ములుగు సీతక్కకు కాంగ్రెస్ లో పెద్ద పోస్టు

ఇటీవల టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ములుగు మాజీ ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్కకు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి దక్కింది. ఆమెను మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, రాజస్థాన మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం ఈమేరకు సీతక్కను మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీతక్కతోపాటు ఫాతిమా రొస్నా అనే నాయకురాలిని మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించారు.

తెలంగాణ రాజకీయాల్లో సీతక్క డైనమిక్ నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. విప్లవ నేపథ్యం కలిగి ఉన్న ఆమెను టిడిపి అధినేత చంద్రబాబు అప్పట్లో పిలిచి పార్టీ టికెట్ ఇచ్చారు. 2009లో ములుగు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ కోసం తనవంతు పాత్ర పోషించారు. టిడిపి ఆంధ్రా పార్టీ అన్న విమర్శలను ఆమె శక్తివంచన లేకుండా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఉద్యమ ప్రభావం కారణంగా సీతక్క 2014 లో ఓటమిపాలయ్యారు.

తదనంతర కాలంలో టిడిపి నేత రేవంత్ రెడ్డితోపాటు సీతక్క కూడా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె పోరాట పటిమ, గత నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కీలక పోస్టు కట్టబెట్టిందని చెబుతున్నారు. సీతక్కకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలుపుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *