ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుక లేక ఆరేళ్లయింది, అవమానం కాదా?

శ్రీభాగ్ ఒప్పందం ఫలితం , పొట్టిశ్రీరాములు ఆత్మబలిదానం కారణంగా తొలి భాషాప్రయుక్త రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్టంగా ఏర్పడిందని 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పూర్వ ఆంధ్రరాష్టం ఉనికిలోకి వచ్చిన కారణంగా అక్టోబర్ 1ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి , రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త మాకీరెడ్డి పురుషోత్తమ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అక్టోబర్ 1 ఆంధ్రరాష్ట ఏర్పాటును పురస్కరించుకుని తిరుపతి రుయా ఆసుపత్రికి సమీపంలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి జనసేన యువనేత సురేష్ , ఎన్ బి సుధాకర్ రెడ్డి కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని 2014 విభజన తర్వాత గత 6 సంవత్సరాలుగా రాష్ట్రానికి అవతరణ దినోత్సవం లేక పోవడం అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 ని ప్రకటించి భవిష్యత్తులో వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.
కోస్తా , రాయలసీమ పెద్దమనుషుల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా మద్రాసు నుండి తెలుగు రాష్టంగా విడిపోవడానికి ఉద్యమం జరుగుతున్న సమయంలో పొట్టిశ్రీరాములు చేసిన బలిదానం కారణంగా నాటి కేంద్ర ప్రభుత్వం 1953 అక్టోబర్ 1 తొలి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.
దాని స్పూర్తితో దేశంలో అనేక భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దారితీసిందని అలాంటి చారిత్రాత్మక సంఘటన నేటి ఆధునిక తరానికి స్ఫూర్తి అవుతుంది కనుక ఆరోజును విస్మరించడం శ్రేయస్కరం కాదు అని అభిప్రాయపడ్డారు.
అటుపిమ్మట ఆంధ్రరాష్ట్రం తెలంగాణ కలిపి 1956 నవంబరు 1 న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించినప్పటికి 2014 న తెలంగాణ విడిపోయినకారణంగా నవంబర్ 1 అన్నది చరిత్రలో ఒక తీపి గుర్తుగా మాత్రమే చూడగలమని  చెబుతూ ఆరోజును ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపడం అర్థం లేని చర్యగా అభివర్ణించారు.
ముక్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్న నేతగా శ్రీభాగ్ ఒప్పందానికి విలువ ఇచ్చే వారని దానికి గుర్తుగా హైదరాబాద్ లోని తన ఇంటికి శ్రీభాగ్ అని నామకరణం చేశారు అని గుర్తు చేశారు.
అలాంటి వైఎస్ ఆర్ వారసుడిగా నేడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజును అక్టోబర్ 1ని అధికారికంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.