మెరుగు పడుతున్న ‘కరోనా కర్నూలు’ జల్లా ఆరోగ్యం

కర్నూలు జిల్లాకు ఆ మధ్య ‘కరోనా కర్నూలు’ అని పేరు వచ్చింది. ఒక దశలో రాష్ట్రంలో వచ్చిన కరోనా కేసులలో  మూడింట రెండొంతులు కర్నూలు జిల్లా నుంచే వచ్చాయి. దీనితో కర్నూలు అంటే  జిల్లా వాసులే కాదు, ఇతర జిల్లాల వారు, పొరుగు రాష్ట్రాల వారు కూడా  భయపడటం మొదలయింది.
కర్నూలు జిల్లావారిని హైదరాబాద్ రానీయడం లేదని ఫిర్యాదులొచ్చాయి. కర్నూలు, గుంటూరు జిల్లాలనుంచి తెలంగాణకు ఎవరినీ రానీయవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారని చెబుతున్నారు. నిజమే కావచ్చు. ఎందుకంటే ఆ మధ్య కర్నూలు జిల్లాకు చెందిన ఒక రాజకీయ ప్రముఖుని కుటుంబంలో అయిదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన తన పలుకుబడిని ఉపయోగించి వారందరిని హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలోచేర్పించారు. అయితే, ఈ విషయం తెలంగాణ ప్రభుత్వానికి పొక్కింది. వెంటనే జిల్లా వైద్య శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఆసుపత్రికి వచ్చి వారందరిని కర్నూలు కు తిప్పిపంపారు. తర్వాత వారిని కర్నూలు కోవిడ్ సెంటర్ లో చేర్పించారని తెలిసింది. దీనిని బట్టి పక్క రాష్ట్రం కూడా కర్నూలు అంటేభయపడుతూ ఉందని అర్థమవుతుంది.
ఈ చెడ్డభయం నుంచి కర్నూలు బయపడుతున్నదనిపిస్తుంది. ఎందుకంటే జిల్లాలో కొత్తగా నమోదవుతున్న కేసులకంటే చికిత్స తీసుకుని  కరోనాను జయించి ఆసుపత్రి నుంచి విడుదలవుతున్నవారి సంఖ్య పెరుగుతూ ఉంది. గత 24 నాలుగు గంటలలో కర్నూలు జిల్లా నుంచి 9 కేసులునమోదయితే, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్అయిన వారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రెడిట్ ప్రొయాక్టివ్ కలెక్టర్ గా పేరున్న జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కు దక్కుతుంది. ఇలాగే ప్రమాదం అంచుల్లో సేవలందిస్తున్న వివిధ ఆసుపత్రుల డాక్టర్లు, నర్సలు, శానిటరీ సిబ్బంది సేవలు కూడా ప్రశంసనీయం.
మొత్తంగా  ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 281 మంది కరోనా విజేతలు డిశ్చార్చ్ అయ్యారు.
 ఈ రోజు  14 మంది చికిత్స తీసుకుని ఆసుపత్రి నుంచి బయటపడ్డారు.  యాక్టీవ్ పేషేంట్ల సంఖ్య నుండి  14మందిని  తీసేయగా మిగిలిన యాక్టివ్ పేషేంట్ల సంఖ్య 278 మాత్రమే.  చాలా సంతోషం, జిల్లా ప్రజలందరిలో  మనోధైర్యం పెంచుతూ ఉంది.
ఈ సాయంత్రం డిశ్చార్చ్ అయిన 14 మంది కరోనా విజేతల్లో 11 మంది పురుషులు, 3 గురు మహిళలు. డిశ్చార్జ్ అయిన వారిలో ఒక బాలుడు( 13 సం)  తప్ప మిగతా అందరూ 35 సం.ల నుండి 60 సం.ల మధ్య వయసు ఉన్నవారే. వీరిలో కర్నూలు నగర వాసులు 9 మంది, నంద్యాల అర్బన్-2; బనగానిపల్లె రూరల్-1; చాగలమర్రి-1; కోడుమూరు-1 ఉన్నారు.
ఈ సాయంత్రం న 14 మంది కరోనా విజేతల్లో నంద్యాల శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుండి 12 మందిని, కర్నూలు జిజిహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రి నుండి ఇద్దరిని డాక్టర్లు డిశ్చార్చ్ చేశారు.
డిశ్చార్చ్ ఆయిన 14 మంది కరోనా విజేతలకు  ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి బ్యాంక్ ఖాతాల ద్వారా అందించారు.  వారందరిని ప్రత్యేక అంబులెన్స్ వాహనాల్లో వారి వారి ఇళ్లకు పంపించారు.
గత నెలలో కర్నూలు జిజిహెచ్, జిల్లా కోవిడ్ ఆస్పత్రి శాంతిరామ్ ఐసోలేషన్ వార్డులలో ఆ 14 మంది కరోనా బాధితులను చేరారు. చికిత్స కాలంలో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం 2 సార్లు రిపీట్ టెస్ట్ లను చేశారు. ఇందులో నెగటివ్ ఫలితం రావడంతో వారందరిని ఇపుడు విడుదల చేశారు.