గుంటూరు ఘాటు చిల్లీకి చైనా ఫిదా, ఎగుమతులు మళ్లీ మొదలు

ఆంధ్రప్రదేశ్ నుంచి చైనాకు చిల్లీ ఎగుమతులు సోమవారం నుంచి మొదలవుతున్నాయి. నెలరోజుల విరామం  నిన్నటితో ముగియడంతో గుంటూరు మార్కెట్ యార్డ్ నుమచి రెడ్ చిల్లీ ఎగుమతులు ప్రారంభమవుతున్నాయి.
నిజానికి ఎగుమతులు చైనా కొత్త సంవత్సరం పండుగ కోసం శెలవులు ప్రకటించారు. దీనితో ఫిబ్రవరి రెండో తేదీనే ఎగుమతుల పునరుద్ధరణ జరిగి ఉండాల్సిందే. అయితే, చైనా కరొనా వైరస్ సంక్షోభం రావడంతో ఒక వారం రోజులు ఎగుమతులు వాయిదావేశారు. ఇపుడు ఎలాంటి సమస్య లేదని తేలడంతో సోమవారం నుంచి ఎగుమతులు ప్రారంభమవుతున్నాయని అధికారులు చెప్పారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది చిల్లీ ధరలు 20 శాతంపెరిగాయని ఆల్ ఇండియాఎక్సోర్ట్ ట్రేడర్స్ అసోసియేషన్ (AIETA)అధ్యక్షుడు వెలగపూడి సాంబశివరావు తెలిపారు. చైనా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ శెలవులు వస్తున్నందున ఆదేశ వర్తకులు ముందుగానే సరకుభారీగా కొనుగోలు చేశారని ఆయన చెప్పారు.
‘ న్యూఇయర్ శెలవుల తర్వాత ఫిబ్రవరి మొదటివారంలోనే ఎగుమతులు మొదలుకావలసి ఉండింది. కరొన వైరస్ వ్యాధులు రావడంతో ఎందుకైనా మంచిదని న్యూఇయర్ శెలవులను ఒక వారం పొడిగించారు.అందువల్ల సోమవారం నుంచి ఎగుమతులు మొదలవుతున్నాయి. కొరోన వైరస్ సమస్య ఎదురయితే శెలవులు పొడిగించవచ్చు. మేము చైనా వర్తకులతోసంప్రదింపులు జరుపుతున్నాం. వాళ్లు చిల్లీ సరకు అందుబాటుమీద, ధరల మీద ఎంక్వయిరీ చేస్తూనే ఉన్నారు,’ సాంబశివరావు తెలిపారు.
ఘాటైని తేజస్ చిల్లీని చైనా వాళ్లు ఇష్టపడతారని, ఇది ఇండియాలో మాత్రమే దొరుకుతుందని ఆయన చెప్పారు. తేజ వెరైటీ ఆంధ్ర, తెలంగాణ, మధ్య ప్రదేశ్ లలో మాత్రమే పండిస్తారు.
ఇక గుంటూరు మార్కెట్ యార్డ్ సెక్రెటరీ ఎం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతిసంవత్సరం చైనా గుంటూరు మార్కెట్ యార్డ్ నుంచి సుమారు రు .3600 కోట్ల విలువయిన ఎండుమిరపను దిగుమతి చేసుకుంటుందని అన్నారు.బంగ్లాదేశ్ మరొక రు.1500 కోట్ల విలువయిన సరుకును కొనుగోలు చేస్తుంది.
మొత్తంగా గుంటూరు మార్కెట్ యార్డు నుంచి రు.6000 కోట్ల విలువయినసరుకు ఎగుమతి అవుతుంది. శ్రీలంక,ఇండోనేషియా ధాయ్ లాండ్ లు కూడా ఇండియా నుంచి చిల్లీని భారీగా కొంటుంటాయి. గత ఏడాది కంటే ఈ సారి చిల్లీ కి మంచి ధర వస్తూ ఉందని, రైతులు మంచిగిట్టుబాటు వచ్చే వీలుందని ఆయన చెప్పారు.