కృష్ణా జిల్లాలో దంపతుల వినూత్న నిరసన

భూ వివాదంలో తమకు రావల్సిన డబ్బును గ్రామ పెద్దలు తమకు ఇవ్వకుండా వారి వద్దే పెట్టుకున్నారంటూ ఆంధ్ర ప్రదేశ్ లో  వృద్ధ దంపతులు వినూత్న నిరసన తెలిపారు.
కృష్ణాజిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు శివారు హరిచంద్రపురంలో చిలకపాటి వాసుదేవరావు, లక్ష్మి అనే వృద్ధ దంపతులు గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకుపైకి ఎక్కి నిరసనలు తెలిపారు.
భూ వివాదంలో తమకు రావలసిన డబ్బు గ్రామ పెద్దలు ఇవ్వటం లేదని ఈ రకమైన ఆందోళన చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.
గ్రామంలోని కొంతమంది వీరికి సంబంధించిన భూవివాదంలో మధ్య వర్తులుగా వ్యవహరించి అవతల పార్టీ నుంచి డబ్బు వసూలు చేశారు. అయితే, దానిని వీరికి ఇవ్వలేదు. దీని మీద వారు పోలీసులను కూడా ఆశ్రయించారు. అపుడు కూడా ఫలితం లేకపోవడం తో ఇలా నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే దాకా ట్యాంక్ మీద నిలబడే నిరసన తెలుపుతామని వారు చెబుతున్నారు.