తెలంగాణకు పెట్టుబడులు: ఐఎఫ్ఎస్ అధికారుల సాయం కోరిన మంత్రి కెటిఆర్

సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులతో హైదరాబాద్ లో సమావేశమైన మంత్రి కేటీఆర్
తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలకు విదేశాల్లోని వ్యాపార వర్గాల్లో మరింత అవగాహన కల్పించడంలో సహకరించాలని ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులను తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు కోరారు.
1992, 93, 94 సంవత్సరాల ఇండియన్ ఫారిన్ సర్వీస్ సీనియర్ అధికారులు హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్నారు.
వీరితో తెలంగాణ ప్రభుత్వం ఒక విందు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
భారతదేశంలో ప్రస్తుతం అనేక వ్యాపార అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలు వినూత్నమైన పాలసీలతో ముందుకు పోతున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం టిఐపాస్ లాంటి విప్లవాత్మకమైన విధానాలతో పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు చేపడుతున్న పెట్టుబడుల స్నేహపూర్వక విధానాలను విదేశాల్లోని వ్యాపార వర్గాల్లో విస్తృత ప్రచారం కల్పించే దిశగా పని చేయాలని ఈ సందర్భంగా వారిని కోరారు.
తెలంగాణ రాష్ట్రం 14 రంగాలను ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించి ఆయా రంగాలకు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మక్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీ, మెడికల్ డివైసెస్ పార్క్, జీనోమ్ వ్యాలీ, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాల్లో ఉన్న ఇక్కడి పెట్టుబడి అవకాశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
గత ఐదు సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధించిందని ఈ సందర్భంగా తెలిపారు. ఐటీ రంగంలో ప్రపంచంలోని టాప్ కంపెనీల క్యాంపస్ లను ఇక్కడ ఏర్పాటు అయ్యేలా చేయగలిగామని తెలిపారు. గత ఐదు సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఈజ్ అప్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలవడం ఇక్కడి ప్రభుత్వ విధానాలకు ఒక నిదర్శనం అని అన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూప్లెమింగ్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు