తహశీల్దార్‌ సజీవ దహనం; తెగని భూవివాదమే కారణమా?

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న భూవిధానాలు  రాష్ట్రంలో చాలా గొడవలకు దారితీస్తున్నాయి. ఎమ్మార్వో ఈ వివాదాలకు బలయిపోయారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. భూ సర్వేల వల్ల వచ్చిన  భూ వివాదాలు పరిష్కరించడంలో రాజకీయనేతల, ప్రభుత్వంలో పట్టున్న వారి జోక్యంతో చాలా సమస్యలు ఎదురువుతున్నాయి. కొన్ని ఇవి పెద్ద వివాదాలకు దారితీస్తున్నాయి. ఆ మధ్య సిరిపూర్ కాగజ్ నగర్ జిల్లా సర్సాలలో అటవీ అధికారుల మీద ప్రజలు తిరగడబడటం వెనక భూ వివాదమేఉంది. ఇపుడు  ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం వెనక కూడా భూవివాదమే ఉందని చెబుతన్నారు. ఈ  సంఘటన గురించి మరిన్ని వివరాలు…
సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డి  సజీవ దహనం చేసిన ఆగంతకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతని పేరు కూర సురేశ్‌ ముదిరాజ్‌  పోలీసులు తెలుసుకున్నారు.
ప్రస్తుతం అతడు హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ఇంత  ఘాతుకానికి అతను ఎందుకు పాల్పడ్డాడనే దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అసలేం జరిగింది…

సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తహశీల్దార్‌ కార్యాలయానికి సురేశ్‌ వచ్చాడు.
తహశీల్దార్‌తో మాట్లాడాలంటూ పర్మిషన్‌ తీసుకుని విజయారెడ్డి గదిలోకి వెళ్లాడు.
లంచ్‌కు వెళ్లాల్సిన ఆమె ఆగిపోయి అతడితో మాట్లాడారు. దాదాపు అరగంట పాటు అక్కడ ఉన్నాడు.
తర్వాత ఆమెతో వాగ్విదానికి దిగినట్టు తెలిసింది. తర్వాత తలుపులు మూసేసి విజయారెడ్డిపై దాడిచేశాడు.
అరుపులు విన్న విజయారెడ్డి డ్రైవర్‌ తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించగా కాలిన గాయాలతో సురేశ్‌ బయటకు వచ్చాడు. విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు అంటుకున్నాయని చెబుతూ చొక్కా విప్పేసి అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టాడు.
కాలిన గాయాలతో పోలీస్‌ స్టేషన్‌ ముందు పడిపోయాడు. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సురేశ్‌కు 60 శాతం గాయాలయ్యాయి. హయత్‌నగర్‌ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేశ్‌ భూవివాదం కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
తన భూమి సమస్యలు పరిష్కారించాలని కొంతకాలంగా సురేశ్‌ తహశీల్దార్‌కి లంచం ఇచ్చి కార్యాలయం చుట్టూ  జరుగుతున్నట్టు తెలిసింది. ఈ గొడవ ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియడంలేదు.
 విజయారెడ్డి ఎవరంటే…?
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం తోటపల్లి విజయారెడ్డి సొంతవూరు. ఆమె తండ్రి సి.లింగారెడ్డి కొండారంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.
మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి గ్రామం ఆమె అత్తగారి ఊరు. విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి హయత్‌నగర్‌ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయారెడ్డి కుటుంబం కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్‌ కాలనీలో ఉంటోంది.
రంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో గతంలో ఎమ్మారోగా పనిచేసిన విజయారెడ్డి కొద్దినెలల క్రితమే అబ్దుల్లాపూర్‌మెట్‌కు వచ్చారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న భూవిధానాలు, సర్వేలలో ప్రభుత్వ ప్రముఖల జోక్యం వల్లే  ఇలా దుర్మార్గాలు జరగుతున్నాయని,  విజయారెడ్డి హత్య లోకూడా ఇలాంటి కోణం ఉంటుందని సిపిఐ, కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు.

One thought on “తహశీల్దార్‌ సజీవ దహనం; తెగని భూవివాదమే కారణమా?

Comments are closed.