జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బతగిలింది.  పంచాయతీ ఎన్నికల నిర్వహణకు  సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  పంచాయతీ ఎన్నికలను జరపవచ్చని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం,ఉద్యోగుల సంఘాలు వేసిన పిటిషన్  పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్నికలను నిర్వహించవచ్చిన పేర్కొంది.

ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్ లను జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం  కొట్టి  వేసింది.  యధావిధిగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని సుప్రీం కోర్టు చెప్పింది. ముఖ్యంగా, ఎన్నికల కమిషన్ మీద యుద్ధం ప్రకటించిన ఉద్యోగుల సంఘం తీరుమీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించకుండా, హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా  పిటిషన్ వేయడం ప్రమాదకరమని సుప్రీం కోర్టు  ధర్మాసనం వ్యాఖ్యానించింది.  ఉద్యోగ సంఘాల ప్రవర్తన మీద అభ్యంతరం వ్యక్తం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. గోవాతో చాలా  రాష్ట్రాలు ఎన్నికలు వాయిదా వేశాయని, కరోనా వ్యాక్సినేషన్‌ కోసమే గోవా ఎన్నికలు  వాయిదా వేసిందని  రోహత్గి కోర్టుకు నివేదించారు.

హైకోర్టు  సింగిల్‌ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారని కూడా చెబుతూ  వ్యాక్సినేషన్ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమని  ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతూ ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం ఉందని కోరారు.

న్యాయమూర్తి జస్టిస్ కౌల్ ఈ వాదన తో ఏకీభవించలేదు. “ఎస్‌ఈసీపై మీరు రాసిన విధానం మీ ఆలోచనలను తెలుపుతుంది. ఉద్యోగ సంఘాలు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. ‌కరోనా తీవ్రత ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారు. తీరా  కరోనా ప్రభావం తగ్గినప్పుడు ఎన్నికలు వద్దంటున్నారు.  బెంగాల్‌లో ఎన్నికల కోసం  ఆదేశాలిస్తున్నాం. అలాంటపుడు ఆంధ్రలో   ఎన్నికలు ఆపమని ఎలా చెప్పాలి?,’ అని జస్టిస్‌ సంజయ్‌కౌల్‌ ప్రశ్నించారు.

ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్లడం సరికాదని  కరోనా ఎక్కువగా వున్న కేరళలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన విషయాన్ని   జస్టిస్‌ కౌల్ గుర్తు చేశారు.

 

స్తంభించిన ఎన్నికల ప్రక్రియ

రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు ఉద్యోగులు ఈ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తూ ఎన్నికల సమిషన్ కు  సహాయ నిరాకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో  పంచాతీయ ఎన్నికల సందడి కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు కావాలి.   నామినేషన్ల వేయడం ఈరోజు జరగాలి. అయితే, జిల్లాలవారీగా  జిల్లాల కలెక్టర్లెవరూ నోటిఫికేషన్లు ఇవ్వలేదు.అధికారులంతా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఫలితంగా నామినేషన్ల ప్రక్రియ మొదలే కాలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అనుకూలంగా వస్తే వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని కొన్ని జిల్లాలో  అధికారులుచెబుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

జాగ్రత్తగా ఎన్నికలు జరపండి అని హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల సంఘాలు వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. ఇవి ఈరోజు మధ్యాహ్నం బెంచ్ పరిశీలనకు రానున్నాయి. ఇరుపక్షాలు తమకే అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నాయి. కోర్టు తీర్పును గౌరవిస్తామని చెబుతున్నాయి.

ఈ రోజు ఈ వ్యవహారం   సుప్రీం కోర్టు విచారణకు రానుంది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్,ఉద్యోగుల సంఘాలు వేసిన పిటిషన్ రెండూ ఈ   మధ్యాహ్నం విచారణకు వస్తున్నాయి. ఎన్నికల భవితవ్యం సుప్రీంకోర్టు ఉత్తర్వుల మీద ఆధారపడి ఉంటుంది. అధికారులందరికి రాష్ట్రప్రభుత్వం అండదండలుండటంతో  ఎన్నికల కమిషన్ ఉనికినే గుర్తించడం మానేశారు.

దీనితో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాయకత్వంలోని  రాష్ట్ర ఎన్నికల కమిషన్  భవిత్యవం ప్రశ్నార్థకమయింది. కమిషన్ కు ప్రాణం రావాలంటే సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావాలి. అదే విధంగా పరువు నిలబడాలంటే, సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావాలని ప్రభుత్వం,ఉద్యోగుల సంఘాలు ఎదురుచూస్తున్నాయి.

షెడ్యూల్ ను అమలు పర్చని అధికారుల  మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవచ్చు. ఎవరు తీసుకోవాలి? తీసుకోవలసింది ప్రభుత్వమే. ఇపుడా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ను గుర్తించడమే లేదు.

కారణమేదయిన ఈ పరిణామం నుంచి ఒక పాఠం స్పష్టం. రూలింగ్  పార్టీ అనుకుంటే  అధికారులందరిని కంట్రోల్ చేస్తూ రాజ్యంగ సంస్థను కూడా పనిచేయకుండా చేయవచ్చు. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికి ఇదొక సిగ్నల్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *