అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటే ఏమిటి? : సజ్జల వివరణ

(సజ్జల రామకృష్ణారెడ్డి)

అమరావతి రాజధాని’ పేరు మీద భూముల సేకరణ ల్యాండ్‌ పూలింగ్‌ (Land pooling) స్కీమ్‌ పెట్టి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు.   రాజధాని ఎక్కడ పెడుతున్నారనేది వారికి తెలుసు కాబట్టి,రాజధాని ప్రకటనకు ముందే   తక్కువ రేటుకు ముందే  భూమి కొని, ఆ తర్వాత రాజధాని ప్రకటన చేసి ఎక్కువ ధరకు అమ్ముకోవడం లేదా ఆ భూములకు ధర వచ్చేలా చేయడం జరిగింది. ఇదే ఇన్ సైడర్ ట్రేడింగ్.

‘రాజధాని గురించి ముందే తెలుసుకుని 2015 జనవరిలో రాజధాని గురించి చెప్పి, కామ్‌గా భూసేకరణ చేశారు. 2016 ఫిబ్రవరిలో ల్యాండ్‌ పూలింగ్‌ చట్టానికి సవరణలు చేశారు. అప్పటికే పేదల నుంచి అసైన్డ్‌ భూములు రాయించుకున్నారు. అలా పేదలకు చాలా అన్యాయం చేసి, కేవలం పెద్దలకు మాత్రమే జీఓ నెం.41 ద్వారా ప్రయోజనం కల్పించారు. నిజాయితీ ఉంటే పేదల భూములను కూడా ల్యాండ్ పూలింగ్ లో  ముందే చేర్చి వారికి కూడా లబ్ది చేకూర్చి ఉండాలి.

ఇది రెవెన్యూ అధికారుల ద్వారా జరిగింది కాదు. నాడు సీఆర్డీఏ ఛైర్మన్‌ సీఎం చంద్రబాబునాయుడుకి  పీఓటీ, అసైన్డ్‌ భూములతో సమస్యలు వస్తాయని నాటి సీఆర్డీఏ అధికారి ఎన్‌.శ్రీకాంత్‌తో పాటు, రెవెన్యూ, న్యాయ శాఖ కార్యదర్శులు చెప్పినట్లు రికార్డులో కూడా ఉంది.

అయినా జీఓ నెం.41 ద్వారా అసైన్డ్‌ భూములు, ఇతర భూములను కూడా ల్యాండ్‌ పూలింగ్‌లో చేర్చారు. ఇంత పెద్ద కుంభకోణం అంత పచ్చిగా కళ్ల ముందు కనిపిస్తున్నా, వారు సమర్థించుకుంటున్నారు.

అతి పెద్ద స్కామ్‌:

‘ల్యాండ్‌ పూలింగ్‌ అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద స్కామ్‌. అందులో భాగమే అసైన్డ్‌ భూములకు సంబంధించి ల్యాండ్‌ పూలింగ్‌ చట్టంలో సవరణలకు నిర్దేశించిన జీఓ నెం.41.

ఆ స్కామ్‌ల ద్వారా దూర, దురాలోచన చేసి, కేంద్ర బడ్జెట్‌ స్థాయిలో అక్రమాస్తులు సంపాదించాలన్న ఉద్దేశంతో పని చేశారు. కేవలం తమ వారికి లబ్ధి చేకూర్చడం కోసమే ల్యాండ్‌ పూలింగ్‌ చట్టంలో సవరణలు చేస్తూ, జీఓ నెం.41 జారీ చేశారు. అంతకు ముందే నిరుపేద రైతుల నుంచి అసైన్డ్‌ భూములు లాక్కున్నారు. జీఓ నెం.41 ద్వారా ఆ భూములను కూడా ల్యాండ్‌ పూలింగ్‌లో చేర్చి ప్రయోజనం కల్పించారు’.

‘దాంతో పాటు, పేదల భూములు కూడా కొల్లగొట్టారు. అసైన్డ్‌ భూములు బెదిరించి, ప్రలోభపెట్టి తీసుకున్నారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, వారి బినామీలు, తాబేదార్లు, చంద్రబాబు కోటరీలో ఉన్న వారు పేదల భూములను చౌక ధరకు అగ్రిమెంట్లు పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత ల్యాండ్‌ పూలింగ్‌ గైడ్‌లైన్సులకు సవరణలు చేసి, వారికి లబ్ధి చేకూర్చారు.

అదే జీఓ నెం.41. దీంట్లో అప్పుడు సీఆర్డీఏ (Capital Region Development Authority) ఛైర్మన్‌గా ఉన్న సీఎం చంద్రబాబునాయుడు, మున్సిపల్‌ మంత్రి నారాయణ సంతకం కూడా ఉంది. అది అసైన్డ్‌ భూమి కాబట్టి, పరిహారం రాదని పేదలను బెదిరించి, అగ్రిమెంట్లు చేసుకుని, ఆ తర్వాత జీఓ నె.41 ద్వారా లబ్ధి పొందారు. ఈ కేసులో చంద్రబాబు ఏ–1గా ఉన్నారు’.

రాజధానిపై ప్రేమ లేదు:

‘అయితే వ్యవస్థలను మేనేజ్‌ చేసే తెలివితేటలు ఉన్న చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. నిజానికి చంద్రబాబుకు రాజధానిపై ప్రేమ లేదు. అదే ఉంటే, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెట్టేవాడు. కానీ ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో వేల ఎకరాలు సేకరించి, రియల్‌ ఎస్టేట్‌ దందా చేశారు. దీనిపై ఆరోజు కూడా మేము మాట్లాడాము. కానీ ఇప్పుడు స్టే తెచ్చుకుని, తాము నిర్దోషులము అని చెప్పుకుంటున్నారు’.

కేసే లేదని చెప్పే ప్రయత్నం:

‘అయితే ఇప్పుడు వారు కొత్త వాదన మొదలు పెట్టారు. ప్రభుత్వం కొందరిని బెదిరించి, కేసులు పెట్టించారని ప్రయత్నం చేస్తున్నారు. సీఎం గారిపై బురద చల్లాలని చూస్తున్నారు. అసలు కేసే లేదన్న ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్న స్టింగ్‌ ఆపరేషన్‌ అన్నారు. తమను ఈ ప్రభుత్వం వేధిస్తోందని చెప్పారు. అయితే మేము చెబుతోంది ఒకటే. జీఓ నెం.41 అనేది కేవలం, వాళ్ల వాళ్లందరూ చౌకగా అసైన్డ్‌ భూములు రాయించుకుని, ఈ జీఓ ద్వారా ల్యాండ్‌ పూలింగ్‌ గైడ్‌లైన్సులకు సవరణలు తీసుకువచ్చి, వారికి లాభం కలిగించేందుకు చేసిన ప్రయత్నం’.

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే

‘నాడు సీఆర్డీఎ ఛైర్మన్‌గా ఉన్న సీఎం చంద్రబాబునాయుడు ఉద్దేశాలు మంచివే అయితే, నిజంగా అసైన్డ్‌ భూములు కలిగి ఉన్న వారికి ప్రయోజనం కలిగించాలి. ల్యాండ్‌ పూలింగ్‌ చట్టంలో అసైన్డ్‌ భూములను కూడా ఎందుకు చేర్చలేదు? వారికి కూడా న్యాయం చేయాలని ఎందుకు చూడలేదు? అంతే కానీ ఆ భూములు రాయించుకుని, వారికి మాత్రమే ప్రయోజనం కల్పించారు’.

 

( ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ చెప్పిన విషయాలు)

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *