’తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు‘

రాష్ట్ర శాసనసభలో ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. మొదట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ ఎస్ లోకి లాక్కున్నారు, ఇపుడు మా నోటికాడి మైకును కూడా మాట్లాడకుండా లాక్కుంటున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో అసెంబ్లీ లో బాగా బలహీన పడిన కాంగ్రెస్ కష్టాల గురించి ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క ఈరోజు మీడియాకు వివరించారు.

‘అధికార పక్షం మా గొంతు నొక్కుతోంది. మైక్ కట్ చేస్తోంది.అధికార పక్షానిది నియంతృత్వ  వైఖరి,’ అంటూ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిని నిరసిస్తూ సభ నుంచి కాంగ్రెస్ శాసనసభా పక్షం వాకౌట్ చేశామని అనంతరం మీడియాతో మాట్లాడుతూ భట్టి చెప్పారు.

శాసనసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సీఎల్పీ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు.

‘ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు, సమస్యలపై చర్చించి పరిష్కారం కనుగొనేందుకు మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతునొక్కుతున్నా’రని బట్టి అన్నారు.

అనేక అంశాలను సభ ద్రుష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రయత్నిస్తే.. ప్రభుత్వం అడ్డగోలుగా.. పదేపదే మైక్ కట్ చేయిస్తూ.. మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుండా కనీసం నిరసన తెలిపేందుకు కూడా మైక్ ఇవ్వకుండా అడ్డుకోవడం ఏమిటని భట్టి ప్రశ్నించారు.

కేవలం మంద బలం ఉంది కదా అని .. మా గొంతు నొక్కుతూ ..ప్రజా స్వామ్యాన్ని ప్రబుత్వం ఖూనీ చేస్తోందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం కాంగ్రెస్ శాసనసభా పక్షం మాత్రమే.. మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. ఎటువంటి అప్రజాస్వామిక వ్యాఖ్యలు చేయకపోయినా, సభకు మేము క్షమాపణ చెప్పాలని మంత్రులు చెప్పడం మా గొంతు నొక్కడంలోని కుటిల ప్రయత్నమే తప్ప మరేం కాదని భట్టి మండిపడ్డారు.

ఈ ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో వ్యవహరిస్తూ  ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా టీఆర్ఎస్ లో కలుపుకున్నారని అన్నారు.

ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండ కూడదని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. చెప్పే అంశాలనే భజన చేస్తూ సభ నడవాలని ప్రభుత్వం కోరుకుంటోందని భట్టి అగ్రహంగా చెప్పారు. ప్రభుత్వ వైఖరి అంతిమంగా రాష్ట్ర ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని భట్టి తీవ్రస్థాయిలో చెప్పారు.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకునే భాధ్యత మాపైనా, మీడియాపైనా, ప్రజలపైనా ఉందని భట్టి చెప్పారు. దళిత, గిరిజన, రైతుల, నిరుద్యోగ యువతీ యువకుల, ఉద్యోగస్తులు, పెరుగుతున్న నిత్యావసన సరుకుల ధరలు, నిరుద్యోగ సమస్యలపైన .. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పైన .. లా అండ్ ఆర్డర్ పైన మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకోవడం తప్పా.. అని భట్టి మీడియాను ఉద్దేశించి అడిగారు. సభలో మాట్లాడకుండా మా గొంతు నొక్కడం ప్రభుత్వం దురహంకార పూరిత వైఖరికి నిదర్శనం అని భట్టి విక్రమార్క చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *