ఒక్క పండ్ల చెట్టుకు CCTV కెమెరా నిఘా గురించి ఎపుడై విన్నారా?

(యనమల నాగిరెడ్డి & బివిఎస్ మూర్తి)
ఈ చెట్టు దేశంలోనే అరుదైన పండ్ల నిస్తుంది. ఇవి మామూలు  పళ్లుగాదు, అన్నింటికంటే భిన్నంగా రాగిరంగులోఉండే పనప తొనలు. ఆవూర్లో తప్ప మరొక చోట దొరకవు.అందుకే ఈ చెట్టును దుండగుల బారి నుంచి కాపాడుకునేందుకు 24X7 సిసి టివిల నిఘా అవసరమయింది. ఇదెంతో అరుదైన వెరైటీ కావడంతో  దీనిని కాపాడుతూ వచ్చిన రైతు పేరే దీనికి పెట్టారు. ఇలా జరగడం దేశంలో ఇదే ప్రథమం. ఈ చెట్టు కథేంటో చదవండి.
సిద్దూ పనస మొక్కల పంపిణీ
రైతు ఇంటి పెరటిలో పుట్టి, ఇండియన్ హార్టికల్చర్ శాస్త్రవేత్తల కృషితో ప్రపంచ ప్రఖ్యాతి పొంది, ఈ సాధారణ రైతు ఇంట సిరులు కురిపిస్తున్న ఓ పనసచెట్టు అసాధారణ కథ ఇది.
కర్ణాటక రాష్ట్రం, తుముకూరు జిల్లా గుబ్బి తాలూకా లోని ఓ మారుమూల గ్రామం సీగనహళ్లి. 2017కు ముందు ఇది ఓ సాధారణ కుగ్రామం. 2017లో ఐ. ఐ. హెచ్. ఆర్. (Indinan Institute of Horticulture and Reserch) బెంగళూరులో నిర్వహించిన మామిడి మరియు పనస పండ్ల ఎక్సిబిషన్ ఈ గ్రామాన్ని, పనసచెట్టు యజమాని పరమేశు (40) పేరును ప్రపంచానికి పరిచయం చేసింది.
పరమేశు తోటలో ఉన్న పనసచెట్టు గొప్పతనాన్ని, దానిలో ఉన్న వైద్యపరమైన విశిష్ఠ గుణాలను గమనించిన  ఐ. ఐ. హెచ్. ఆర్. డైరెక్టర్ దినేష్, శాస్త్రవేత్త డాక్టర్ జి.కరుణాకరన్ లు దీనిసంగతెేంటో కనుక్కోవాలని పరిశోధనలు సాగించారు. ఈ మొక్క గొప్పతనం, పండులోని ఔషధ గుణాలు వాళ్ల అధ్యయనంలో రుజువయ్యాయి. ఇదొక అరుదైన పనస వెరెటీ కావడంతో ఈ శాస్త్రవేత్తలు దీనికి సిద్దు పనప (Siddu Jackfruit, Siddu Halasu) అని పేరు పెట్టారు.
credits: Times of India

Scientific name: Artocarpus heterophyllus
Family: Moraceae
Energy: 94.89 Calories (per 100 g)
Protein: 1.72 g (per 100 g)

దీనితో  పరమేష్ తో ఒప్పందం కుదుర్చుకొని తల్లి మొక్క నుండి మొక్కలను తయారు చేసి రైతులకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2018లో 5000 మొక్కలను ఉత్పత్తి చేసిన ఈ బృందం, ఈ సంవత్సరం 15000 మొక్కలను తయారు చేస్తున్నామని పరమేశు ట్రేండింగ్ తెలుగు న్యూస్ కు వివరించారు. వివరాలు ఆయన మాటలలోనే!
తాను  తుముకూరు జిల్లా, గుబ్బి తాలూకా సీగనహళ్లి గ్రామానికి చెందిన ఓ  రైతునని తాను, తన తల్లి, తండ్రి, భార్య, ఇరువురు పిల్లలతో వ్యవసాయం చేసుకుంటూ జీవన సాగించేవాడినని ఆయన వివరించారు. తనకు 10 ఎకరాల పొలం, ఓ బోరు బావి ఉందని తెలిపారు. అందరి రైతుల లాగే  తాను కూడా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నానని అయన తెలిపారు. తమ ఇంటి తోటలో తన తండ్రి ఎస్.కె.సిద్దప్ప 37 సంవత్సరాల క్రితం నాటిన ఓ పనస మొక్కఈ నాటికి తన పాలిట కల్పవృక్షం గా మారిందని ఆయన తెలిపారు.
“ఐ. ఐ. హెచ్. ఆర్. ఏసురుగట్ట కేంద్రంలో” 2017లో మామిడి మరియు పనస పండ్ల ప్రదర్శన  నిర్వహించింది. మొత్తం 171 రకాల పనస పండ్లు ప్రదర్శనకు ఉంచారని, అందులో తన చెట్టుకు కాసిన “రాగిరంగు పనస తొనలు” అటు సందర్శకులను, శాస్త్రవేత్తలను బాగా ఆకర్షించాయని ఆయన వివరించారు.
తన తోటలో కాసిన ఈ పనస కాయలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారని, అందులో ఈ  పనసకాయ తొనలు అనేక రోగ నిరోధక లక్షణాలు ఉన్నాయని నిర్దారించారని పరమేశు వివరించారు. ఈ పండులో “కెరటినాయిడ్స్ , ఎక్కువ లికోపిన్, ఫ్లేవనాయిడ్స్, 31 శాతం టీఎస్ఎఫ్ ఉన్నాయని  నిర్థారించిన శాస్త్రవేత్తలు ఈ మొక్కను సాధారణ పండ్ల మొక్కగా కాకుండా ఓషధి పండ్ల మొక్కగా గుర్తించారని పరమేష్ తెలిపారు.
అలాగే  యాంటి యాక్సిడెంట్లు” అధికంగా ఉన్న ఈ పండు గుండె, కిడ్నీ, లివర్ తదితర మానవ అవయవాలను కాపాడటానికి” ఉపయోగ పడుతుందని తేలిందని ఆయన తెలిపారు.
మొక్కల ఉత్పత్తి 
ఐ. ఐ. హెచ్. ఆర్,  ఏసురుగట్ట శాస్త్రవేత్తల  ఆధ్వర్యంలో “బడ్ గ్రాఫ్టింగ్’’, ‘‘బ్రాంచ్ గ్రాఫ్టింగ్” అనే  రెండు పద్దతులను అనుసరించి ఈ మొక్కల ఉత్పత్తిని చేస్తున్నామని పరమేశు తెలి పారు. ఈ విధానాల గురించి ఐ. ఐ. హెచ్. ఆర్, శాస్త్రవేత్తలు తనకు శిక్షణ ఇచ్చారని, అలాగే వారి నిరంతర పర్యవేక్షణ కూడా ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఈ మొక్కల ఉత్పత్తిని ప్రారంభిస్తామని, సెప్టెంబర్ చివర వరకు నాలుగు నెలల పాటు సంరక్షించి రైతులకు అందచేస్తామని ఆయన తెలిపారు. ఈ మొక్కలు నాలుగు సంవత్సరాలలో కాపుకు వస్తాయని అన్నారు.
గత సంవత్సరం 5 వేల మొక్కలను ఉత్పత్తి చేసి మొక్క రెండు వందల చొప్పున అమ్మామని,  అందుకు మూడు లక్షలు ఖర్చు కాగా 7 లక్షలు ఆదాయం వచ్చిందని పరమేష్ తెలిపారు. తన వాటా గా ఐ. ఐ. హెచ్. ఆర్, తనకు చెట్టుకు 110 రూపాయల చొప్పున ఐదు లక్షల రాయల్టీ ఇచ్చిందని ఆయన తెలిపారు.
ప్రస్తుత సంవత్సరంలో 15000 మొక్కలను పెంచుతున్నామని, ఖర్చు పెరిగినందువల్ల మొక్క ధర 250 రూపాయలుగా నిర్దారించామని ఆయన తెలిపారు. ఐ. ఐ. హెచ్. ఆర్ తో తన ఒప్పందం 2020 వరకు ఉంటుందని వివరించారు.
చెట్టుకు భారీ రక్షణ కవచం 
తమ ఇంటి పెరటి చెట్టు తమ పాలిట “కల్పవృక్షం” అంటున్నారు పరమేశు. తన తండ్రి 37 సంవత్సరాలకు ముందు నాటిన ఈ మొక్క ప్రస్తుతం తమ పాలిట లక్ష్మీదేవిగా మారిందని,అందుకే ఈ చెట్టు నుండి ఉత్పత్తి చేస్తున్న మొక్కలకు  తన తండ్రి పేరు, తమ కుటుంబ దైవం ఐన సిద్దేశ్వరుడి పేరు కలసి వచ్చేటట్లు “ సిద్దు వెరైటీ” గా నామకరణం చేశామని పరమేష్ వివరించారు. ఇప్పడు కూడా ఈ చెట్టు ప్రతి సంవత్సరం 450 నుండి 500 వరకు కాయలు కాస్తున్నదని ఆయన తెలిపారు.
అందుకోసం ఈ చెట్టును రక్షించడానికి  విద్యు త్ కంచె, సిసిటివి ఏర్పాటు, గార్డ్ లను కూడా ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
 ’ఆ మధ్య ఒక సారి నేను ఢిల్లీ లో జరిగే పండ్ల ప్రదర్శనకు వెళ్లాలనుకున్నాను అయితే, నేను బయలుదేరడానికి ముందు అల్లరి మూకలు  ఆవరణలో ప్రవేశించి 10కాయలు దొంగిలించారు. దీనితో చెట్టును కాపాడుకోవలసిన పరిస్థితి వచ్చింది. అన్ని కోణాల్లోనుంచి చెట్టు మీద నిఘా పెట్టేందుకు వీలుగా సిసి టివిలను రు. 24వేలు ఖర్చుపెట్టి ఏర్పాటుచేశాం. ఎవరైనా  చెట్టును సమీపించగానే నేనెక్కడ ఉన్నా మొబైల్ ఫోన్ కు అలర్ట్ వస్తుంది,‘ ని దినేశు చెప్పారు.
ఈ చెట్టును కాపాడి ప్రపంచానికి అందించినందుకు తనకు ‘బెస్ట్ కస్టోడియన్’ అవార్డును కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా అందించారని, ఈ చెట్టు వలన తాను, తన కుటుంబం ప్రపంచానికి తెలిశామని పరమేష్ భావోద్వేగంతో తెలిపారు.
తనకు, తన కుటుంబానికి ఇంత  పేరు రావడానికి, తన ఇంటి పెరటి చెట్టు ప్రపంచానికి పరిచయం కావడానికి, ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలను వెలికి తీసి కేవలం పండుగానే కాకుండా ఔషధంగా కూడా వాడ వచ్చునని ప్రపంచానికి చాటిన ఐ. ఐ. హెచ్. ఆర్,డైరెక్టర్ దినేష్ కు, శాస్త్రవేత్త డాక్టర్ కరుణాకరన్ కు, ఇతర శాస్త్రవేత్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  తమ చెట్టును ఆదరిస్తున్న రైతులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, తాము చేస్తున్న ఈ ప్రయత్నానికి ఇప్పటిలాగే తమకు సహకరించాలని ఆయన అందరికి విజ్ఞప్తి చేశారు.
ఇండియన్ ఇన్ స్టిట్యూట్    హార్టికల్చరల్ రీసెర్చ్ ప్రకారం  ఈ అరుదైన రాగి రంగు పనసలో ఉండేే పోషకాలు
Carotenoids (4.43 mg/100g),
Lycopene (1.12 mg/100g),
Total Flavonoids (3.74 mg catechin equivalents/100g),
 Total Phenols (31.76 mg Gallic acid equivalents/100g), Vitamin-C (6.48 mg/100 g).
Total antioxidant activity from 11.00 and 14.93 mg AEAC/100g in FRAP and DPPH assay,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *