తెలంగాణలో బిజెపి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ సాధ్యమేనా?

తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ ఎస్ ) పల్స్ వీక్ కావడానికి, కాంగ్రెస్ పార్టీ పల్స్ పూర్తిగా పడిపోతుండటానికి, భారతీయ జనతా పార్టీ పల్స్ హుశారుగా కొట్టుకోవడానికి కారణం ఒక్కటే…సెంటిమెంట్.
అరేళ్ల తర్వాత తెలంగాణలో టిఆర్ ఎస్ కు బాగాపని కొచ్చిన తెలంగాణసెంటిమెంట్, ఆంధ్ర వ్యతిరేక సెంటిమెంట్ తడారిపోయి ఎక్స్ పైర్ అయింది.
ఇపుడాపార్టీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకురాలేదు. ఆంధ్రోళ్ల వలస పాలనలో సర్వం  పోయిందని వాపోలేదు. ఎందుకంటే చివరి సారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పునరాగమనాన్ని అడ్డుకునేందుకు  ఈ నాటు మందు ప్రయోగించింది. అది బాగా పనిచేసింది.  అంతే, ఫసక్. ఆ చాప్టర్ క్లోజ్ అయింది. అదిపుడు పనిచేయడం లేదు. ఆంధ్ర నాయకులు, వాళ్ల పార్టీలు తెలంగాణలో కాలుమోపలేకపోతున్నారు. (కాంట్రాక్టర్లకు ఎగ్జెంప్షన్) వైసిపి నేత జగన్ ఎపుడో తెలంగాణ నుంచి దూరంగా జరిగాడు.చంద్రబాబు ఈ గడ్డమీద విశ్రాంతికి తప్ప మరొకందుకు  తిరిగే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ వాలంటరీగా ఆంధ్రపార్టీగా  జనసేనను మార్చుకున్నారు.
2014 నుంచి కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, సోనియమ్మ తెలంగాణ కల నేర్చి , ప్రత్యేక రాష్ట్రంలో తెచ్చిందనే మాట ఎపుడూ తెలంగాణలో ‘కాంగ్రెస్ సెంటిమెంట్’ రాజేయలేదు. అందుకే పార్టీ ఆగకుండా వెనక్కు దూసుకు పోతా వుంది.
ఇక బిజెపి ఒక్క పార్టీ దగ్గిరే సెంటిమెంట్ అస్త్రం ఉంది. అది ప్రాంతీయ సెంటిమెంట్ కంటే చాలా పదునైన హిందూ  సెంటిమెంట్, ఎంఐఎం వ్యతిరేక సెంటిమెంట్. ఈజీగా అంటుకుని దావానలమయ్యే హైలీ ఇన్ ఫ్లేమబుల్ (Highly Inflammable) సెంటిమెంట్.
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, జిహెచ్ ఎంసి ఎన్నికల్లో రెండు సార్లు జరిగిన క్లినికల్ ట్రయల్స్ లో ఇది మంచి ఫలితాలు ఇచ్చింది. లాస్ట్ క్లినికల్ ట్రయల్ కొంచెం పెద్ద ఎత్తున  నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు వరంగలో, ఖమ్మం మునిసిపాలిటిలలో చేపడుతున్నారు. అక్కడ మంచి ఫలితాలొస్తే, తెలంగాణ అంతటా హిందూ సెంటిమెంట్ ను  వెద జల్లుతారు. రెండు ట్రయల్స్ పాసయ్యాక, బిజెపికి పట్టపగ్గాలు లేవు. బిజెపి చీఫ్ బండి సంజయ్ బిజెపికి కొత్త  దిక్కయ్యారు. అంతా ఇపుడాయన వైపు చూస్తున్నారు. తెలంగాణలో గతంలో ఎవ్వరూచేయని సాహసం చేసి బిజెపి సాప్ట్ట ల్యాండింగ్ ను బండి సంజయ్ సాధ్యం చేస్తారని అంతా అశగా ఉన్నారు.
బిజెపి హిందూ పాలిటిక్స్ ను ఎదుర్కొనేందుకు టిఆర్ ఎస్ దగ్గిర స్లోగన్ లేదు. ఎందుకంటే, జై తెలంగాణ అనేది ఎన్నికల స్లోగన్ గా ఇపుడు వందేమాతరం లాంటి పాత స్లోగన్.  ఇక ముందు పనిచేయదు. తెలంగాణ డెవెలప్ మెంట్, తెలంగాణకు పెట్టుబడులు, తెలంగాణ సాఫ్ట్ వేర్  హబ్ ఇలా ఎన్ని చెప్పినా  పనిచేయడం లేదు.
ఎందుకంటే, తెలంగాణ వూర్లలో ఏ తరహా డెవెలప్ మెంటు ఉందో ప్రభుత్వానికంటే ప్రజలకే బాగా తెలుసు.సరైన రోడ్లు లేని హైదరాబాద్, వరదల హైదరాబాద్ లో ప్రజలకు ఇంకా బాగా తెలుసు. అందువల్ల టిఆర్ ఎస్ డెవెలప్ మెంట్ స్లోగన్  పనిచేయడం లేదు. అందుకే కొత్త మంత్ర ప్రయోగం చేస్తున్నారు. అది కేంద్రం నిధులివ్వడం లేదు. ఇది ఎవ్వరికీ అర్థం కాని బ్రహ్మ పదార్థం. కేంద్రం నిధులు భ్రమ. ఎంత రావాలో అంతే వస్తాయి, కొంచెం అటు ఇటుగా.కాబట్టి నెపాన్ని కేంద్రం మీదనెట్టేసి బిజెపిని ఎదుర్కోవాలనుకోవడం టిఆర్ ఎస్ బలహీనత. అంటే బిజెపిని ఎదుర్కొనేందుకు టిఆర్ ఎస్ ‘కౌంటర్ సెంటిమెంట్‘ లేదు. అంటే సరైన స్లోగన్ లేదు.
హైదరాాబాద్ డెవెలప్ మెంట్ బిజెపికే ఉపయోగపడుతున్నదా?
దానికి తోడు హైదరాబాద్ అభివృద్ధి టిఆర్ ఎస్ కంటే బిజెపి కే బాగా ఉపయోగపడుతున్నదని నాకు అనిపిస్తూ ఉంది. తెలంగాణ అభివృద్ది కావడంతో నార్త్ నుంచి పెద్ద ఎత్తున యువకులు హైదరాబాద్ వస్తున్నారు. బిజినెస్ పీపుల్ వస్తున్నారు. వీళ్లలో బిజెపికి సాప్ట్ కార్నర్ ఉంది. హైదరాబాద్ డెమోగ్రఫీ ని వీళ్లు పూర్తిగా మార్చేస్తున్నారు. వీళ్ల దగ్గిర ఉన్న డబ్బులు, ఆర్ ఎస్ ఎస్ సానుభూతి బిజెపికి నైతిక బలాన్నిస్తున్నాయి.
నేనీ మధ్య  ProNamo అనే ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థతో మాట్లాడాను. ప్రొనమో అంటే ఫ్రొఫెషనల్స్ ఫర్ నరేంద్రమోడీ. వీళ్లు బాగా బిజెపికి క్యాంపెయిన్ చేస్తున్నారు. అంతా పెద్ద పెద్ద జీతాలున్న ఐటి ఉద్యోగులు. దుబ్బాకాలోవీళ్లంతా సొంతడబ్బులతో క్యాంపెయిన్ చేసి వచ్చారు. ఈసంస్థ 50 శాతం మంది నార్త్ కుర్రాళ్లున్నారు,  మార్వాడీ బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఇలా హైదరాబాద్ నార్త్ నుంచి వలస వస్తున్న వాళ్లలో డబ్బున్న వాళ్లంతా బిజెపి అనుకూలురేనేమో అనిపిస్తావుంది.వీళ్లంతా బిజెపికి  అన్ అఫియల్ అంబాసిడర్స్ గా పనిచేస్తున్నారు.
ఇంత బలమొచ్చినాక బిజెపి ఇక ముందు టిఆర్ ఎస్ ను అంత ఈజీగా వదలుతుందా?
 జిహెచ్ ఎంసి లో  టిఆర్ ఎస్ కు ఏడుచెరువు ల నీళ్లు తాగిస్తుంది. కొంత మంది కార్పరేటర్లు వెళ్లిపోతూ వెళ్లిపోతూ మంచికొక ఐఫోన్ కొట్టుకుని పోవాలనుకున్నారు. దాదాపు రు.30 లక్ష్లలు జిహెచ్ ఎంసి విడుదల చేసింది. అయితే, బిజెపి వ్యతిరేకించడంతో ఇది మానేశారని టమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. ఇది ప్రారంభం మాత్రమే.
బిజెపి ఒక రాజకీయ రహస్యం కనిపెట్టింది. హైదరాబాద్ ఎంఐఎం విమర్శిస్తే ఒక బలమయిన సెక్షన్ సంతోషిస్తుంది. దీనికి  సాక్ష్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను అరెస్టు చేసినపుడు వచ్చిన స్పందన. అక్బర్ ను అరెస్టు చేస్తే ఓల్డ్ సిటి కాలిపోతుందన్నారు. కాలిపోవడం కాదుకదా అగ్గిపుల్లకూడా వెలగలేదు. దీనితో కిరణ్ హీరో అయ్యాడు. ఇపుడు బిజెపి ఈ సెంటిమెంట్ ను బాగా వాడుకుంటూ ఉంది.
ఇక బిజెపి పాతదేవాలయాలను, దేవుళ్లను రంగంలోకి దించుతుంది. టిఆర్ ఎస్ కు గడ్డురోజులే. ఆ పార్టీ డెవలప్ మెంట్ నినాదం ఏమాత్రం పనిచేయదు. డెవెలప్ మెంట్ అనేది ఏ ఇద్దరికి ఒకలాగా కనిపించని విచిత్ర పదార్థం.
కాంగ్రెస్ కష్టాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్ కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ పార్టీ అంతకు ముందు సోనియా, రాహుల్ బొమ్మలు పెట్టుకుంటే వూరేగేది. తెలంగాణ మొదటి ఎన్నికల్లో ఈ ‘తెలంగాణ సోనియమ్మకానుక’ అనేది సెంటిమెంటుగా అంటుకోలే. టిఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక,  విమర్శించేందుకు ఈ పార్టీ కి ఏ అర్హతలేదు. కుటుంబ పాలన అని అనలేదు. అవినీతి అని అరవ లేదు. ఎందుకంటే, ఈ రెండింటికి కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లు, మెట్టినిల్లు.
2014 నుంచి 2019 దాకా ఎంతప్రయత్నించినా కాంగ్రెస్ కు టిఆర్ ఎస్ ఎదుర్కొనే సెంటిమెంటల్ నినాదమే దొరకలేదు. 2019 తర్వాత పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. 2018 అసెంబ్లీ,2019 లోక సభ ఎన్నికల్లో జనాన్ని తనవైపు తిప్పుకునే యతి ప్రాసలు కాంగ్రెస్ క్యాంపెయిన్ లేనే లేవు. అందుకే కాంగ్రెస్ క్యాంపెయిన్ జనానికి వినిపించలేదు. జనానికి కాంగ్రెస్ పార్టీ కనిపించలేదు.
ఇపుడు కాంగ్రెస్ బతికించుకునేందుకు,  పిసిసి చీఫ్ రేసులో ఉన్న ఇద్దరు పెద్దనేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తారట. ఆ యాత్రలోనైన ఎదో ఒకచోట్ వాళ్లకొక మంచి సెంటిమెంటల్ స్లోగన్ దొరికితేనే లైప్. లేకుంటే బ్రెయిన్ డెడ్ డిక్లరేషనే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *