తిరుపతి దగ్గిర యోగుల పర్వతానికి ట్రెక్, మరచిపోలేని అనుభూతి

(భూమన్)
ఎవరో చెప్పారు అప్పలాయ కుంట దగ్గిర ఒక మంచి ప్రదేశం ఉందని. దాన్నిచూడ్డానికి ఒక నలుగురం బయలుదేరాం. దీని గురించి ఏ రకమయిన సంగతులు తెలియవు. ఒక రెండు గంట్లలో పోయిరావచ్చనుకున్నాం ఎందుకంటే, ఇది తిరుపతికి కేవలం 24 కి.మీ దూరానే ఉంటుంది. ఈ ప్రదేశం మీద ఎందుకు ఆసక్తి కలిగిందంటే, దీని పేరులో పర్వతం అంటే ఎత్తయిన కొండ అనే మాట ఉంది.
తిరుపతి చుట్టుపక్కల ప్రదేశాలలోఉండేవన్నీ చిన్నచిన్నగుట్టలే. ఇది చాలా ఎత్తయిన కొండ. దీని పేరు యోగుల పర్వతం.  ఒకపుడు దీనిని ఉత్తర కొండ అనీ యానాదుల కొండ,యమయ్య కొండ  అని పిలిచే వారు. ఒక రెండేళ్లుగా మాత్రమే ఇది బాగా ప్రచారంలోకి వస్తూ ఉంది. అక్కడ ప్రతాప్ స్వామి అనే  ఒక స్వామి ఉన్నాడు. ఆయన ఈ కొండప్రాంతాన్ని అభివృద్ది చేసే సంకల్పం ఉన్న వాడు.
ప్రతాప స్వామికి ఫోన్ చేసి వస్తున్నాం అని చెప్పాగానే, ఆయన ఆహ్వానించాడు. నేను తెలుసని కూడా చెప్పాడు. అయితే, ఈ కొండ తిరుపతి నుంచి ఎంత దూరమనే విషయాన్ని ఆయన కూడా కచ్చితంగా చెప్పలేకపోయాడు.
అప్పలాయగుంట నుంచి ఒక అయిదు కిలో మీటర్లుంటుంది.  అక్కడి వెళ్లాక పర్వతం ఎక్కాలి. ఎక్కేందుకు పడమర తూర్పున రెండు దారులున్నాయి.
ఈ కొండ గురించి చుట్టుపక్కల గ్రామస్థులతో మాట్లాడాం. వాళ్ళలో రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు వివాహమయ్యాక  వారం రోజులు హానీ మూన్ కు ఇక్కడికే  వచ్చి విహరించారని కొందరు చెప్పారు. వెంకటేశ్వరస్వామి , పద్మావతి దాంపత్య జీవితం ఇక్కడే ప్రారంభమయింది కాబట్టి ఇది చాలా పవిత్రమయిందనే భావన అక్కడి ప్రజల్లో  ఉంది.
అయితే,  ఈ ప్రదేశం, ఇక్కడి ప్రకృతి సౌందర్యం గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. కొన్నాళ్లు అక్కడ అబ్రకం ఉందనే ప్రచారం జరిగింది. కొంతమంది ఇనుప ఖనిజం ఉందని అన్నారు. దానితో  కొందరు ఈ కొండను తవ్వడానికి కూడా ప్రయత్నించారు.
అయితే, స్థానికులు అభ్యంతర పెట్టడంతో ఈ ప్రయత్నాలు సాగలేదు. ఇపుడు ఈ ప్రతాప్ స్వామిరావడంతో  కొండ చుట్టు పక్కల పల్లెల్లో ప్రాచుర్యం పొందింది.
ఆయన ఈ కొండ పురాణ ప్రాశస్త్యాన్ని, ఐతిహ్యాన్ని బాగా ప్రచారం చేశారు. దీనితో ఇక్కడ ప్రజల్లో ఈ కొండ  అంటే పవిత్ర భావన ఏర్పడింది. కార్తీక మాసంలో అరుణాచలం అంత స్థాయిలో కాకపోయిన, ఆమోస్తరులో కార్తీక దీపం వెలిగించాలనే ప్రయత్నంలో ప్రతాప్ స్వామి ఉన్నారు. దీనికోసం ఒక 40 టన్నుల బరువు చేసే పాత్రను ఒక 24 మంది మోసుకుని కొండమీదికి తెచ్చారు. దానికి అయిదు డబ్బాల్లో నెయ్యిని పోసి అందులో 500 మీటర్ల వత్తిని ఏర్పాటుచేస్తున్నారు. దీనితో కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించారు. దీనిని అక్కడి ప్రజలు చాలా భక్తి ప్రపత్తులతో నిర్వహించడం కనిపిస్తుంది.
ఈ కొండను చాలా నిటారుగా ఎక్కాలి. మొత్తం యాత్రంతా రెండు మూడు గంట్లో ముగించుకుని రావాలని మేము బయలుదేరాం. కాని మాకు ఎక్కడానికే మూడుగంటలు పట్టింది. ఎక్కడా సమతలం లేదు. ఒక కిలోమీటరు ఎక్కిన తర్వాత అద్భుతమయిన జలపాతం కనిపించి కనువిందు చేసింది. ఆ జలపాతం వెంబడి కొంతదూరం ప్రయాణించాం. అక్కడి నుంచి ఎడమ వైపున ఉన్న కొండ ఎక్కాం. శిఖరం మీద గొప్ప అనుభవం ఎదురయింది.
అక్కడ మేఘాలన్ని కొండఅంచులను ముద్దాడుతున్న దృశ్యం కనిపించింది. అక్కడ శివుడి విగ్రహం, నాగవిగ్రహం ఉన్నాయి.
మేం వెళ్లేసరికి అక్కడికి కొందరు గిరిజన స్త్రీలు కూడా చేరుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్బంగా అక్కడ రెండువేల మందికి భోజనాలు ఏర్పాటుచేస్తున్నారు. మమ్మల్ని కూడా రాత్రికి అక్కడే భోజనాలు చేసి పొమ్మని చెప్పారు. అయితే, మాకు వీలుకాలేదు. మేము ఆ ప్రదేశాలన్నీ కలియతిరిగేందుకు వచ్చాం కాబట్టి అపని ముగించుకోవాలనుకున్నాం. కాబట్టి కార్తీక దీపాన్ని చూల్లేక పోయాం.
అయితే, వాళ్లు దీపాన్ని ఏర్పాటుచేస్తున్న ప్రదేశం దగ్గరకు వెళ్లాం. అది మాటల్లో చెప్పలేనంత అందమయిన దశ్యాన్ని చూపించింది. అక్కడి నుంచి చుట్టూర కనుచూపు మేరా స్పష్టంగా చూడవచ్చు. తిరుపతికూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి రాయలచెరువు కొండ కనిపిస్తుంది. ఎద్దుల చెరువు కనిపిస్తుంది. చూసినంత దూరం కనిపస్తుంది. అది దిగ్భ్రమ కలిగించే దృశ్యం. అంటే  ఈ పర్వతం ఎంత ఎత్తున ఉందో వూహించవచ్చు.
నేనింతకాలం తిరుపతి చుట్టుపక్కల తిరిగినవన్నీ ఈ కొండతో పోలిస్తే మరుగుజ్జులే. రెండుగంటల పాటు ఆ ప్రదేశాలన్నీ కలియతిరిగాం. కొండమీదకు చేరుకునేందుకు వాళ్లు చేసిన ఏర్పాట్లు చూస్తే ముచ్చటేసింది.చక్కటి దార్లు వేశారు.వచ్చేవాళ్ల కు ఎలాంటి ఇబ్బందిలేకుండా ముళ్లకంప అడ్డం కాకుండా శుభ్రం చేశారు. దీన్నంతా చూస్తే ముందు ముందు ఈ ప్రదేశం బాగా ప్రాముఖ్యం సంతరించుకుంటుందేమోనని నాకు అనిపించింది.
ఈ మధ్య దేశంలో మతం పట్ల, ఐతిహ్యాల పట్ల ప్రజలు బాగా శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటిప్రదేశం గురించి తెలిస్తే ఇంకేముంది? జనం విరగబడి వస్తారు.అలాంటి ఆకర్షణ కూడా  ఈ పర్వతానికి ఉంది. ఎన్నిజలపాతాలున్నాయో. కొండ మీద పడమరవైపు తిరిగే అందమయిన జలపాతాలున్నాయి.
ఈ కొండపైనుంచి అలాగే వెళ్లే రాయలచెరువు కొండలొస్తాయని చెప్పారు.మేము దానికి సిద్ధమయి వెళ్లలేదు కాబట్టి, ఆ ప్రయత్నం చేయలేకపోయాం.
ఈ ప్రాంతంలో నేను చాలా ప్రదేశాలు తిరిగాను. అన్నింటికంటే ఇదే ప్రత్యేకమయింది. చాలా పెద్ద  ట్రెక్ ఇది. ఒక విధంగా సాహసోపేతమయిన ట్రెకింగ్ కూడా అని చెప్పవచ్చు. తిరుపతికి 24 కిమి దూరాన ఇంతఅందమయిన పర్వతం ఉందంటే నమ్మలేం.
ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలలలో ఉండే పర్వత క్షేత్రాలకు  ప్రజలు  వెళ్లి వస్తుంటారు. అయితే, ఇది చూశాక, ఇది మొదటచూడాల్సిన  పర్వతం అనిపించింది. ఇది ఇంకా చెక్కు చెదరని ప్రకృతి. ఇక్కడి జలపాతాలు, పక్షలు కిలకిలా రావాలు, రకరకాల జంతువులు..చెప్పనలివికాని ప్రకృతి సౌందర్యం ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఇక్కడి జలపాతాల నీళ్లన్ని సమీపంలోని గాలేరు నగరి కాలువలో చేరి అక్కడి వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి. ఈ అడవిలో చందనం చెట్లు లేవు. ఉండేవన్నీ టేకు చెట్లే. వీటిని కొట్టే ప్రయత్నాలు చేస్తే విజయవంతంగా అడ్డుకున్నారు.
 మీరు ఒక సారి ఈ పర్వతాన్ని సందర్శించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *