డాక్టర్ తాగి డ్రైవ్ చేస్తే ప్రశ్నించకూడదా? వైసిపి నేతల ప్రశ్న

నర్సీపట్నానికి చెందిన సస్పెండయిన డాక్టర్ సుధాకర్ ను అరెస్టు లో దళిత కోణం ఉందని  తెలుగుదేశం నేతలు  రాజకీయ ప్రచారంచేయ వైసిపి ఖండించింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మేరుగు నాగార్జున,  టీజేఆర్ సుధాకర్ బాబులు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ రోజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్, సీపీఐ నారాయణ తదితరులు డాక్టర్ సుధాకర్ అంశం గురించి ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేశారు.
డాక్టర్ సుధాకర్  సిగిరెట్ విసిరేయడం, పోలీసులపై దాడికి ప్రయత్నించడం, రోడ్డు పై నానా న్యూసెన్స్ చేయడం వంటివి చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు వీరోచిత కార్యక్రమాలుగా కనిపిస్తున్నాయా వారు ప్రశ్నించారు.
డా. సుధాకర్ చేసింది ముమ్మాటికీ తప్పేనని  దీనికీ, కులానికీ ఏ సంబంధమూ లేదని వారు ప్రకటనలో పేర్కొన్నారు.
 ఈ ప్రకటన పూర్తి పాఠం ఇదే: 
ఆ డాక్టర్ అయితే తాగి ఉన్నాడు. మరి వీరికి ఏమైందో, వీరి మానసిక స్థితి ఏమిటో, వీరు ఏ స్థితిలో ఉన్నారో సమాధానం చెప్పాలి. గుర్తుపట్టలేని స్థితిలో, గుండు చేయించుకుని ఉన్న డాక్టర్ సుధాకర్ తాగుబోతుగా పోలీసులకు డ్రైవ్ చేస్తూ పట్టుబడితే.. ప్రశ్నించక ఏం చేస్తారు? ప్రశ్నిస్తే పోలీసుల్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రుల్ని పచ్చిబూతులు తిట్టడం వీడియోలో కనిపిస్తుంటే.. అటువంటి వ్యక్తిని చంద్రబాబు, లోకేష్, నారాయణ ఏ మొహం పెట్టుకొని సమర్థించారు? కాబట్టే, వారు కూడా సుధాకర్ మానసిక స్థితిలోనే ఉన్నారని భావించాల్సి వస్తుంది.

https://trendingtelugunews.com/telugu/breaking/vizag-police-commissioner-rk-meena-clarification-on-dr-sudhakar-arrest/

ఈ దుర్మార్గాన్ని కులం పేరుతో సమర్థించడానికి వీరందరికీ నోళ్ళు ఎలా వచ్చాయి? దళితుల మీద వీరికి ఎప్పుడు ప్రేమ కలిగింది? అమరావతిలో తాము కొన్న వేల ఎకరాల భూముల కోసం పోరాటం చేస్తున్న వీరు.. ఇదే అమరావతిలో పేదలకు, అందులో ప్రత్యేకించి దళితులకు… దాదాపు 55 వేల కుటుంబాలకు భూములు ఇస్తామని జగన్ గారి ప్రభుత్వం ముందుకు వస్తే సామాజిక అసమతౌల్యం(డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్) వస్తుందంటూ దళితులకు స్థలాలు ఇవ్వకుండా అడ్డుపడిన నీచ చరిత్ర చంద్రబాబుది. అలాంటిది 150 వ రోజు నిరసన అంటూ.. లేని భావోద్వేగాలను ఉన్నట్టు చూపిస్తున్నారు.
సిగిరెట్ విసిరేయడం, పోలీసులపై దాడికి ప్రయత్నించడం, రోడ్డు పై నానా న్యూసెన్స్ చేయడం వంటివి చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు వీరోచిత కార్యక్రమాలుగా కనిపిస్తున్నాయా?
55 వేల మంది పేద కుటుంబాలకు ఇదే అమరావతిలో భూములు ఇవ్వకుండా ఆపితే వారికి భావోద్వేగాలు ఉండవా? ఇదే దళితులకు ఐదేళ్ళపాటు వారిపై దాడులు జరుగుతున్నప్పుడు భావోద్వేగాలు ఉండవా? ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని దళితుల్ని ఘోరంగా అవమానించినప్పుడు వారికి భావోద్వేగాలు ఉండవా? మరి ఇవన్నీ చూసేకదా.. దళిత వ్యతిరేక చంద్రబాబు ప్రభుత్వాన్ని దళితులు భూస్థాపితం చేసింది.
ఐదేళ్ళూ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని రైతులు నిన్న చంద్రబాబుకు గుర్తొచ్చారు. జీవితంలో ఏనాడూ గుర్తుకు రాని దళితులు అధికారం పోతే మాత్రం పావులుగా ఉపయోగపడతారని బాబు భావిస్తున్నాడు.
సుధాకర్ చేసింది ముమ్మాటికీ తప్పు. దీనికీ, కులానికీ ఏ సంబంధమూ లేదు
.