బెజవాడ గ్యాంగ్‌ వార్‌: పోలీస్ కమిషనర్ వెల్లడించిన క్రైం స్టోరీ

విజయవాడ: బెజవాడ లో మొన్న జరిగిన  గ్యాంగ్ వార్ గురించి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు ఆసక్తికరమయిన వివరాలు అందించారు. తెలుగు క్రైం సినిమాకు కావలసిన అన్ని మసాలలు ఉన్న స్క్రిప్ట్ లాగా ఉంటుందీ వ్యవహారం. రెండు గ్యాంగ్ లు కొట్టుకున్నపుడు సందీప్ అనే రైవల్ గ్యాంగ్ లీడర్ చనిపోయిన సంగతి తెలిసిందే.  ఇందులో మరొక  గ్యాంగ్ లీడర్ పేరు పండు. భూ వివాదాలే గ్యాంగ్ వార్ కు కారణం. ఇపుడు   గ్యాంగ్‌ లీడర్‌ పండుతో సహా 13 మంది స్ట్రీట్‌ ఫైటర్స్‌ని పోలీసులు అరెస్టు చేశారు.
కమిషనర్ అందించిన వివరాలు:
 ‘పండు గ్యాంగ్‌ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన సందీప్‌ చనిపోయాడు. గతంలో పండు, సందీప్‌ మంచి స్నేహితులు. ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లు వాళ్ల పని. అయితే, ఈ వివాదాలే వీరిద్దరి మధ్య విభేదాలు తీసుకు వచ్చాయి. యనమలకుదురు లో ఏడు సెంట్ల  స్థల వివాదంలో పండు, సందీప్‌ల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి అనేవాళ్ల మధ్య అపార్ట్‌మెంట్‌ నిర్మాణంలో వివాదం తలెత్తింది. శ్రీధర్‌రెడ్డి నుంచి రావాల్సిన వాటా కోసం ప్రదీప్‌రెడ్డి నాగబాబును ఆశ్రయించాడు. వివాదం పరిష్కారం కోసం గతనెల 29న సందీప్‌, పండును పిలిపించారు. నాగబాబు, సందీప్‌లు ఉండగా.. పండు రావడం ఇరువురికి నచ్చలేదు. దీంతో పండుకు వార్నింగ్‌ ఇవ్వాలని నిర్ణయించుకుని సందీప్‌ ఫోన్‌లో బెదిరించే యత్నం చేశాడు. సెటిల్‌మెంట్‌కు నువ్వు ఎందుకొచ్చావంటూ నిలదీశాడు. 29న అర్థరాత్రి పండు ఇంటికెళ్లి సందీప్‌ బెదిరించాడు. ఆ తర్వాత 30న ఉదయం పండు అనుచరులు సందీప్‌ షాపుకు వెళ్లారు. సందీప్‌ షాపులో ఉన్న అనుచరుడిని పండు గ్యాంగ్‌ కొట్టింది. మాట్లాడుకుందాం అని పిలిపించుకుని.. 31వ తేదీ సాయంత్రం ఇరువర్గాలు కొట్టుకున్నాయి. పోలీసులు వెళ్లేసరికి చాలామంది గాయపడి ఉన్నారు.’’ అని కమిషనర్ చెప్పారు.
వారందరిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించామని త్వరలోనే మిగిలినవారిని కూడా అరెస్ట్ చేస్తామని కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ విషయంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని ఆయన తెలిపారు.
నిందితుల కోసం 6 బృందాలుగా ఏర్పడి గాలించాం. గ్యాంగ్‌ వార్‌లో వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. విజయవాడలో ఘర్షణ వాతావరణానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు’అని కమిషనర్‌ హెచ్చరించారు.