ఆంధ్రలో తేలని రాజధాని సమస్య ఇంటర్నేషనల్ కోర్టులో తేలుతుందా?

(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి)
మూడు రాజధానుల ప్రతిపాదనపై తిరుపతిలోని పద్మావతి మెడికల్ కళాశాలలో సదస్సు జరిగింది. 2014 లో నాటి ప్రభుత్వం జీఓ 120 ని అమలు చేయడం వల్ల రాయలసీమ జిల్లాల విద్యార్థులకు దక్కాల్సిన లోకల్ రిజర్వేషన్లు దక్కలేదు
ఫలితంగా సీమ విద్యార్థులు నష్టపోయిన నేపధ్యంలో  రాయలసీమ ఉద్యమం జరగడం మరో వైపు తల్లిదండ్రులు సుప్రీంకోర్టు వరకు వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీఓను రద్దు చేసేలా చేసింది.
అలా రాయలసీమ ఉద్యమం సాధించిన తొలి విజయంగా పద్మావతి మెడికల్ కళాశాల చరిత్రలో నిలిచింది. అలాంటి కళాశాలలో మూడు రాజధానుల ప్రతిపాదనలో రాయలసీమ ప్రయోజనాలపై సదస్సు జరగడం సంతోషాన్ని కలిగిస్తుంది.
ఈ సదస్సులో నాతో బాటు ప్రొఫెసర్ జయచంద్రా రెడ్డి పాల్గొన్నారు. రాయలసీమ కు హైకోర్టు తోబాటు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తిరుపతికి ఉన్న సహజ వనరులను ఉపయోగానికి ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి అమరావతి సమస్య వెళ్లిన అంశంపై కూడా చర్చ జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతిని కొనసాగించాలని అక్కడి రైతులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని హెగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసారు. దీనితో ఎదో జరిగిపోతున్నట్లు మళ్ళీ ప్రచారం జరుగుతోంది.
International Court of Justice (Source: ICJ)
అంతర్జాతీయ న్యాయస్థానం 
అంతర్జాతీయ న్యాయస్థానం ( I C J ) ఐక్యరాజ్య సమితికి మూలం. ఇది నెదర్లాండ్స్ లోని హెగ్ నగరంలో ఉన్నది. ఇందులో అంతర్జాతీయ న్యాయస్థానం మరియు క్రిమినల్ కోర్ట్ రెండు విభాగాలు ఉంటాయి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలలోని రెండు లేదా అంతకు మించి దేశాలు తమ మధ్య నెలకొన్న సమస్యల పై ఫిర్యాదు మేరకు విచారణ జరిపి తీర్పును ఇస్తుంది. ఈ తీర్పును పిర్యాదు చేసిన ఇరు దేశాలు అంగీకారాన్ని తెలిపితే తీర్పు అమలు అవుతుంది. లేక పోతే తీర్పు గానే మిగులుతుంది.
కొన్ని సభ్య దేశాలు తమ ఆంతరంగిక అంశాలపై కోర్టు జోక్యాన్ని కూడా అంగీకరించవు. ఉదాహరణకు జమ్మూకాశ్మీర్ అంశం. ఏమైనప్పటికి అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుకు ప్రాధాన్యత ఉన్నా అమలు చేయడం మాత్రం పిర్యాదు దారుల అంగీకారాన్ని బట్టి ఉంటుంది.
అమరావతి సమస్య తమ పరిధిలోనే లేదు అని కేంద్రప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించిన నేపథ్యంలో ఇక అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుకు ప్రాధాన్యత ఎలా ఉంటుంది. కోర్టు తీర్పు పరిధిలోనికి రావడమే కష్టం ఒక వేల వచ్చినా కేంద్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసు ఇస్తుంది. భారత పార్లమెంట్ కు చెప్పిన సమాధానమే అక్కడా చెపుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాల విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకోదు.
 అంతర్జాతీయ సమస్యగా చూడటమే అసలు సమస్య
అమరావతి ప్రాంతం 175 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో రెండు నియోజకవర్గాలకు చెందిన ప్రాంతం. గత ప్రభుత్వం ఆప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించింది. భారీ అంచనాలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసినప్పటికి నేటికి కీలక విభాగాల డిజైన్ కూడా పూర్తికాలేదు. ఈ దశలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిమిత వనరులు వెనుకబడిన ప్రాంతాల సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి మరో కొత్త నగరం సాధ్యం కాదని భావించి అమరావతి ప్రాజెక్టును పక్కన పెట్టింది. ఇది రాజకీయంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇది ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలొ పరిస్కారం కావాల్సిన సమస్య. చట్ట పరమైన వైరుధ్యాలు ఉంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా పరిస్కారం జరగాలి తప్ప మరో మార్గం లేదు. అలాంటిది సంబంధం లేని అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు పెట్టడం సమస్యకు పరిష్కారం కాకుండా విస్తృతంగా ప్రచారం లభిస్తుంది.
ఈ మొత్తం వ్యవహారంలో అమరావతి పెద్దలు రాష్ట్రంలోని ప్రజలకు ఒక విషయాన్ని చెప్పకనే చెప్పారు తాము ఇతర ప్రాంత ప్రజాలులాగా సాధారణ వారు కామని ఢిల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయివరకు ప్రభావితం చేయగల సత్తా ఉన్న వారమని చెపుతున్నారు. కానీ వారు ఒక విషయాన్ని మరిచి పోతున్నారు. అమరావతి , ఆంద్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించేది ప్రభుత్వం అని ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకునేది రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల ప్రజలు అన్న విషయం. అమరావతి నాయకత్వం ఆదరణ పొందవలసింది ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల ప్రజల నుంచి తప్ప అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి కాదు.
ఈ సదస్సులో పద్మావతి మహిళా మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు , అధ్యాపకులు పాల్గొన్నారు.
(పద్మావతి మెడికల్ కళాశాలలో జరిగిన మూడు రాజధానాల సదస్సులో చేసిన ప్రసంగం)