ఊర్లన్నీ చూస్తుండగానే మారిపోయాయి, మంచికా, చెడుకా?

(చందమూరి నరసింహా రెడ్డి)
వేగంగా మారుతున్న కాల పరిస్థితుల కారణంగా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలు, కళలు,వృత్తి విద్యలు ఒక్కొక్కటిగా అంతరించిపోతున్నాయి.చూసుండగానే అనేక కులవృత్తులు కనుమరుగైపోతున్నాయి. వాటి చుట్టు అల్లుకున్న గ్రామం పూర్తిగా మారిపోతున్నది.
ప్రపంచీకరణ ఫలితంగా జీవనశైలి మారుతోంది.
పూర్వం ఊరు ‘ఊరు’లాగా కనిపించేది.ఊర్లోకి కాలు పెట్టగానే కుమ్మరి కుండలు కొట్టే శబ్దం, మగ్గాల టకటకలు వినిపించేవి. ఒకరో  ఇద్దరో కంసాలి కుటుంబాలండేవి. కొలిమి శబ్దం వినిపించేంది. పశువుల మంద రాకపోకలు,  బండ్ల శబ్దాలు… నాలుగడుగులు ముందుకెళ్తే వూర్లో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి వృత్తి తమ ఉనికిని చాటుకునేవి. ఒక పుడు పల్లెనుంచి శబ్దలు వినపడుతూనే మావూరొచ్చిందని పించేంది.ఇది ఆవూరికి సిగ్నేచర్ లాంటింది. ఇపుడు వినిపించే శబ్దాలు, కనిపించే దృశ్యాలు వేరు. ఊర్ల సిగ్నేచర్లు చెరిగిపోయాయి. అన్నివూర్లు ఇపుడు ఒక లాగే కనిపిస్తాయి.
ప్రజలూ  వారి వారి కుల వృత్తుల లో నిత్యం కష్టపడుతూ సతమతమవుతున్నా వూరు సంపూర్ణంగా ఉండేది. వూరికి మానసిక ఉల్లాసం కోసం సాయంకాలానికి ఏదో ఒక ఎంటర్ టైన్ మెంటుండేది. బుర్రకథలు, హరికథలు, కాకపోతే, స్టేజి నాటకాలు. ఊరికి ఉన్న ఈ శోభ మాయమయింది. ఈ సందడి వినిపించడం మానేసింది. అసలు ఆజనమే కనుమరుగయిపోతున్నారు.కుమ్మరిసారె, సాలెల మగ్గం,వూరి చెరువు చూసిన, తెలిసిన వాళ్లెందరు ఇపుడు? మంచికో,చెడుకో వూరు మారిపోతున్నది. ఆపడం ఎవరి తరం కాదు.
మారుతున్న కాలానుగుణంగా ఇప్పుడు పల్లెటూర్లను కూడా ఇంటర్నెట్ నడిపిస్తోంది. కోక్, పెప్సీలు, చికెన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ బండ్లు… ఈ సందడి ఎక్కువయింది. వూరూరికి స్టాక్ మార్కెట్ విస్తరించింది. పల్లెటూర్లలో కూడా ఇపుడు స్టాక్ లో ఇన్వెస్టు చేయడమ మొదలుపెట్టారు.
యుగ యుగాలుగా తరతరాల వైభవాన్ని సంతరించు కున్న జానపద కళారూపాలను గురించి, ఈ తరం వారికి చాలమందికి తెలియదనటం ఆతిశయోక్తి కాదు. అది తరతరాల వైభవం. తరగని వైభవం.
రాయలసీమ ఒక నాడు విజయ నగర రాజులు పరిపాలించిన ప్రాంతమిది. ఇక్కడ జానపద కళారూపాలైన బయలు నాటకాలు ప్రదర్శించేవారు కొయ్య బొమ్మలాట, తోలుబొమ్మలాట,జానపద గేయాలనీ జానపద సాహిత్యమనీ, జానపద వీథి నాటకమనీ, బుర్ర కథలనీ, పగటి వేషాలనీ, ఇలా ఎన్నో వందలాది జానపద కళా రూపాలు ఆనాడు పల్లె ప్రజలకు విజ్ఞాన వినోద వికాసాన్ని కలిగించాయి.
ఆధునిక ప్రక్రియలు రావడంతో ఈనాడు వాటి పట్ల ఆదరణ తగ్గింది. జానపద కళలను పోషించే వారు తగ్గి పోయారు.
వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానం రావడంతో నాటకాలు,రేడియోలు, గ్రామఫోన్ రికార్డు, టేప్ రికార్డులు , సి డి లు కనుమరుగైపోయాయి. నేడు హెచ్ డి, 4కె లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో వినోదం నడుస్తోంది.
ఒక నాడు చేతి గడియారం అందునా హెచ్ ఎంటి వాచ్ కు ఎంతో విలువ ఉండేది కానీ నేడు చేతి గడియారాలు కనిపించేది కరువైపోయింది. నేడు ప్రపంచం చిన్నదైపోయింది. ప్రపంచమంతా అరి చేతిలో బందీ అయి పోయింది. ఒక చిన్న సెల్ తో ఏ సమాచారం కావాలన్నా ,వినోద కార్యక్రమం కావాలన్నా వస్తోంది.
బొమ్మలాట
కొయ్యబొమ్మలాటలను ప్రదర్శించటం ఒక ప్రత్యేకత, ఈ బొమ్మలు హిందూపురం ప్రాంతంలో తప్ప
ఆంధ్రదేశంలో మరెక్కడా కనిపించవు. ప్రక్క రాష్ట్రమైన కర్ణాటకలో వీటి ప్రభావం వుంది. బహుశా ఆ విధంగా ఈ కట్టె బొమ్మల కళాకారులు అటునుంచి ఇటు వచ్చి స్థిర పడి వుండవచ్చును.
ఈ కట్టె బొమ్మలు కళ్ళతోకూడ అభినయం చేయగలంతటి పనితనాన్ని నిపుణులైన గ్రామ వడ్రంగులు తయారు చేయ గలిగే వారు. అది ఖర్చుతో కూడుకున్న పని. ఈ కళారూపం చాల కాలం క్రితమే క్షీణించింది.
బయలు నాటకాలు గ్రామాల్లో విస్తృతంగా కనిపించేవి. రానురాను కనుమరుగయ్యాయి. రంగస్థల నాటకం (డ్రామలు) కు విపరీతమైన ఆకర్షణ ఉండేది. పల్లె లో ఒక డ్రామ మాస్టర్ ను పెట్టుకొని నెలల తరబడి రాత్రి పూట ప్రాక్టీస్ చేసి డ్రామలు వేసేవారు. తెల్లవారుజామున వరకు డ్రామ ఆడేవారు. నేడు ఏపల్లె లో డ్రామాలు కనిపించడం లేదు.
గొల్ల సుద్దులను చెప్పే వారు యాదవ చరిత్రకు సంబంధించిన కృష్ణలీలలు, కాటమరాజు కథ మొదలైన వాటిని సుద్దులవారు ప్రచారం చేస్తూ వుంటారు. ఇది మన ప్రాచీన కళారూపం.
ఎరికెల సోదె (గెద్దె)
ఇంటింటికీ తిరిగి జరిగిన విషయాలనూ, జరగబోయే విషయాలనూ సోదె చెప్పే ఎరుకల స్త్రీలు ఇల్లు ఇల్లు తిరిగి అంబా పలుకు, జగదంబా పలుకు, మాయమ్మా పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు అంటూ..సోదే ( గెద్దె)చెప్పేవారు.
బుర్ర కథలు ఒకనాడు మత ప్రబోధానికి, అధ్యాత్మిక తత్వానికి ఉపయోగపడిన జంగం కథలను దేశ భక్తిగాథలను , స్దానిక పెద్దలగురించి , ఎన్నొ చారిత్రక సంఘటనలు గురించి బుర్ర కథలు రూపంలో చెప్పేవారు. తోలుబొమ్మలాట ఇలా అనేక కళా రూపాలు కనుమరుగయ్యాయి.
నేటి యువతకు వీటి గురించి చాలా వరకు తెలియదు.
హరికథలు ఇంకా అక్కడక్కడ కన్పిస్తున్నాయి. చెక్కభజనలు కోలాటం , పండరిభజనలు , భజన బృందాలు , ఎలపదాలు , ఇసుర్రాయి పాటలు , వరినాటు పాటలు , ఇలా అనేక కళానైపుణ్యాలు నేడు కనుమరుగయ్యాయి.
కుమ్మరి తయారు చేసే కుండలు , కమ్మరి చేసే కొలిమి సామాన్లు , వడ్రంగి చేసే వ్యవసాయ పనిముట్లు , చెరువు నీరు కట్టే నీరుగుట్టు , కళ్లం లో కొచ్చే మేరగాళ్లు , దాసప్పలు , గోరవయ్యలు ఇలా అనేక వృత్తి పనులు,ఉరుములోల్లు ,ఎకనాదమోళ్లు ,పల్లె కళాకారులు నేడు కనిపించేది కష్టమే.
పురాతన వ్యవసాయ విధానాలు గురించి , పల్లెలో ఒకనాటి జీవన విధానం గురించి కూడా నేడు చాలమంది కి తెలీదు. ఇలాంటి విధానాలు ఉన్నాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గూడ(యాతం) సేద్యం చేసి పంటపండించేవారు. గూడ వేయాలంటే ఇద్దరు కావాలి. నేడు గూడ సేద్యం ఎక్కడా కనిపించదు. దాదాపు 50సంవత్సరాల క్రితం ఈవిధానం ఉండేది. బకెట్ ఆకారం లా ఇనుప రేకు తో చేసి రెండు వైపుల చెవులు(రింగ్) బిగించి తాడు కట్టేవారు. చెరొక వైపు తాడు పట్టుకొని గుంతలో నుంచి నీటిని ఎగదోసి పంటలు పెట్టే దే గూడ సేద్యం. కబిలసేద్యం రాకతో గూడ సేద్యం కనుమరుగైంది.
కబిలసేద్యం కోసం పెద్దతోలు తిత్తి ఉండేది దాన్ని కబిల బాన అనేవారు. కబిల బాన కు రెండు తాళ్లు కట్టి బావిలోకి వదిలి శిల వేసేవారు. ఏద్దుల కాడిమాను కు తగిలించి ఎద్దులను బార్లొకి వదిలి తోలేవారు. ఎద్దులు బారిలోకి కిందికి పోతే బావిలో నీళ్లు నింపుకొన్న బాన పైకొచ్చేది కాలువ వైపు మూతి తిప్పి సిల తీస్తే నీళ్ళు కాలువ లోకి వెళ్ళి పంటలకు వెళ్ళేవి. తెల్లవారుజామున 5నుంచి ఉదయం10వరకు కబిల తోలేవారు. ఇది కబిలసేద్యం. ఆయిల్ ఇంజన్లు రాకతో కబిల సేద్యం కు చరమ గీతం పాడారు.
ఆయిల్ ఇంజన్లు కు డీజిల్ వేసి నీటి తోడుకోవడం జరిగెది. పుల్లీ కి ఇంజన్ కు బెల్ట్ బిగించి ఇంజన్ ఫెడల్ తో తిప్పి గేర్ ఏస్తే టుక్క్ టుక్క్ అని శబ్దం చేస్తు నీళ్ళు పైపు నుంచి బయటకు వస్తుంది. ఇలా యంత్ర సేద్యం ప్రారంభమైంది . నీటిని తోడే వేగం పెరగడంతో భూగర్భజలాలు తగ్గడం ప్రారంభమైంది. కరెంటు మోటార్ రావడం తో ఆయిల్ ఇంజన్ శకం ముగిసింది.
కరెంటు మోటార్ రావడంతో వ్యవసాయ విప్లవం మొదలైంది. స్పీడ్ పెరిగింది. నీళ్లు తోడే వేగం పెరగడం తో బావులు ఎండిపోవడం జరిగింది. దీంతో బావుల సేద్యం బాగ తగ్గిపోయింది. ఇప్పుడు చాలా తక్కువగా కన్పిస్తాయి. బోరు బావుల శకం నేడు రాయలసీమ లో నడుస్తున్న వ్యవసాయ విధానం చూస్తున్నారు. రాబోయే విధానం ఏలా ఉంటాయె చూడాలి.
గ్రామీణ జీవన విధానం ఇలా అనేక మార్పులు సంభవించాయి. మారుతున్న పరిస్థితి కి అనుగుణంగా యాంత్రీకరణ తప్పదు.
Chandamuri Narasimhareddy
(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, .ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత ఫోన్ నెంబర్:9440683219)