పాకిస్తాన్ లో బయల్పడిన వెయ్యేళ్ల నాటి హిందూ ఆలయాలు

పాకిస్తాన్ లోని ఖైబర్ -పఖ్తున్క్వా (కెపి) రాష్ట్రంలో దాదాపు వెయ్యేళ్ల కిందటి హిందూ దేవాలయాలు, స్మశానం వాటిక బయల్పడ్డాయి.

ఆ రాష్ట్రంలోని హరిపూర్ జిల్లా ఖాన్ పూర్ పరిసరాలలో పురావస్తు శాఖ పరిశోధకులు వీటిని కనుగొన్నారు. పాకిస్తా న్ ఏర్పడిన తర్వాత పురావస్తు శాఖ వారి పరిశోధనలలో హిందూదేవాలయాలు కనుగొనడం ఇదేమొదటిసారి. కెపి రాష్ట్రానికి రాజధాని పెషావర్.

తాము హిందూ ఆలయాన్ని, మరికొన్ని హిందూ స్థలాలనుకొనుగొన్నామని, ఇవన్నీకొన్ని వందల యేళ్ల కిందటి వని హరూన్ సరబ్ దయాల్ చెప్పారు.

దయాల్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రిలిజియస్ టూరిజం టాస్క్ ఫోర్స్, మైనారిటీ ఆర్డినెన్స్ కౌన్సిల్ సభ్యుడుకూడా. హరిపూర్ జిల్లాలో ఇంతవరకు కనిపించిన హిందూ నిర్మాణాలు 19 శతాబ్దంలో సిక్కు పాలకుల కాలంలో నిర్మించినవి. ఇపుడు బయల్పడిన  నిర్మాణాలు దాదాపు వెయ్యేళ్ల కిందటివని పెషావర్ విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ ప్రొఫెసర్ ఇబ్రహీం షా తెలిపారు.

ఈ ప్రాంతంలో చాలా హిందూ ప్రదేశాలున్నాయి. దాదాపు 300 ప్రదేశాల ఆధారాలు దొరికాయి. హరిపూర్ జిల్లాలో కనిపించినవి ఈ సమూహంలోని భాగమేనని దయాల్ చెప్పారు.

‘ఇక్కడ కనిపించిన హిందూ ఆలయం దగ్గిర ఒక గుహ కూడా ఉంది. ఇది బాబా మోహన్ దాస్ కేహార్ ది అని భావిస్తున్నాం. ఆ రోజుల్లో ఆయన బోధనలు వినేందుకు భారత దేశంలో ని అనేక ప్రాంతాలనుంచి హిందూ భక్తులు, యోగులు వచ్చేవారు,’ అని దయాల్ చెప్పారు.

‘పెషావర్ ఒకపుడు ఒక ప్రముఖ హిందూ కేంద్రం.దీనికి ఇక్కడి పంజ్ తీర్థ్, గోర్ గారో గుడి,కాళిబరి గుడి సాక్ష్యం. ఇప్పటికీ పెషావర్ లోని మొహల్లా చాకా గలి, మొహల్లా సేథియన్ రామ్ పురా గేట్, గంథా గర్ లు హిందూనిర్మాణాలకు, గుడులకు పేరు, అని ప్రొఫెసర్ షా ట్రిబ్యూన్ ఎక్స్ ప్రెస్ కు  చెప్పారు.

ఇక్కడి నివసించిన హిందూగురువులు మతబోధనలు ప్రచారం చేసే వారని, వాటికోసం అనేక ప్రాంతాలనుంచి పర్యాటకు వచ్చే వారని దయాల్ వివరించారు.

కెపి రాష్ట్ర అసెంబ్లీలోని మైనారిటీ సభ్యుడు రవికుమార్ (కిందిఫోటో) ‘ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్’ తో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మరుగున పడిన హిందూ స్థలాల అన్వేషణ కొనసాగుతూ ఉందని చెప్పారు.

‘ఇక్కడ మరొక ఒక కోట గురించి మాకు సమాచారం అందింది. నౌషేరా లోని పీర్ సాబిక్ సమీపాన ఉన్న నది ఒడ్డున ఈ కోట ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి ప్రదేశాలు బయల్పడితే అంతర్జాతీయ ధార్మిక టూరిజం పెరుగుతుంది,’అని రవికుమార్ ఆశిస్తున్నారు.

అయితే,హిందువులను వేధిస్తున్న చరిత్ర ఉన్న పాకిస్తాన్ లో ఈ విలువయిన చారిత్రక సంపదను భద్రపర్చడం సాధ్యమా?

ఫ్రొఫెసర్ షా చెప్పినట్లు చరిత్రలో పెషావర్ ఒక ముఖ్యమయిన హిందూకేంద్రం. అదే విధంగా అదొకపుడు పెద్ద  బౌద్ధ కేంద్రం కూడా. ఒకపుడు ఈ నగరాన్ని పురషపురం అని ‘పరసవర’ అని పిలిచే వారు. అక్బర్ చక్రవర్తి (1556-1605) దీనికి పెషావర్ అని పేరు పెట్టినట్లు చెబుతారు. పెషావర్ అంటే సరిహద్దు పట్టణం అని అర్థం. ఇక్కడ దొరికిన చారిత్రక అవశేషాలలో బౌద్ధ స్థూపాలు కూడా ఉన్నాయి. పురుషపురం ఒకపుడు గాంధార రాజ్యానికి రాజధాని గా కూడా ఉండింది. అంతేకాదు, కీ.శ 1 శతాబ్దానికి చెందిన కనిష్కుడు కూడా కుషాణ రాజ్యానికి పురుషపురం ను రాజధానిగా చేసుకున్నారు.

క్రీ.శ 5 వ శతాబ్దంలో చైనా కు చెంది బౌద్ధయాత్రికుడు ఫాహియాన్ ఈ ప్రాంతంలో పర్యటించినపుడు ఇక్కడ బౌద్ధం వర్థిల్లుతూ ఉండింది. ఇటీవల పెషావర్ తీవ్రవాడుల దాడులకు బలయింది.(ఈ ఫోటో పెషావర్ లోని కాళిబరి గుడి)

దక్షిణాసియాలో వర్థిల్లుతున్న పురాతన నగరంగా ఫెషావర్ కు పేరుంది. పెషావర్ నగరాన్ని అబ్దుల్ వలీఖాన్ యూనివర్శటీ మాజీ వైస్ చాన్స్ లర్, పురాతత్వ, మ్యూజియం విబాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఈషాన్ అలీ ఒక్క ముక్కలో ఇలా వర్ణించారు.

‘పెషావర్ అనేక జాతుల, సంస్కృతుల సమ్మేళనం.దీనిని గ్రీకులు జయించారు. బౌద్ధులు పరిపాలించారు.హూణులు నాశనం చేశారు. హిందూబ్రాహ్మణులు నిర్మించారు. గజనవీలు ఆక్రమించుకున్నారు. మెగలులు వశపరుచుకున్నారు. శిక్కులు అజమాయిషీ చేశారు. చివరకు బ్రిటిష్ వాళ్లు తమ సామ్రాజ్యంలో కలుపుకున్నారు.’

‘The history of Peshawar is a story of different people and of many cultures, conquered by Greeks, ruled by Buddhists, destroyed by the Huns, rebuilt by the Brahmins, invaded by Ghaznavis, captured by the Mughals, over run by the Sikhs and annexed by the British in succession.’

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *