చెవిరెడ్డి మీద చంద్రబాబు ఆగ్రహం

అసెంబ్లీ ముందు ముందు ఎలాంటి తుఫాన్లు రానున్నాయో ఈ రోజు సభలో జరిగిన చర్చలను బట్టి వూహించవచ్చు.

తొలిరోజు నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు మీద, గతంలో గత స్పీకర్ సభ నడిపిన తీరు పలుమార్లు ప్రస్తావనక వస్తున్నది.

వచ్చినపుడల్లా వైసిపి సభ్యులు తెలుగుదేశం మీద చురకలు వేసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని కయ్యానికి కవ్విస్తున్నారు.

ఈ రోజు స్పీకర్ ఎన్నిక తర్వాత కొత్త స్పీకర్ ను ఆనవాయితీ ప్రకారం సభానాయకుడు, ప్రతిపక్షనాయకుడు కలసి సభాధ్యక్ష స్థానానికి సాదరంగా నడిపించాలి. అయితే చంద్రబాబు నాయుడు ఈ సంప్రదాయం పాటించలేదు.

తను వెళ్లడానికి బదులు పార్టీ ఎమ్మెల్యే అచ్చన్నాయుడిని పంపించారు.

దీనిని వైసిపి సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రస్తావించారు. ఈ రోజు సభలో స్పీకర్ ను అభినందిస్తూప్రసంగిస్తున్నపుడు కొత్త స్పీకర్ తమ్మినేని సీతారాంను వేదిక వద్దక తీసుకువెళ్లేందుకు చంద్రబాబు నాయుడురాకుండా ‘బంట్రోతు’అచ్చన్నాయుడిని పంపించారని అన్నారు.

దీనితో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక బిసి నేత అయిన అచ్చన్నాయుడిని బంట్రోతు అని అన్నందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోఅహంభావం ఉంటే తప్ప ఇలాంటి వ్యాఖ్య చేయరని ఆయన అన్నారు. దీనికి క్షమాపణ చెప్పాలని అన్నారు.

ఈ సమయంలో అచ్చన్నాయుడు కూడా జోక్యచేసుకుంటూ  తాను చంద్రబాబు బంట్రోతు అయితే, మీ 150 మంది జగన్ బంట్రోతులవుతారని అన్నారు. ఈ వ్యాఖ్యను రికార్డులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

అయితే, వైసిపి సభ్యుడు తన వ్యాఖ్యను సమర్థించుకున్నారు. గతంలో చంద్రబాబు స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, వైఎస్ ను నరరూప రాక్షసుడని వర్ణించిన విషయం గుర్తు చేస్తూ అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యకు ఆయన క్షమాపణ చెబితే,తాను చెబుతానని అన్నారు.
గత అసెంబ్లీలో స్పీకర్ గా కోడెల శివప్రసాద్ ఎన్నికయినపుడు ఆయన సభాపతిస్థానికి తీసువెళ్లేందుకు జగన్ కూడా వచ్చిన విషయం చెవిరెడ్డి గుర్తు చేశారు.