ఎస్సై పరీక్షను వాయిదా వేయాలని విజ్ఞప్తి

తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలను వాయిదా వేయాలని కానిస్టేబుళ్లు కోరుతున్నారు. ఎస్సై పరీక్షకు ప్రస్తుతం కానిస్టేబుల్స్ గా పని చేస్తున్నవారు కూడా ఎంపికయ్యారు. ఎన్నికల విధుల్లో ఉండడంతో తమకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని దయచేసి నెల రోజుల పాటు పరీక్షలను వాయిదా వేయాలని వారు కోరుతున్నారు.
తమకు బందోబస్తు విధుల వల్ల చదువుకునే అవకాశం దొరకడం లేదని పరీక్ష నిర్వహిస్తే తాము నష్టపోయే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి ఏజ్ లిమిట్ ద్వారా ఇదే చివరి అవకాశం అని ఇక తమ కల కల్లగానే మిగలకుండా చూడాలని వారు కోరుతున్నారు.
ఎస్సై పరీక్షను వాయిదా వేయాలని పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి ఇప్పటికే డిజిపిని కలిసి వినతి పత్రం సమర్పించారు. దాదాపు 25 వేల మంది కానిస్టేబుళ్లు ఎస్సై పరీక్షకు ఎంపికయ్యారని డిజిపికి వివరించారు. ఎన్నికల బందోబస్తులో ఉండడం వల్ల వారంతా పరీక్ష రాసే అవకాశం కోల్పోతారని, సీరియస్ గా చదవకపోవడం వల్ల రాయలేరని వివరించారు.
దీంతో డిజిపి కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.  పరీక్ష వాయిదాకు సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా వస్తుందని ఆశిస్తున్నామని గోపిరెడ్డి అన్నారు. ప్రభుత్వం, పోలీస్ బోర్డు తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పరీక్షను నెలరోజుల పాటు వాయిదా వేయాలని పరీక్షకు క్వాలిఫై అయిన కానిస్టేబుల్ అభ్యర్దులు విజ్ఞప్తి చేశారు. దీని పై పోలీస్ బోర్డు, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *