అలమేలు మంగమ్మ నైవేద్య ప్రసాదాలేమిటో తెలుసా?

తిరుమల తిరుపతి దేవాలయాలలో పూజలకే కాదు, అక్కడి నైవేద్య ప్రసాదాలకు కూడా చాలా ప్రత్యేక ఉంది. ఈ రోజు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆరగింపుల గురించి తెలుసుకుందాం. ఆలయాలలో ఎపుడూ ఒకే విధమయిన నైవేద్యాలుండవు. సేవలను బట్టి నైవేద్యాలూ మారుతుంటాయి.
చిత్తూరు జిల్లాలో తిరుపతికి అయిదు కిలోమీటర్ల దూరంలో తిరుచానూరు పట్టణం  ఉంటుంది. తిరుపతి నుంచి ఇక్కడి చేరుకోవడం చాలా సులభం.
వాదిరాజపురం, తిరుక్కడవూరు, తిరుశుకనూర్,తిరుచ్చిక్కనూరు ఇలా తిరుచానూరుకు చాలా పేర్లున్నాయి.ఇక్కడి గుడిని 5 వేల సంవత్సరాల కిందట శుక మహర్షి నిర్మించారని ప్రతీతి. అందుకే ఇది తిరుశుకనూరు అయిందని చెబుతారు. అమ్మవారు శాంతి, అఫ్టైశ్వర్యాలను ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం. అందువల్ల  అమ్మారి ఆలయం గోపురాన్ని శాంతినిలయం, శాంతిగోపురం అని పిలుస్తారు. తిరుమల ఆలయంలో ఆనందనిలయం అని పిలుస్తారని తెలుసుగదా!
 తిరుచానూరులో పద్మావతి అమ్మవారు ఆలయం ఉంది. పద్మావతి అమ్మవారిని అలుమేలు మంగమ్మ అని వీరలక్ష్మి దేవి అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయంలో అమ్మవారికి మూడు పూటలా పలు రకాల ఆరగింపులు సమర్పిస్తారు. కొన్ని సేవల సమయంలో కొన్ని ప్రత్యేక ప్రసాదాలు నివేదిస్తారు.
అమ్మవారికి పెట్టే ప్రసాదాలివే…
పొద్దుటి పూట నైవేద్యాలు
తిరుచానూరు ఆలయంలో ఉదయం 6.30 గంటలకు మొదటి గంట వేళలో మాత్ర, సీర, పొంగలి, చక్కెర పొంగలి, పులిహోర, దధ్యోధనం సమర్పిస్తారు.
ఉదయం 8 గంటలకు(మంగళ, బుధ, ఆదివారాల్లో 9.30 గంటలకు) రెండో గంట సమయంలో లడ్డూ, వడ, పులిహోర, దధ్యోధనం, చక్కెరపొంగళి నివేదిస్తారు.
కల్యాణోత్సవం సమయంలో చక్కెర పొంగలి, పులిహోర, అప్పం ప్రసాదంగా అందిస్తారు.
సాయంకాలం నైవేద్యం
సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఊంజల్‌సేవలో సుండల్‌, రాత్రి 7 గంటలకు  రాత్రి గంట వేళలో మల్‌హోర (pepper ghee rice), చక్కర పొంగలి, పులిహోర, దధ్యోధనం సమర్పిస్తారు.
వారపు సేవలు
వారపు సేవలైన గురువారం తిరుప్పావడ సేవనాడు 70 కిలోల పులిహోర, జిలేబి, మురుకు, దోశ, అప్పం, శనగలు, కదంబం, పెసరపప్పు, పానకం, శుక్రవారం అభిషేకం సందర్భంగా కదంబం, దోశ, పులిహోర, సుండల్‌, పాయసం నివేదిస్తారు. ప్రత్యేక రోజుల్లో క్షీరాన్నం సమర్పిస్తారు.
అమృతకలశం – అమ్మవారి లడ్డూ ప్రసాదం
శ్రీ పద్మావతి అమ్మవారి ప్రసాదాల్లో విశేష ప్రాచుర్యం పొందింది లడ్డూ ప్రసాదం. దీనిని అమృతకలశం అని కూడా అంటారు. 2000వ సంవత్సరంలో అమ్మవారి ప్రసాదాల్లో లడ్డూను ప్రవేశపెట్టారు. లడ్డూ ప్రసాదానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. లడ్డూ తయారీ ఇలా ఉంటుంది. ప్రతి వంద లడ్డూల తయారీకి 4 కిలోల శనగ పిండి, 8 కిలోల చక్కెర, 3 కిలోల నెయ్యి, 90 గ్రాముల యాలకులు, 10 గ్రాముల సొంఠి, 6 గ్రాముల పచ్చకర్పూరం, 5 గ్రాముల జాజికాయలు వినియోగిస్తారు.
వడ ప్రసాదం
లడ్డూ తరువాత వడ ప్రసాదం ప్రాచుర్యం పొందింది. ఒక పడి (59 వడలు) తయారీకి 4 కిలోల ఉద్దిపప్పు, 2 కిలోల బియ్యం, 1.75 కిలోల నెయ్యి, 70 గ్రాముల మిరియాలు, 70 గ్రాముల జీల‌క‌ర్ర‌, 250 గ్రాముల ఉప్పు, 70 గ్రాముల ఇంగువ, 1.14 కిలోల పెసరపప్పు, 700 గ్రాముల జీడిపప్పు వినియోగిస్తారు.