శ్లాబ్ పెచ్చులు పడి చనిపోయిన కోవిడ్ సెంటర్ రాధిక కుటుంబాన్నిఆదుకోండి: నవీన్ రెడ్డి

స్విమ్స్ (SVIMS) శ్రీ పద్మావతి స్టేట్ కోవిడ్ సెంటర్ లో పనిచేస్తూ APMSIDC(ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) శాఖ అధికారుల,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన రాధిక కుటుంబానికి తక్షణం న్యాయం జరగాలని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నేత,రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం మరణించిన రాధిక కుటుంబానికి అన్ని విధాల అండగా నిలిచి ఆదుకోవాలని,ప్రమాదంలో క్షతగాత్రులు అయిన వారికి మెరుగైన వైద్య,ఆర్థిక సహాయం అందించాలని ఆయన ఈ రోజు విజ్ఞప్తి చేశారు.
రాధిక గారి అకాల మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
 శ్రీ పద్మావతి స్టేట్ కోవిడ్ సెంటర్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత వేలాది మంది కరోనా పాజిటివ్ బాధితులు వారి సహాయకులు ప్రతి నిత్యం ఆసుపత్రి ఆవరణలో వుంటున్నారు అలాంటి సమయంలో పై అంతస్తుల్లో సివిల్ ఇంజనీరింగ్ పనులు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా ఓ అమ్మాయకురాలి ప్రాణం గాలిలో కలిసిపోయిందని చెబుతూ  చిత్తూరు జిల్లా కలెక్టర్  కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదే విధంగా సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలతో పాటు ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయనకలెక్టర్ ను కోరారు.