తెలంగాణ అటవీ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు

అటవీ విద్య బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (FCRI) కేంద్ర ప్రభుత్వం A+ (ఏ ప్లస్) కేటగిరీ విద్యా సంస్థగా గుర్తింపు లభించింది.
అటవీ కాలేజీలు, ప్రమాణాలు, వసతులను అధ్యయనం చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (Indian Council of Forestry Research and Education (ICFRE) తెలంగాణ కాలేజీకి ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును ఇచ్చింది.
అడవులు, పర్యావరణ రక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ అటవీ విద్యను ప్రోత్సహించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ప్రత్యేక అటవీ కళాశాల ఏర్పాటును ప్రోత్సహించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఈ నిర్ణయం జరిగింది. తమిళనాడు మెట్టుపలాయం అటవీ కాలేజీకి ధీటుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతో 2015 లో కాలేజీ స్థాపన 2016 లో బీ ఎస్సీ ఫారెస్ట్రీ మొదటి బ్యాచ్ నాలుగేళ్ల కోర్సుతో ప్రారంభమైంది. ఈ యేడాదే ఫైనల్ ఇయర్ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకుంటున్నారు.
ముందుగా దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో మొదలైన కాలేజీ, గత సంవత్సరం డిసెంబర్ (11/12/2019) లో హైదరాబాద్ శివారు ములుగులో సొంత క్యాంపస్ లోకి మారింది.
అత్యంత అధునాతన సౌకర్యాలు, వసతులతో ఏర్పాటైన కొత్త క్యాంపస్ ముఖ్యమంత్రి చేతులు మీదుగానే ప్రారంభమైంది. విజయవంతంగా మొదటి బ్యాచ్ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును పూర్తి చేసుకుంటున్న అటవీ కళాశాల ఈ యేడాది నుంచి రెండేళ్ల ఎం.ఎస్సీ ఫారెస్ట్రీ తో పాటు, మూడేళ్ల పీ.హెచ్ డీ ఫారెస్ట్రీ కోర్సులను కూడా ప్రారంభిస్తోంది.
తొలి నాళ్లలో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా బీఎస్సీ అడ్మీషన్ల ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ ఆధారంగా ప్రస్తుతం అడ్మీషన్లు జరుగుతున్నాయి.
బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటించటంతో పాటు బ్రిటిష్ కొలంబియా, అబర్న్ యూనివర్సిటీలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇటీవలే ఓ విద్యార్థినికి అబర్న్ యూనివర్సిటీ ఉచితంగా ఎంఎస్సీ సీటును ఆఫర్ చేసింది. తాజాగా ఏ ప్లస్ గుర్తింపు సాధించటతో తెలంగాణ ఫారెస్ట్ కాలేజీకి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు మరింతగా వచ్చే అవకాశముంది. ప్రభుత్వం, ఇతర సంస్థల సహకారంతో అటవీ కాలేజీ విద్య, పరిశోధనా రంగాల్లో అభివృద్దికి ఆస్కారం ఏర్పడుతుంది.