సీమకు అన్నింటా సమాన అవకాశాలు …. రాయలసీమ నేతల డిమాండ్

వనరుల,నిధుల, ఇతర ప్రయోజనాల్నింటా రాయలసీమకు సమాన వాట ఉండాలని సీమ నాలుగు జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది నాయకులు డిమాండ్ చేశారు. వీరంతా కడప పట్టణంలో ఈ రోజు ప్రజా సంకల్ప దీక్షలో పాల్గొన్నారు. రాయలసీమ ఆకాంక్షలు నెరరేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు.
 “రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక” ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. రాయలసీమ ప్రజల ఆశల, ఆకాంక్షలకు అనుగుణంగా వ్యక్తపరిచిన డిమాండ్లను పాలకులకు, అన్ని రాజకీయ పార్టీలకు విస్పష్టంగా తెలియచేయడానికి, రాయలసీమ సమాన అభివృద్ధి సాధించటానకి రాయలసీమ సంకల్పదీక్ష ఏర్పాటు చేయడమైనదని సమావేశంలో ప్రసంగించిన రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్‌ బొజ్జా దశరథరామిరెడ్డి బొజ్జా ధశరథరామిరెడ్డి తెలిపారు. ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నార. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు తోపాటు శాసన, సచివాలయ కేంద్రాలను కూడా నెలకొల్పాలని కోరారు. రాష్ట్రంలో నికరజలాలను కూడా ప్రాంతాల వారిగా విభజించాలని పేర్కొన్నారు. రాయలసీమ సాగునీటి సాధనే ఆశయంగా భవిష్యత్తు ఉద్యమం చేపడతామని ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి వై. నాగిరెడ్డి, కడప, అధ్యక్షత వహించారు.
రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు నుండి రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సభ్య సంస్థల ప్రతినిధులు వందలాదిగా రాయలసీమ సంకల్ప దీక్షలో పాల్గొన్నారు. పాలకుల నిర్లక్ష్యంతో ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వెనుకబడిన రాయలసీమ కేవలం సమానాభివృద్దిని ప్రజాస్వామికంగా కోరుకుంటు చేసిన సమావేశం తీర్మానాలను జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి అందచేయడమైనది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు.. నుండి కోటిరెడ్డి, సురేందర్ రెడ్డి,
ప్రకాశం నుండి బ్రహ్మానందరెడ్డి,
చిత్తూరు.. నుండి మాగంటి గోపాలరెడ్డి, ఆచార్య దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి,
కడప నుండి.. సోమశేఖరరెడ్డి, శివారెడ్డి, రవిశంకర్ రెడ్డి, ప్రశాంత్, భాస్కర్,
అనంతపురం నుండి.. రాంకుమార్, డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, రామకృష్ణ, ప్రభాకర రెడ్డి, అశోక్, నాగార్జున రెడ్డి,

కర్నూలు.. నుండి వై.యన్ రెడ్డి, అరుణ్, రత్నం, రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజు కళాకారుల బృందం పాటలు పాడారు.

పాలనా వ్యవస్థ, అభివృద్ధి వికేంద్రీకరణలపై ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేయడాన్ని సమావేశం ఆహ్వానించింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలు చారిత్రక శ్రీభాగ్ ఒడంబడిక నేపథ్యాన్ని ప్రస్తావిస్తు రాష్ట్రంలో న్యాయ రాజధాని, శాసన రాజధాని, కార్య నిర్వాహక రాజధాని ఏర్పాటుతో పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాలని కమిటీలు పేర్కొనడాన్ని స్వాగతించింది.
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని లేదా హైకోర్టును నిర్ణయించుకొనే హక్కు రాయలసీమ వాసులకు ఉంది. ఆ అవకాశం లేకుండా గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం అసమంజసంగా ఉందని సమావేశం అభిప్రాయపడింది
సమావేశం ఆమోదించిన తీర్మానాలు 
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సమాన అభివృద్ధికి కీలకమైన పాలనావ్యవస్థ వికేంద్రీకరణలో రాయలసీమకు కుడా మిగిలిన ప్రాంతాలతో సమానంగా ప్రాతినిధ్యం కల్పించడంలో భాగంగా హైకోర్ట్ తో పాటు, సెక్రటేరియట్ విభాగాలు, శాసనసభ సమావేశాలు రాయలసీమలో కూడా ఏర్పాటు చేయాలి.
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కృష్ణా, తుంగభద్ర జలాలలో రాయలసీమకు ప్రధమ ప్రాధాన్యతను ఇవ్వాలి. గోదావరి జలాలను నాగార్జున సాగర్, కృష్ణా డెల్టాకు మల్లించి శ్రీశైలం ప్రాజక్టును పూర్తిగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాలకు కేటాయించాలి.
రాయలసీమలో సాగునీటి హక్కు ఉన్న ప్రాజక్టుల సక్రమ నీటి వినియోగానికి అవసరమైన తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, వేదవతి పై బ్యారేజి మరియు ఎత్తిపోతల పథకం, గుండ్రేవుల రిజర్యాయర్ నిర్మాణం, సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, RDS వరద కాలువ, తుంగభద్ర వరద కాలువ నిర్మాణం చేపట్టాలి.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టులకు నీటి, నిధులు కేటాయింపులు చేసి యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలి.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న బుందేల్ కండ్ ప్రత్యేక ప్యాకేజీని తక్షణమే అమలు చేయాలి.
రాయలసీమ సాంప్రదాయ వనరులైన చెరువుల, కుంటల అభివృద్దికి, నిర్మాణానికి ప్రత్యేక ఇరిగేషన్ కమీషన్ ఏర్పాటు చేయాలి.
కృష్ణానది యాజమాన్య బోర్డు, AIMS, రైల్వేజోన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు చేయాలని తీర్మానించింది.
రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, సంస్థలు, డైరెక్టరేట్ల ఏర్పాటులో రాయలసీమకు సమ ప్రాతినిధ్యం ఇవ్వాలి.
స్టాట్యూటరి రాయలసీమ అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలి.
రోడ్లు, రైల్వే, ఎయిర్ పోర్టుల మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి.
కోస్తా జిల్లాలతో సమానంగా రాయలసీమ నెల్లూరు జిల్లాలలో శాసన సభ స్థానాలు ఏర్పాటు చేయాలి.