శ్రీవారి “చక్ర స్నానం” ఏకాంతంగా వద్దు, పుష్కరిణిలో నిర్వహించండి!!

(నవీన్ కుమార్ రెడ్డి)
1) తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను టిటిడి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కరోనా వైరస్ కారణంగా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు ఎస్వీబీసీ ద్వారా భక్తులు వీక్షిస్తున్నారు!
2) శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజు 9 వ రోజు జరిగే అద్భుతమైన ఘట్టం “చక్రస్నానం”. శ్రీవారు బ్రహ్మోత్సవ వాహన సేవలలో అలసిపోయి చివరి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు వరాహస్వామి సన్నిధిలో వేద మంత్రోచ్ఛారణల మధ్య సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించడం తరతరాల సాంప్రదాయం! ఈ సారి దీనిని కూడా ఏకాంగంగా నిర్వహించాలనకుంటున్నట్లు తెలిసింది. ఇది సబబు కాదు.

3) “చక్రస్నానం” ఘట్టాన్ని యధావిధిగా పరిమిత సంఖ్యలో అర్చకులు అధికారులను అనుమతించి పుష్కరిణిలో నిర్వహించి ఎస్వీబీసీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు వీక్షించే ఏర్పాట్లు చేయాలి!!
4) “శ్రీవారి గరుడసేవ” నాడు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి ని సాంప్రదాయబద్ధంగా టిటిడి ధర్మకర్తల మండలి అధికారులు అర్చకులు ప్రముఖులు కలసి”బేడి ఆంజనేయస్వామి” ఆలయం నుంచి వేద మంత్రాల మధ్య ఊరేగింపుగా మహద్వారం నుంచి ఆలయంలోకి తీసుకెళ్లడం జరిగింది!అపుడు ఎంతో మంది ముఖ్యమంత్రి వెంబడి ఈ వూరేగింపులో పాల్గొన్నారు.బయటి నుంచి వచ్చిన వాళ్లతో జరిగిన వూరేగింపు అది.
5)ఇదే పద్ధతిలో  “శ్రీవారి చక్రస్నానం” కార్యక్రమాన్ని సైతం టీటీడీ ధర్మకర్తల మండలి అధికారులు అర్చకులు సాంప్రదాయబద్దంగా నిర్వహించవచ్చు. భయటి నుంచి భక్తులు ఎలాగూ రాలేదు. అందువల్ల తిరుమల కొండమీద ఉంటున్న వారిని పరిమిత సంఖ్యలో అనుమతించి  శాస్త్రోక్తంగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం జరిపించండి!
6) తిరుమలలో నివాసముండే స్థానికులకు కనీసం పుష్కరిణి బయటనుంచి చక్రస్నాన ఘట్టం చూసే విధంగా అనుమతి ఇవ్వండి!!
7) శ్రీవారి అనుగ్రహంతో పెద్ద జీయర్ స్వామి చిన్న జీయర్ స్వామి టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు ప్రధాన అర్చకులు ఆగమ సలహా మండలి శ్రీవారి చక్రస్నానం కు సంబంధించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను!
(నవీన్ కుమార్ రెడ్డి,శ్రీవారి భక్తులు,తిరుపతి)