విశాఖ ఉక్కు సమ్మె సైరెన్ మోగింది…

విశాఖపట్నం:విశాఖ ఉక్కు ను ప్రయివేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె సైరెన్ మోగించింది.  14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని ఉక్కుపరిరక్షణ పోరాట కమిటీ  నోటీసు ఇచ్చింది.

ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని, సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం రద్దు చేయాలని, పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ RINL  సీఎండీకి గురువారం సమ్మె నోటీసు అందజేశారు.

ఆర్‌-కార్డు ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని ఉక్కుపరిరక్షణ పోరాట కమిటీ స్పష్టం చేసింది.

‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’, ‘అమ్మేదెవరు-కొనేదెవరు’ అనే నినాదాలతో ఉక్కు ఉద్యోగులు, నిర్వాసితులు, ఉద్యమకారులు  గత కొన్ని రోజులుగా విశాఖలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నామని, ఆందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాటా ఏమీ లేదని  సోమవారం నాడు పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి, ఆంధ్ర ప్రదేశ్ కోడలని పేరున్న నిర్మలా సీతారామన్  చేసిన ప్రకటన రాష్ట్రంలో బాగా అసంతృప్తి రగిలించింది. ఈ ప్రకటనతో నిరసనలు  ఉద్ధృతమయ్యాయి.

ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపుతో మంగళవారం ఉదయం స్టీలుప్లాంటు పరిపాలన భవనాన్ని ఉద్యోగులు ముట్టడించారు. స్టీలుప్లాంటు డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) వేణుగోపాలరావు కారును చుట్టుముట్టి కదలకుండా ఆపేసి నిరసన తెలిపారు.అదే విధంగా  ఆరు గంటల పాటు డైరెక్టర్‌తో పాటు హెచ్‌ఆర్‌ విభాగం ఈడీ బాలాజీని చెట్టు కిందే నిలబెట్టేశారు.

ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *