తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కు ఎంపీల నివాళి

న్యూ ఢిల్లీ,  సెప్టెంబర్ 17, 2020: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతిని పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ భవన్ లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన సంతాప సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, భవన్ అధికారులు పాల్గొని నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో మొదటగా వై. ఎస్. ఆర్. సి. పి. పార్లమెంటరీ పార్టీ నాయకులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వి. విజయసాయిరెడ్డి, జ్యోతి ప్రజ్వలన గావించి దివంగత ఎంపీ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం సంతాప సభకు విచ్చేసిన పార్లమెంటు సభ్యులతో కలసి రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.    కార్యక్రమానికి లోక్ సభలో వై. ఎస్. ఆర్. సి. పి. నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పార్లమెంటు సభ్యులుమాగుంట శ్రీనివాసులు రెడ్డి,  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , శ్రీమతి సత్యవతి, గోరంట్ల మాధవ్ , పోచ బ్రహ్మానందరెడ్డి , లావు శ్రీకృష్ణదేవరాయలు,  అయోధ్య రామి రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ , తలారి రంగయ్య ,  ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్   అభయ్ త్రిపాటి, రెసిడెంట్ కమీషనర్ శ్రీమతి భావన సక్సేనా, స్పెషల్ కమీషనర్ ఎన్. వి.  రమణారెడ్డి, భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు.
మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్ తో తనకున్న వ్యక్తిగత అనుబంధం గురించి మాట్లాడుతూ  28 ఏళ్లకే రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ప్రతిసారి తన ఆశీస్సులు తీసుకునేవారని, వారి మరణం ఆయన కుటుంబానికే కాదు, తనకు కూడా వ్యక్తిగతంగా తీరని లోటని వెలిబుచ్చారు.  పార్లమెంట్ లో అందరితో కలివిడిగా, కలుపుగోలుగా ఉండేవారని, ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే సిద్ధంగా ఉండేవారని కొనియాడారు.
  లావు శ్రీకృష్ణదేవరాయలు , ఎంపీ  విలేఖరులతో మాట్లాడుతూ బల్లి దుర్గాప్రసాద్ ఏదైనా భోళా గా మాట్లాడే మనిషి, నిరంతరం ప్రజల కోసం పనిచేసే వారు, ఆయన అకాల మరణం పార్టీకి ప్రజలకు తీరని లోటని సంతాపాన్ని వ్యక్తం చేశారు.
శ్రీమతి సత్యవతి, అనకాపల్లి ఎంపీ మాట్లాడుతూ సహచర ఎంపీ దుర్గా ప్రసాద్ మరణం మమ్మల్ని అందరినీ ఎంతో బాధించిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని అన్నారు.