ప్రధాని గారూ, విశాఖ ఉక్కు వెనక ప్రాణ త్యాగాలున్నాయ్: గుర్తు చేసిన జగన్

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ నుంచి 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనను  పున:పరిశీలించాలని  ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌  లేఖ రాశారు. కేంధ్రప్రతిపాదనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో లెచిన నిరసన వెల్లవల మధ్య ఈ లేఖ రాస్తూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇది దీర్ఘకాల పోరాటం తర్వాత సాధించుకున్న సంస్థ అని  దాదాపు దశాబ్ధ కాలం పాటు ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో కొనసాగించిన ఉద్యమంలో దాదాపు 32 మంది అసువులు బాసారని చెబుతూ  1970 ఏప్రిల్‌ 17 న నాటి ప్రధాని ఇందిరాగాంధీ విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై చేసిన ప్రకటన నేఫథ్యాన్ని ఆయన ప్రధానికి గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి లేఖలోని అంశాలు:

రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఆధ్వర్యంలో పని చేస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి వ్యూహాత్మకంగా 100 శాతం పెట్టుబడులకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) అనుమతి ఇచ్చిందని మీడియా వార్తలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

ఆర్‌ఐఎన్‌ఎల్‌ అధీనంలో ఒక ప్రత్యేక సంస్థగా నిల్చిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (వీఎస్‌పీ) కేంద్ర ఉక్కు శాఖ కింద పని చేస్తూ, నవరత్నాలులో ఒకటిగా గుర్తింపు పొందింది. దాదాపు 20 వేల మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగా మరెందరికో విశాఖ నగరంలో ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలలో అతి పెద్దగా నిలుస్తోంది.

దేశంలో సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటైన తొలి స్టీల్‌ ప్లాంట్‌ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అత్యంత నాణ్యమైన ఉక్కును తయారు చేస్తూ, నిర్మాణ, మౌలిక వసతులు, ఉత్పత్తి రంగాలతో పాటు, ఆటోమొబైల్‌ రంగం అవసరాలు కూడా తీరుస్తోంది.

2002 నుంచి 2015 వరకు విశాఖ ఉక్కు కర్మాగారం అత్యుత్తమ పనితీరు ప్రదర్శించి లాభాల బాటలో నడిచిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను.

2002లో ఖాయిలా పరిశ్రమగా బీఐఎఫ్‌ఆర్‌కు నివేదించారు.

దాదాపు విశాఖ నగరంలోనే ఉన్న స్టీల్‌ ప్లాంట్‌కు 19,700 ఎకరాల భూమి ఉంది. దాని ప్రస్తుత మార్కెట్‌ విలువ సుమారు లక్ష కోట్లకు పైగానే ఉంటుంది. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్‌ టన్నులు కాగా, ఇటీవలే ఆర్‌ఐఎన్‌ఎల్‌ సంస్థను ఆ«ధునీకరించడంతో పాటు, ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి విస్తరణ చర్యలు చేపట్టింది. ఆ దిశలో వనరుల సేకరణ కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది.

విశ్వవ్యాప్తంగా ఈ రంగంలో ఉత్పన్నమైన మాంద్యంతో విశాఖ ఉక్కు కర్మాగారం కూడా 2014–15 నుంచి క్రమంగా నష్టాల బాట పట్టింది. సొంతంగాగనులు లేకపోవడంతో, ఉత్పత్తి వ్యయం దారుణంగా పెరిగింది. ఫలితంగా లాభాలు పూర్తిగా పడిపోయాయి.

విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి పెట్టుబడులు ఉపసంహరించడం కంటే, ఆ సంస్థకు కాస్త అండగా నిల్చి, చేయూతనిస్తే తప్పనిసరిగా లాభాల బాటలో నడుస్తుందన్న గట్టి నమ్మకంతో చెబుతున్నాను. సంస్థకు అవసరమైన గనులను కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. అదే విధంగా ఎక్కువ వడ్డీ రుణాలను, తక్కువ వడ్డీ రుణాలుగా మార్చడం, రుణాలను వాటాల రూపంలోకి మార్చాలనే ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

1). టర్న్‌ ఎరౌండ్‌ సాధనకు నిరంతర ఆపరేషన్‌:
ఆర్థిక అంశాలకు సంబంధించిన అన్ని రంగాలతో పాటు, స్టీల్‌ రంగం కూడా ఆర్థిక మాంద్యం నుంచి క్రమంగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పూర్తి ఉత్పాదక సామర్థ్యం 7.3 మెట్రిక్‌ టన్నులు కాగా, ఆర్‌ఐఎన్‌ఎల్‌ గత ఏడాది డిసెంబరు నుంచి 6.3 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో గరిష్ట స్థాయిలో పని చేస్తూ ప్రతి నెలా దాదాపు రూ.200 కోట్ల లాభాలు ఆర్జిస్తోంది. ఇదే తరహాలో మరో రెండేళ్లు పని చేస్తే, సంస్థ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారి పోతుంది.

2). ఉత్పత్తి వ్యయం తగ్గడం కోసం సొంత గనులు:
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తమ ఉత్పత్తి కోసం ప్రస్తుతం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)కి చెందిన బైలదిల్లాలోని గనుల నుంచి మార్కెట్‌ధరకు ఇనుప ఖనిజం కొనుగోలు చేస్తోంది. ఒక్కో మెట్రిక్‌ టన్ను ఇనుప ఖనిజాన్ని దాదాపు రూ.5260కు సంస్థ కొనుగోలు చేస్తోంది. కాగా దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాలకు సొంతంగా ఇనుప ఖనిజ గనులు ఉన్నాయి. వాటి ద్వారా ఆయా సంస్థల అవసరాలు 60 శాతం మేర తీరుతుండగా, మిగిలిన ఇనుప ఖనిజాన్ని అవి ఎన్‌ఎండీసీకి చెందిన గనుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి.
చివరకు కేంద్ర ప్రభుత్వ రంగంలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)కు కూడా 200 ఏళ్లకు సరిపడా ఇనుప ఖనిజం గనులు సొంతంగా ఉన్నాయి. కానీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు అవసరమైన ఇనుప ఖనిజాన్ని పూర్తిగా ఎన్‌ఎండీసీ గనుల నుంచి కొనుగోలు చేయడం ద్వారా ఆర్‌ఐఎన్‌ఎల్‌పై రూ.3,472 కోట్లకు పైగా భారం పడుతోంది.
అందువల్ల ఈ రంగంలో ఉన్న మిగిలిన సంస్థలతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పోటీ పడే విధంగా సొంత గనులు కేటాయించాలి. ఇది ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఒడిషాలో ఒక ఇనుప ఖనిజం గని ఉంది. అది సంస్థ పునరుద్ధరణలో ఎంతో దోహదకారిగా నిలుస్తుంది.

3). ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ:
సంస్థ స్వల్పకాలిక, దీర్ధకాలిక రుణాలను ఈక్విటీలుగా మార్చడం వల్ల సంస్థపై రుణాలు తిరిగి చెల్లించే ఒత్తిడి తగ్గించడంతో పాటు, రుణాలపై వడ్డీల భారం కూడా తగ్గుతుంది. సంస్థ రుణం భారం రూ.22 వేల కోట్లు కాగా, దానికి అత్యధికంగా 14 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఆ రుణాలను బ్యాంకులు ఈక్విటీలుగా మారిస్తే, వడ్డీ భారం పూర్తిగా పోవడంతో పాటు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్, విశాఖ) కూడా స్టాక్‌ ఎక్సేంజీలో లిస్ట్‌ అవుతుంది. ఆ ప్రక్రియతో స్టాక్‌ మార్కెట్‌ ద్వారా ప్రజల నుంచి నిధుల సేకరణకు అవకాశం కూడా ఏర్పడుతుంది.
ఈ చర్యలు సంస్థపై రుణభారం తగ్గిస్తుంది. తద్వారా పనితీరు మరింత మెరుగు కావడంతో ఆర్థికంగా వెసులుబాటు కూడా కలుగుతుంది.

దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తెలుగు ప్రజలకు ఎప్పటికీ చెరగని ముద్రగానే నిలుస్తుంది. రాష్ట్ర సంస్కృతిలో ఒక భాగంగా నిలుస్తుందనే చెప్పాలి.

అందువల్లనే సంస్థ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రానికి ఆభరణమైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వం కాపాడుకుంటుంది.

అందువల్ల విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్, విశాఖ)లో వ్యూహాత్మకంగా 100 శాతం పెట్టుబడులు ఉపసంహరిచాలని తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేసి, సంస్థ పునరుద్ధరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి.

సమాజానికి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఎంతో విలువైన, ముఖ్యమైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *