అమరావతిలో దారుణం… యువతి పై గ్యాంగ్ రేప్, హత్య

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మంగళగిరి మండలం నవులూరు గ్రామంలోని అమరావతి స్టేడియంలో ఓ యువతి దారుణ హత్యకు గురయ్యింది. ఏకాంతంగా గడపడానికి వెళ్లిన ప్రేమ జంట పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అమ్మాయి పై అత్యాచారం చేశారు. ఆ పై దాడి చేయడంతో అమ్మాయి అక్కడికక్కడే చనిపోగా అబ్బాయికి తీవ్రగాయాలయ్యాయి.

తాడేపల్లి పట్టణానికి చెందిన చుంచు శ్రీనివాసరావు, అంగడి జ్యోతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాసరావు బిసి కులానికి చెందినవాడు. జ్యోతి ఎస్టీ సామాజిక వర్గానికి చెందినది. ఆమె ప్రస్తుతం ఎం. ఫార్మసీ చదువుతోంది. జ్యోతి సోమవారం సాయంత్రం సర్టిఫికెట్ల కోసం గుంటూరు వెళుతున్నానని చెప్పి బయల్దేరింది. ఆ తర్వాత ప్రేమికుడు శ్రీనివాసరావు తో కలిసి అమరావతి స్టేడియానికి వెళ్లింది. అక్కడ వారిద్దరు ఏకాంతంగా గడుపుతున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో నలుగురు యువకులు జ్యోతి పై లైంగిక దాడికి తెగబడ్డారు.

శ్రీనివాసరావు ముందే ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీనివాసరావు పై కూడా దాడి చేసి గాయపరిచారు. అత్యాచారం చేసిన తర్వాత జ్యోతిని అతి కిరాతకంగా హత్య చేశారు. శ్రీనివాసరావు తీవ్రగాయాలపాలయ్యాడు. అక్కడ శ్రీనివాసరావు అరుపులతో అటుగా వెళ్లేవారు గమనించి అక్కడికి చేరుకున్నారు. వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. శ్రీనివాసరావును ఆస్పత్రికి తరలించి జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

అయితే జ్యోతిని శ్రీనివాసరావే చంపాడని జ్యోతి బంధువులు ఆరోపిస్తున్నారు. జ్యోతి రావడానికి ముందు శ్రీనివాసరావు మరో అమ్మాయితో నాలుగు సార్లు ఫోన్ చేయించినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *