ఇదేం ప్యాకేజ్, మా కొచ్చేదేమీ లేదు: కేంద్రమంత్రితో మంత్రి సత్యవతి

హైదరాబాద్, మే 18 : కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ వల్ల గిరిజనులకు ప్రయోజనమేమి కలగడం లేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాకు తెలిపారు.
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితులు ఎలా ఉన్నాయని కేంద్ర మంత్రి అర్జున్ మొండా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తో నేడు ఫోన్లో మాట్లాడారు.
 కేంద్ర ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీపై రాష్ట్రంలో ఏమనుకుంటున్నారంటూ కేంద్రమంత్రి ఆరా తీశారు. దీనిపై మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ స్పందిస్త కేంద్ర ఉద్దీపన ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ప్రయోజనమేమి లేదని తెలిపారు.
ముఖ్యంగా ఈ 20 లక్షల కోట్ల రూపాయలలో గిరిజనులకు నేరుగా లబ్ది చేకూరేదేమి లేదన్నారు. కరోనా వైరస్ ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చేందుకు, రవాణా వసతి పటిష్ట పర్చాలని కోరారు.
కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి అర్జున్ ముండాకు వివరించారు. గిరిజన ప్రాంతాలలో కరోనా వైరస్ తాకిడి లేదని, అదేసమయంలో లాక్ డౌన్ సందర్భంగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.