జగన్ కు ఏడు ’హిందు‘ ప్రశ్నలు, జవాబు చెప్పాలంటున్న ఐవైఆర్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఈ మధ్య విమర్శలొస్తున్నాయి. ఆయన క్రైస్తవ అనుకూల ధోరణి అవలంభిస్తున్నారని,  వాళ్లకి  నియమాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం సాయం అందిస్తున్నారని చాలా మంది హిందూ స్వాములు చెబుతున్నారు. తొందర్లో ఒక  స్వామీజీ తిరుపతి నుంచి అమరావతికియాత్ర జరుపుతానని కూడా ప్రకటించారు.
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసినా ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని నిన్న బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం గవర్నర్ విశ్వహరిచందన్ ను కలసి ఒక వినతిపత్రం సమర్పించింది. నెల్లూరు లో ఒక ఆలయానికి చెందిన తేరు కాల్చేస్తే పోలీసులు అది పిచ్చివాడి పనిగా తోసిపుచ్చుతున్నారని కూడా ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు. అదే విధంగా ఎఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ  అమరావతిలో సిఎఎ వ్యతిరేక ర్యాలీ నిర్వహించేందుకు సహకరించింది కూడా వైసిపి నేతలేనని వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
అయితే, జగన్ కు మతాన్ని అంటగడితే ఊరుకోబోమని మంత్రి వెల్లంపల్లి  హెచ్చరిస్తున్నారు.
ఈ సందర్భంగా జగన్ మత వైఖరి మీద తమకు ఎందుకు అనుమానాలొస్తున్నాయో వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్రయత్నించారు. ఆయన
ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.
వైరల్ అవుతున్న పోస్టులు
తాను వేస్తున్న  ప్రశ్నలకు సమాధానం ఇస్తే, జగన్ కు మతాన్ని అంటగట్టాల్సిన అవసరం లేదని ఐవైఆర్ కృష్ణారావు  అన్నారు.
“నిజమే. కానీ ఈ కింది అంశాలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది.
1. హిందూ మత సంస్థల నుంచి హైందవేతరులను తొలగిస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయకపోవడానికి కారణాలేమిటో?
2. చట్టబద్ధంగా ఏర్పాటు చేయాల్సిన ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి దాని క్రిందికి ధార్మిక సిబ్బందిని తేకపోవడం ఏమిటి?
3. హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ కు చట్టబద్ధత కల్పించి దానిని సమరసత వేదికతో అనుసంధానం చేయకపోవడం.
4. రాజ్యాంగ విరుద్ధమని తెలిసి కూడా ఇమామ్లకు, పాస్టర్లకు వేతనాలు చెల్లించటం.
5. ప్రభుత్వ ధనం నుంచి జెరూసలేం యాత్రకు సహాయం, చర్చిలు కట్టడానికి సహాయం చేయడం ఏమిటి?
6. దేవతా విగ్రహాలపై దుండగులు దాడి చేస్తే నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం. దేవాదాయ శాఖ మాత్యులుగా ఆ ప్రదేశాలను కూడా సందర్శించకుండా ఉండటం.
ఈ పై అంశాలకు అన్నింటికీ సరైన సమాధానం చెప్పగలిగితే ముఖ్యమంత్రి గారికి మతాన్ని అంట కట్టాల్సిన అవసరం ఉండదు” అని ఐవైఆర్ అన్నారు.