గోదావరి నీళ్ల మీద మే 17న కెసిఆర్ ప్రత్యేక సమావేశం

ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది.
గోదావరి ప్రాజెక్టలు పరివాహక ప్రాంతాల మంత్రులు, అధికారులతో జరిగే అ ప్రత్యేక సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమయి, రోజంతా కొనసాగుతుంది.
గోదావరి ప్రాజెక్టుల నుంచి ఈ వర్షాకాలంలో నీరు ఎప్పుడు ఎంత విడుదల చేయాలి?ఎస్ఆర్ఎస్పి, ఎల్ఎండిలకు నీళ్లు ఎప్పుడు ఎంత తరలించాలి?
మిగతా రిజర్వాయర్లకు ఎప్పుడు తరలించాలి? నీటిని ఎలా వాడుకోవాలి? తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృత చర్చ జరుగుతుంది.
ఈ సమావేశానికి గోదావరి నది పరివాహక జిల్లాల మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, కెటి రామారావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డిలను ఆహ్వానించారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇఎన్సి మురళీధర్, ఎస్సారెస్పీ సిఇ శంకర్, కాళేశ్వరం సిఇ వెంకటేశ్వర్లు, ఇతర సీనియర్ నీటి పారుదల ఇంజనీర్లను ఆహ్వానించారు.