సోషల్ మీడియా ప్రచారంతో ఐఎఎస్ అధికారి మనస్తాపం, పోలీసులకు ఫిర్యాదు

కొన్ని రోజులుగా సోషల్​ మీడియాలో తన ఆస్తిపాస్తుల మీద జరుగుతున్న దుష్ప్రచారంపై సీనియర్ ఐఎఎస్ అధికారి, తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్​కుమార్   సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు​.
ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్​నగర్​ జిల్లాలో తన భార్యపేరిట స్థిరాస్థి కొనుగోలు చేసిన  విషయాలను ‘ఇటీవల కొనుగోలుచేసినట్లు’ గా  కొంతమంది ప్రచారం  చేస్తున్నారని  ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన భార్య ప్రైవేటు టెలికాం సంస్థలో ఉన్నతస్థాయిలో పనిచేస్తూన్నదని, ఆమె  పొదుపు చేసిన  డబ్బులతో వ్యవసాయభూములను (స్థిరాస్థి) కొనుగోలుచేశానని, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్​ జరిగిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
ఎన్నికల ప్రధాన అధికారిగా ఉండి ఒక రాజకీయపార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ వ్యక్తిగత ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారని ఆయన మనస్తాపం చెందారు.
కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు తన విధులకు అపార్ధాలు ఆపాదిస్తూ కుటుంబప్రతిష్టతను దిగజారుస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.
అలాంటి పోస్టింగ్​లతో వ్యక్తిగతంగా తనను, తన కుటుంబాన్ని మానసిక ఆవేదనకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయనే సైబర్ క్రైం పోలీసులను కోరారు.