శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (ఫోటోలు)

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఆదివారం ఉదయం భారత రాష్ట్రపతి   రామ్ నాథ్‌ కోవింద్‌ దర్శించుకున్నారు.  రాష్ట్రపతి వెంట ఆయన సతీమణి శ్రీమతి సవితాకోవింద్‌, కుమార్తె కుమారి స్వాతి, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌ సరసింహన్ దంప‌తులు ఉన్నారు.

రాష్ట్రపతి ఆదివారం ఉదయం 5.30 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు.

అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న  రాష్ట్రపతికి  అర్చక బృందం ”ఇస్తికఫాల్‌” ఆలయ మర్యాదలతో ఆగమోక్తంగా స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం  రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీశ్రీశ్రీ తిరుమ‌ల పెద్దజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ తిరుమ‌ల చిన్నజీయంగార్‌ స్వామి ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల్ దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని, సన్నిధిలోని ఇతర ఆలయాల గురించి వివరించారు.

ముడుచుకునే పైకప్పును పరిశీలించిన  రాష్ట్రపతి

శ్రీవారి ఆలయంలో పడికావిలి నుండి ధ్వజస్తంభం మధ్య ఏర్పాటుచేసిన ముడుచుకునే పైకప్పు పనితీరును రాష్ట్రపతి పరిశీలించారు. ఎండకు, వర్షానికి భక్తులు ఇబ్బంది పడకుండా ఈ మేరకు ఏర్పాటు చేసినట్లు టిటిడి ఈవో వివరించారు.

అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఛైర్మ‌న్‌, ఈవోలు కలిసి శ్రీవారి శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌, గవర్నర్‌  ఇ.ఎస్‌.ఎల్‌ సరసింహన్‌కు అందజేశారు.