ఏపీలో ఆగని కరోన పాజిటివ్ కేసులు… మొత్తం 757, మృతులు 22

ఆంధ్రప్రదేశ్ లో కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. అనుమానితుల శాంపిల్స్ పరీక్షిస్తున్న కొద్ది  కొత్త కేసులు పెద్ద ఎత్తున బయటపడతున్నాయి. గత  24గంటల్లో అంటే నిన్న ఉదయం 9 నుంచి ఈ ఉదయం 9 వరకు జరిపిన పరీక్షల్లో కొత్తగా 35 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.  ఇందులో అత్యధికంగా పది కేసులు కర్నూలు జిల్లా నుంచి  బయటపడ్డాయి.
జిల్లాల వారీగా నిన్నవెల్లడయిన కేసులు కర్నూలులో 10,గుంటూరు 9, కృష్ణా 3, కడప 6, పాగో 4, అనంతపురం లో 3
పెరిగిన కేసులను కలుపుకొని ఏపీలో  పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరింది.
ఇప్పటి వరకు కరోనా వల్ల 22 మంది మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
గడిచిన 24 గంటల్లో మొత్తంగా   5022 శాంపిల్స్ పరీక్షించారు. మరొక వైపు ఆసుపత్రి నుంచి 96  మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం 639 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతూ ఉంది.

ఇది ఇలా ఉంటే కర్నూలు జిల్లాలో కరొనా మహమ్మారి కట్టడి కోసం కర్నూలు జిజిహెచ్ (గవర్నమెంట్ జనరల్  ఆస్పత్రి) ని స్టేట్ కోవిడ్ హాస్పిటల్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
 ఈ ఉదయం జిజిహెచ్ ధన్వంతరి కాన్ఫరెన్సు హాల్లో జిజిహెచ్ సూపరిన్టెండెంట్ డా.రాంప్రసాద్, అన్ని విభాగల హెడ్స్, ప్రొఫెసర్స్, డాక్టర్లు, ఐఎంఏ ప్రతినిధులు, ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ప్రస్తుతం జిజిహెచ్  కరోనా ఆసుపత్రి కావడంతో ఇందులో ఉన్న పేషేంట్లను నగరంలోని 12 ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రులకు షిఫ్ట్ చేయడంపై  జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ చర్చిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో కరొనా మహమ్మారి కట్టడి కోసం  ముస్లిం మైనారిటీ సోదరులందరూ పవిత్ర రంజాన్ ప్రార్థనలను వారి వారి ఇళ్లలోనే చేసుకుని సహకరించాలని  ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనరాజేంద్ర నాథ్ రెడ్డి విజ్ఞప్తిచేశారు.
కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఈ ఉదయం ముస్లిం మత పెద్దలతో సమావేశమై కర్నూలులో కరోనా కట్టడి చర్యలపై  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చర్చించారు.