తెలుగు కవి దేవిప్రియ ఇక లేరు!

ప్రజా కవి, రచయిత, పాత్రికేయులు, దేవిప్రియ ఇవ్వాళ తెల్లవారు ఝామున మరణించారు.  హైదరాాబాద్  నిమ్స్ ఆసుపత్రిలో పది రోజులు చికిత్స పొందుతూ  ఆయన తుదిశ్వాస వదిలారు. మరి కాసేపట్లో ఆయన మృతదేహం అల్వాల్ లోని ఆయన స్వగృహానికి చేరుకుంటుంది. మధ్యాన్నం  అంత్యక్రియలు జరగనున్నాయి.
దేవి ప్రియ తెలుగు కవిత్వానికి, జర్నలిజానికి, సినిమా విశ్లేషణకు ఎంత వైవిధ్యం అందించారో చెప్పలేం.  ఆయన రాసిన అమ్మ చెట్టు తెలుగు కవిత్వంలో ఒక ఆణిముత్యం.
గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చదివారు. దేవిప్రియ ‘ఉదయం’ తో సహా పలు పత్రికల్లో పనిచేశారు. ఆయన అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్. కానీ ‘దేవిప్రియ’ కలంపేరుతో రచనలు చేసేవారు. తండ్రి షేక్ హుస్సేన్ సాహెబ్, తల్లి షేక్ ఇమామ్ బీ. జర్నలిస్టుగా ఆయన ప్రాజావాహిని, నిర్మల, ప్రజాతంత్ర, జ్యోతి, మనోరమ తదితర పత్రికల్లో పనిచేశారు. ఉదయం, హైదరాబాద్ మిర్రర్ పత్రికల్లో పనిచేశారు ఆయన రన్నింగ్ కామెంటరీ కార్టూన్ కవిత్వం తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడి సృష్టించింది. దాసి, రంగులకల తదితర సినిమాలకు ఆయన పనిచేశారు. అమ్మచెట్టు, నీటిపుట్ట, చేప చిలుక, తుఫాను తుమ్మెద, గరీబు గీతాలు, సమాజాంద స్వామి వంటి పలు రచనలు చేశారు. గాలి రంగు అనే గ్రంథానికి ఆయనకు 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
తెలుగు జర్నలిజానికి ‘రన్నింగ్ కామెంటరీ’ ఆయన అందించిన ఒక కొత్త కోణం. రాజకీయ వ్యాఖ్యలను వ్యంగంతా లోతుగా, కాటేసేలా నాలుగు ముక్కల్లో కవితలాగా చెప్పడం రన్నింగ్ కామెంటరీ. ఇది ఆయన ఆంధ్రప్రభలో ఉన్నపుడు ప్రారంభించారు. దీనికి నాటి మేటి కార్టూనిస్టు మోహన్ కొంటె చిత్రం గీసే వాడు. ఈ నాలుగు ముక్కల కోసమే ఆ రోజుల్లో పత్రిక చదివేవారు. తర్వాత  వారిద్దరు తర్వాత కొత్త గా వచ్చిన  ఉదయం  కు మార్చారు. ఇది ఒక ఒరవడి.
ఆ తర్వాత ప్రతి పత్రిక ఏదో విధంగా ఇలాంటి రన్నింగ్ కామెంటరీ  ప్రారంభించింది.
దేవిప్రియ మరణం తెలుగు కవిత్వానికి, తెలుగు జర్నలిజానికి, తెలుగు చిత్ర విమర్శకు తీరనిలోటు. ట్రెండింగ్ తెలుగు న్యూస్ బృందం జోహార్లు అర్పిస్తున్నది.
ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం
ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ మృతి పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపెందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని ముఖ్యమంత్రి అన్నారు.  దేవిప్రియ సాహిత్య ప్రతభకు ‘గాలి రంగు’ రచన మచ్చు తునక అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *