వైసిపి వచ్చాక టిడిపి మీద దాడులు పెరుగుతున్నాయ్, జాగ్రత్త

ఈ రోజు అమరావతిలో జరిగిన టిడిపి సమావేశంలో  చంద్రబాబు ప్రసంగం.

ఎన్నికల ఫలితాలు వచ్చి 22రోజులు(మూడు వారాలు)అయ్యింది. ఈ లోపే తెలుగుదేశం నేతల మీద కార్యకర్తల మీద దాడులు తీవ్రకావడం పట్ల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
  ఎన్నికల్లో ఓటమి  కారణాలను చర్చించేందుకు ఈ రోజు ఆయన అభ్యర్థులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇదీ ప్రసంగం.
టిడిపికి సీట్లు తగ్గినా ఓట్ల శాతం గణనీయంగా ఉంది.ఓటమి కారణాలపై విశ్లేషించుకున్నాం.ఎమ్మెల్యేలు,ఎంపిలతో మాట్లాడటం జరిగింది. ఈ రోజు అభ్యర్ధులతో సమావేశం ఏర్పాటు చేశాం.
ఈ మూడువారాలలో టిడిపి నేతల మీద దాడులు తీవ్రకావడం మీద ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దాడులను నివారించడం, దౌర్జన్యాలను ఎదుర్కోవడమే తక్షణ కర్తవ్యం.
గత 3వారాల్లోనే దాదాపు 100కు పైగా దాడులు జరిగాయి…
అనంతపురం జిల్లాలో హత్యలు, గుంటూరు జిల్లా పల్నాడులో హత్య, కార్యకర్తలపై దాడులు, శిలాఫలకాల ధ్వంసం, బత్తలపల్లిలో అంగన్ వాడి భవనం కూల్చేయడం, మచిలీపట్నంలో కళ్యాణమండపం శిలా ఫలకం పగులకొట్టడం, పిఠాపురంలో 14మందికి గాయాలు, కర్నూలు జిల్లా ఇటిక్యాల మండలంలో దాడులు, అన్నా కేంటిన్ల బోర్డుల మార్పు, శిలా ఫలకాల ధ్వంసం, చుండూరులో టిడిపి కార్యాలయానికి నిప్పు, బ్రహ్మసముద్రం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు..22రోజుల్లోనే అనేక అరాచకాలకు పాల్పడ్డారు.
5సార్లు టిడిపి గెలిచినా ఎప్పుడూ ప్రత్యర్ధులపై దాడులు చేయలేదు. ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు, ప్రజల్లో భయోత్పాతం పెంచడం చేయలేదు. కానీ వాళ్లు గెలిచినప్పుడల్లా టిడిపిపై దాడులు జరపడం రివాజుగా మారింది.
ఆస్తులు ధ్వంసం చేయడం, బెదిరింపులు, దాడులు-దౌర్జన్యాలు పరిపాటి అయ్యింది. ఎక్కడ దాడులు జరిగినా తక్షణమే స్థానిక నాయకత్వం స్పందించాలి.
ప్రెస్ మీట్లు పెట్టి దాడులను ఖండించాలి, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించాలి, జిల్లా పార్టీ నేతలు ఆ ప్రాంతానికి తరలివెళ్లి వారిలో భరోసా పెంచాలి. రాష్ట్ర పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వాలి.
37ఏళ్ల చరిత్ర ఉన్నపార్టీ తెలుగుదేశం, ఈ 37ఏళ్లలో 5సార్లు గెలిచాం,4సార్లు ఓడిపోయాం. గెలిచినప్పుడు ఆనందం,ఓడినప్పుడు ఆవేదన సహజం
అయినా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.గత ఎన్నికల్లో ఓటమికి ఏదో ఒక కారణం ఉంది.
ఈసారి ఎన్నికల్లో కారణాలు కనబడని పరిస్థితి ప్రతి 5ఏళ్లకు ఎన్నికలు వస్తాయి, ఎన్నికల్లో గెలుపోటములు సహజం తెలుగుదేశం పార్టీ శాశ్వతం.. భావితరాలకు పార్టీని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.
గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోవడం కరెక్ట్ కాదు.
విభజన తరువాత రాష్ట్రంలో దిక్కుతోచని స్థితి.వేల కోట్ల ఆర్ధికలోటులో అభివృద్ధిలో ముందుకు పోయాం.విభజన సమస్యలను ఒక్కొక్కటే అధిగమించాం..
ప్రజలకు ఇబ్బందులు లేకుండా అభివృద్దిలో ముందుకు పోయాం
సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం.
అయినా ఓటమికి దారితీసిన అంశాలను పరిశీలించాలి.
అంతర్గత అంశాలు, బైట ప్రభావితం చేసిన అంశాలు అధ్యయనం చేయాలి. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
లోపాలు ఏమన్నా ఉంటే చక్కదిద్దుకోవాలి.
ఈ రోజు ఒక రాజకీయ పార్టీగా ప్రజల పట్ల ఒక బాధ్యత ఉంది.
మనకు ఓట్లేసిన ప్రజలు, మనల్నే నమ్మిన కార్యకర్తలకు అండగా ఉండాలి. కార్యకర్తల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం.
కార్యకర్తలు అనేకమంది పార్టీ కోసం బలిదానం చేశారు. కానీ వారి కుటుంబాలు పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నాయి. పార్టీ పట్ల కార్యకర్తల్లో ఉన్న నిబద్ధత అది.నమ్ముకున్న వర్గాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. టిడిపి కార్యకర్తల్లో ఏ ఒక్కరూ ఒంటరి కాదు. తెలుగుదేశం కార్యకర్త ఒక సామూహిక శక్తి.
ప్రతి కార్యకర్త వెన్నంటి లక్షలాది కార్యకర్తలు ఉన్నారు, ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా వేలాది నాయకులు ఉంటారు