ప్రగతి భవన్ లో ఉత్కంఠ, ఒక్క రోజే గడువు, సమ్మె మానేసి వస్తరా రార?

గడువు దాటితే ఆర్టీసీ ఉండదంటా టామ్ టామ్
ఆర్టీసీ సమ్మె సమ్మె విషయంలో హైకోర్టు విచారణ నేపథ్యంలో సోమవారం నాడు  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, సునిల్ శర్మ, సందీప్ సుల్తానియా, అరవింద్ కుమార్, లోకేశ్ కుమార్, అడ్వకేట్ జనరల్ శివానంద ప్రసాద్, అడిషనల్ ఎజి రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
సమ్మె విషయంలోనూ, కోర్టు విచారణ సందర్భంగానూ అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించారు.
ఈ సమావేశంలో వ్యక్తమైన ఏకాభిప్రాయం ఇలా ఉంది.
‘‘మంగళవారం అర్థరాత్రిలోగా విధుల్లో చేరాలని గడువు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కార్మికులకు మంచి అవకాశం కల్పించింది. కార్మికుల భవిష్యత్తు, కార్మికుల కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ లేదు. ఉద్యోగాలను కాపాడుకోవడం పూర్తిగా కార్మికుల చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమైనదని కార్మిక శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించింది. విధుల్లో చేరడానికి మూడు రోజుల గడువు ఇచ్చింది. ఆ అవకాశం వినియోగించుకోకుంటే అర్థం లేదు. కార్మికులు ఎవరినీ బద్నాం చేయలేరు. ఇచ్చిన గడువు ప్రకారం కార్మికులు చేరకపోతే అది కార్మికుల ఇష్టం. మంగళవారం అర్థరాత్రి (5వ తేదీ అర్థరాత్రి) దాటిన తర్వాత ఏ ఒక్క కార్మికుడినీ విధుల్లో చేర్చుకునే ప్రసక్తి లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. తన నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో కఠినంగానే ఉంటుంది. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే, మిగిలిన 5 వేల రూట్లలో కూడా ప్రైవేటు వాహనాలకు ప్రభుత్వం పర్మిట్లు ఇస్తుంది.’’