సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌

తిరుమల, 2021 అక్టోబరు 13

2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు,సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై శ్రీ గోవింద‌రాజ‌స్వామి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధ‌వారం ఉదయం 9 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు శ్రీ గోవింద‌రాజ‌స్వామి అలంకారంలో దర్శనమిచ్చారు.

సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్య‌ప్రాప్తి

బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

రాత్రి 7 గంటలకు చంద్ర‌ప్ర‌భ ‌వాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు అనుగ్ర‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి దంప‌తులు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *