత క్యూ అలా నిరీక్షిస్తూ ఉండగానే కౌశిక్ రెడ్డి ఇలా వేటాడి పట్టేసుకున్నాడు. అంతిమంగా ఇది దశాబ్దాలుగా పని చేస్తున్న సీనియర్లకు తీరని అవమానం, తీరని అన్యాయం.

ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎవరివైపుంటే వారి విజయం ఖాయం అని శరద్ పవార్ వంటి వ్యూహ నిపుణులు కూడా చర్చించారు. సోనియా గాంధీ ఏకంగా పార్టీలోకి ఆహ్వానించారు. బెంగాల్ లో మమతా బెనర్జీని, తమిళనాడులో స్టాలిన్ ను , గతంలో నరేంద్ర మోడీని గెలిపించిన నైపుణ్యం ప్రశాంత్ కిషోర్ ది. అలాంటి పి కె లు తెలంగాణలో పదిమంది దాకా ఉన్నారని అన్నారొక సీనియర్, మేధావి, ఇండిపెండెంటు జర్నలిస్టు.

బహుశ కౌశి క్ రెడ్డి లాంటి వారిని చూసే ఆ మాట అని ఉంటారు. కెస్ఆర్ పదిమంది పి.కె లపెట్టు అని ప్రశంసించిన వారున్నారు. కాని ఎందుకో దుబ్బాకలో , హైదరాబాద్ మహానగరంలో బిజెపి గెలిచేందుకు అవకాశం ఇచ్చారు.
అయితే కౌశిక్ రెడ్డి విజయం గానీ, బండ శ్రీనివాస్ కార్పోరేషన్ చైర్మన్ కావడం గానీ, ఆరేడు లక్షల కొత్త పెన్షన్దారులు, కొత్త రేషన్ కార్డులు గానీ, దళిత బంధు గానీ ఈటల రాజీనామా సాధించిన విజయాలే అని కెసిఆర్ కు లోపల కోపంగా ఉంది.

ఎన్నికలు మొదలు కాకముందే తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్ర శస్త్రాలు ఒక్కొక్టి వదులు తున్నారు. ఎన్నికలు మొదలైన తరువాత అమ్ముల పొదిలో ఏమైనా మిగిలి ఉంటాయో లేదో! అనుమానమే!

తుఫాన్లు వచ్చినా, సముద్రాలు ఉప్పొంగినా లక్ష తిట్లు తిట్టినా చలించని వీరుడుగా ముద్ర పడిన కెసిఆర్ ఈ మధ్య ప్రతి దానికి ఉలికి పడుతున్నారు.

ఎవరు ఏం చెప్తే వినాల్సి వస్తుందో అని ప్రగతి భవన్ తలుపులతో పాటు చెవులు కూడ మూసుకున్నారు. ఎవర్నీ దగ్గరికి రానీయడం లేదు. దగ్గరున్నవారు ఎందుకొచ్చిన రిస్కు అని నోటికి ప్లాస్టర్ వేసుకున్నారు.

ఒక పెద్ద ఉదాహరణతో చెప్పాలంటే రెండేళ్ల క్రితం సాగిన ఆర్టీసీ సమ్మెతో ఈ వణుకుడు , బ్యాలన్స్ తప్పడం మొదలైంది. మీకు మీరే డిస్మిస్, ఆర్టీసీ రద్దయిపోయింది. కోర్టు అడిగినా పైసలు లేవుపో అన్నారు. చివరికి తొడ పాశం పెట్టినాక కొడుకు వాడంతా విన పడేట్టు ఏడుస్తుంటే అడిగిన ఐదు పైసలకు బదులు పది పైసలిచ్చి జోకొట్టినట్టు చేసినప్పటి నుండి కెసి ఆర్ లో వణుకుడు, అభద్రత మొదలైంది.

ఆ మాటకొస్తే రెండోసారి ఎన్నికల్లో గెలిచినప్పటినుండి వణుకుడు మొదలైంది. ఎవరిని నమ్మబుద్దికాక రెండు నెలలు మంత్రులనే తీసుకోలేదు. అసలు మంత్రులెందుకు? ఈ టీచర్ల సంగాలెందుకు? ఈ ఉద్యోగ సంగాలెందుకు? ట్టేడ్ యూనియన్లు ఎందుకు? అనే కొత్త ఆలోచనలు పురి విప్పాయి.

తనను మించిన మేధావి, తనను మించిన ప్రజల శ్రేయోభిలాషి ఎవరున్నారనే భావన రక్తంలో ఇంకి పోయింది. హిట్లర్ కూడ అట్లనే జర్మన్ జాతి గౌరవం అంటూ ప్రజల హృదయాలు చూర గొన్నారు. హిట్లర్ ను నమ్మినందుకు ఆరు కోట్లమంది హతులయ్యారు.హిట్లర్ ప్రజల హృదయాలను గెలుచుకున్న గొప్ప వీరుడే. హిట్లరంటే కెసిఆర్ కు చాలా అభిమానం కూడ.

కెసిఆర్ కొన్ని సమస్యలకు భలే ఉపాయం కనుక్కున్నారు. ఉదాహరణకు ఇప్పటికే ఇరవై లక్షలమంది నిరుద్యోగులున్నారు. ఇంకా చదువుకొని ఏం చేస్తారని స్కూల్లకు, కాలేజీలకు, యూనివర్సిటీలకు బోధన సిబ్బందిని నియమించక పోతే సరి అనుకున్నారు. పకడ్బందీగా పోలీసులైతే ఉండాలె అని వేల మందిని రిక్రూట్ చేసుకున్నారు. ప్రజలకోసం 415 దాక రకరకాల పథకాలు , పనులు ప్రారంభించారు. ఇట్లా పి కెకు తెలియని ఎన్నో రహస్యాలు అధికారానుభవంతో ఓట్లు ఎట్లయితే పడుతాయో తెలిసి పోయింది. ప్రత్యక్ష బడుగు వర్గాల లబ్దిదారులు నిజాయితీగా ఓట్లేస్తారని తెలుసుకున్నారు.

ఆసరా పథకంతో 42 లక్షలమందితో మా పెద్ద కొడుకు అనిపించుకున్నారు. ఇపుడు మరికొన్ని జారీ చేయనున్నారు. ఇలా ఇందులో 35 లక్షలదాకా మహిళలు , వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికులు, వృద్దులు పెన్షన్ పొందుతున్నారు. కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ తో మామేన మామ అనిపించుకున్నారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, రైతు బంధు, చేపల పంపిణి, గొర్రెల పంపిణీతో , గౌడులకు, రైతులకు తదితరులకు బీమాతో అన్నదాత అనిపించుకున్నారు. ఇలా కులాల వారీ జనాభాతో, రైతుల జనాభాతో లెక్కలు చూసి ప్రత్షంగా లబ్ది చేకూర్చే పనులు చేపట్టారు. అలా సగం జనాభా కవర్ అయిపోయింది. ఇంకా 60 క్ష. దళితులు, 16 లక్షల నేతన్నలు, 50 లక్షల ముస్లిములు తొమ్మిది లక్షల విశ్వ కర్మలు, 22 లక్షల లంబాడాలు, 10 లక్షల రజకులు వగైరా ఈ ల్ది దారులలో చేర లేదు. అన్ని కలిసి 915 రెసిడెన్షియల్ స్కూల్లలో నాలుగున్న లక్షలమంది బాలబాలికలు లబ్ది పొందుతున్నారు. కుల వృత్తుల వారీగా ప్రత్యక్ష ప్రయోజనం చేకూరిస్తే ఓటు బ్యాంకుగా నిలుస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తే ఓటు బ్యాంకు రూపొందక పోగా ఇంకా అదికావాలి, ఇది కావాలంటారు. విద్యా బడ్జెట్ ద్వారా పార్టీ శ్రేణులకు ఇతర రంగాలలో వలె పర్సెంటేజీలు రావు. నిరుద్యోగులకు లోన్లు ఇచ్చినా ఓటు బ్యాంకు గా రూపొందే అవకాశం లేదు. అందుకని మూడేండ్లుగా బీసీ కార్పోరేషన్ ద్వారా లోన్లివ్వడం లేదు. యూనివర్సిటీ విద్యకు ఎంత చేస్తే అంత వ్యతిరేక శక్తులుగా ఎదుగుతారు.

బీసీలను రాజకీయంగా అవకాశాలిస్తే స్వతంత్రంగా ఎదుగుతారు. అందుకని ఎవరు ఇప్పటికే బలంగా ఉన్నారో అలాంటి రెడ్లను సంతృప్తి పరుచుకుంటూ సాగితే చాలు. … ఇలాంటి ఆలోచనల వల్ల ఆయా రంగాలు, సామాజిక శక్తులకు ప్రోత్సాహం కరువైంది.

లేకపోతే స్పీకర్ మధుసూదనాచారిని పక్కన పెట్టి ఎవరెవరినో రాజ్యసభకు, ఎమ్మెల్సీలకు పంపడం ఎందుకు జరుగుతుంది? గుమ్ముల నిండ విత్తులుండాలె. గూటాలోలె బిడ్డలుండాలె అన్నట్టు రాజకీయ పిసినారి తనంతో అన్నీ నాకే ఉండాలె అనే చిన్న పిల్లాడిలా ప్వర్తించడం విడ్డూరం.

తనను మంత్రి నుంచి పీకేసి డిప్యూటీ స్పీకర్ గా వేస్తే ఎంత బాధ పడ్డాడో తనకు తెలియదా?

తాను రెండుసార్లు ముఖ్యమంత్రి అయి ఏడేండ్లుగా పని చేస్తూ సహచరులకు రెండోసారి కంటిన్యూ చేయలేకపోవడం పిసినారి తనమో, ఓర్వలేని తనమో అర్థం కావడం లేదు.

BS Ramulu

రైతుబంధు పథకంతో ఎవరికి ఎంత అందుతుందో తెలుసుకున్నారు. రాల్లురప్పల భూమికి కూడా రైతు బంధు తెలిసే ఇవ్వడం జరిగింది. నలభయి ఏండ్లుగా ఎన్నో కష్టాలు పడి నిర్బంధాలు ఎదుర్కొని సాధించి సాగు చేసుకుంటున్న పొలం చెక్క అనుభవదారు కాలం తీసేసి ఎవరికి చెందాలో వారికి చెందేట్టు చేశారు.

నలభయి ఏండ్ల పోరాట ఫలాలను రైతుబంధు పేరుతో వమ్ముచేయగలిగారు. ఇంత సనాయాసంగా ఈ పని చేయగల తెలివిగల వారు మరెవరైనా ఉన్నారా?అనుమానమే.

ఎస్సీ ఎస్టీల రాజ్యాంగ బద్దంగా రావలిసి సొమ్మును దారి మల్లించి కూడా గొప్ప పేరు సంపాదించడం కెసిఆర్ సాధ్యమైంది. అదెట్ల జరిగిందో ఆశ్ర్యం! నిన్నటికి నేటికి రేపటికి ఎంత మార్పో! నిన్న నేను చెప్పిందే నేడు ఎలా తిరగబడిందో ఆశ్చర్యం!

నిన్నటి మాట! దళితబంధు అనే ఒక్క మాటతో దేశం కదలబారింది. దాన్ని విస్తృతంగా అమలు చేయాలనే వాదం పెరిగింది. ఎవరైనా సరే ఏ రంగంలోనైనా సరే తమ భావాలకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో కదిలించేవారే లీడర్లు. నడిపించే వారే నాయకులు. వారిని అనుసరించినా వ్యతిరేకించినా వారంతా అతని ఫోలోయర్లే. లీడ్ చేసే వాడే లీడర్. రైతు బంధు, దళిత బంధుకు వ్యతిరేకంగా , అనుకూలంగా మాట్లాడే వారంతా కెసిఆర్ ఫాలోయర్లే. కెసిఆర్ కు వెనకబడి పోయిన వారే.ఇలా ప్రతి పక్షాలు, సామాజిక ఉద్యమకారులు కూడా కెసిఆర్ కు ఫాలోయర్లే. లేదా వెనుకబడిపోయిన వారే. కేసీఆర్ ఫాలోయింగ్ పెరగడం వారి విజయమే. ఇది అంతకన్నా గొప్పనైన నినాదాలిచ్చి తమవైపుకు చర్చను తిప్పుకోవాలి.

కనీసం ఈ సందర్భంగా ఎస్సీల సొమ్ము దారి మల్లించాడనే విషయం , విమర్శ మరిపించాడంటే దళిత బంధు పేరుకోసం ఎంత శ్రమపడి ఉంటాడో!

ప్రతి పార్టీ లో ప్రతి ఉద్యమంలో కెసిఆర్ వంటి మేధావుల చింతనాపరుల అవసరం ఉంటుంది. జయాపజయాలు వీరి నిర్ణయాత్మక శక్తి మీద శక్తిసామర్థ్యాల మీద వీరు వేసే ప్రభావాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ విషయం అర్థం అయిన వారే మేధావులకు పెద్ద పీట వేస్తారు. చాలా పార్టీల్లో లో మేధావుల కొరత ఉంది. అదే కేసీఆర్ బలం. అని ప్రతి విషయంలో ప్రతిగా ప్రత్యామ్నాయంగా నూతన ప్రతిపాదనలు చేయలేకపోవడంలో గమనించవచ్చు. మేధావుల పాత్ర ఎంత ప్రధానమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది నిన్నటి విషయం.

నేటి మాట! వివిధ రంగాల్లో నిపుణులైన వారికి ఇవ్వాల్సిన గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కి ఇవ్వాలను కోవడం కెసిఆర్ దృష్టిలో మేధావులకు ఉన్న స్థానం ఏమిటో చెప్పకనే చెప్పారు.

తాత్కాలిక అవసరాలు ఆవేశాలు ఒత్తిడులు దీర్ఘకాలిక చరిత్ర పరిణామాలను నిర్ణయిస్తుంటాయి . నేటి అవసరాలు, పరిసరాలు రేపటి జయాపజయాలకు కారణమవుతాయి. ఏడాదిగా ఎంతో మంది మేధావులను సాహితీ వేత్తలను ఉద్యమకారులను ఊరించిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇలా కెసిఆర్ గారి తాత్కాలిక ఆవేశంతో వారి ఆశలు గంగ పాలయ్యాయి.

ఈ తాత్కాలిక ఆవేశపూరిత నిర్ణయాలు రేపటి భవిష్యత్తు జయాపజయాలను నిర్ణయిస్తాయి. టిఆర్ఎస్ కూడా క్రమంగా మేధావులను దూరం చేసుకుంటూ ప్రతిపక్షాల వలెనే భావ దారిద్ర్యం లో ఎలా కూరుకు పోయిందో ఇది తెలుపుతుంది.ఇలా నిన్నటికి నేటికి రేపటికి ఎన్ని మార్పులు జరుగుతాయో! ఇది నేటి మాట! రేపు ఇంకేం చెప్పాల్సి వస్తుందో! ఇంకా ఎన్న చీకటి పార్శ్వాలు ఇంకెన్ని ఉన్నాయో కేంద్రానికే ఎరుక.

( బి.ఎస్.రాములు,సామాజిక తత్వవేత్త. సెల్ 8331966987)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *