ఇసుక సంక్షోభం, విశాఖలో జనసేన ర్యాలీ

ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక కొరత ఏర్పడి నిర్మాణ రంగం కుదేలై పోవడంతో  ఉపాధి లేక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న కార్మికుల తరఫున పోరాడాని జనసేన పార్టీ  నిర్ణయించింది.

నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వచ్చేందుకు విశాఖలో  పాదయాత్ర చేపట్టాలని  పార్టీ అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

. నవంబర్ 3 వ లేదా 4 వ తేదీన  మధ్యాహ్నం 3 గంటలకు ఈ పాదయాత్ర మొదలవుతుంది.

ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన  జరిగిన  పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ  విషయం నిర్ణయించారు.

ఇదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు పార్టీ సమాయత్తం కావాలని జనసేన పార్టీ నేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి పాలనాపరంగా ఒక విధానం లేకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులుపడటంతోపాటు… పలు రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని రాజకీయ వ్యవహారాల కమిటీ అభిప్రాయపడింది.

ఇసుక కొరత, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు, ఎన్నికల హామీల అమలులో వెనకడుగు, లోపభూయిష్టమైన మద్యం విధానం అంశాలు  సమావేశంలో  చర్చకు వచ్చాయి.

“ఇసుక సరఫరా ఇప్పటికీ సక్రమంగా లేకపోవడంతో 35 లక్షల మంది నెలల తరబడి ఉపాధికి దూరమైపోయి తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర పరిస్థితులు చూస్తే ప్రభుత్వం ఈ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమైంది. అక్కడకు వచ్చిన భవన నిర్మాణ కార్మికులు ఉపాధి దొరకడం లేదని ఎంతో ఆవేదన చెందారు. ఈ రంగం చుట్టూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో వ్యాపారాలు నడుస్తుంటాయి. వాటిలో ఎంతోమందికి ఉపాధి ఉంది. వీళ్లంతా రోడ్డునపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల ఆవేదన అందరికీ తెలియాలి. అందుకు అనుగుణంగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేద్దాం. ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ మంది కూలీలు భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నారు. మన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంలో చలనం రావాలి” అని పవన్ కల్యాణ్ సమావేశంలో ప్రసంగిస్తూ చెప్పారు.

పాదయాత్ర కార్యక్రమాన్ని సమన్వయం చేసే బాధ్యతను సీనియర్ నాయకుడు తోట చంద్ర శేఖర్ కు అప్పగించారు.

అవి వైసీపీ మద్యం దుకాణాలు

లోపభూయిష్టమైన మద్యం విధానంతో మద్య నిషేధం ఏ విధంగా సాధ్యమని జనసేన పార్టీ తొలి నుంచి ప్రశ్నిస్తున్న విషయాన్ని సభ్యులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. ప్రభుత్వం దుకాణాలు నిర్వహించడం ద్వారా అమ్మకాలు తగ్గుతాయని పాలక పక్షం చెబుతున్న మాటలు ఎంత మాత్రం నిజం కావని వస్తున్న ఆదాయం, పెరిగిన అమ్మకాలు చెబుతున్నాయి అని సభ్యులు సమావేశంలో చెప్పారు. దుకాణాలు పెట్టిన జాగా, అందులో ఉద్యోగాలు… అన్నీ వైసీపీ వర్గానికి చెందినవారివే అని – అవి ప్రభుత్వ మద్యం దుకాణాలు కావనీ వైసీపీ మద్యం దుకాణాలు అని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.

 సీపీఎస్ రద్దుపై వెనకడుగు

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని చెప్పి – ఇప్పుడు ఆ విషయాన్ని విస్మరించిన అంశంపై సమావేశంలో చర్చించారు. సీపీఎస్ రద్దు విషయంలో వైసీపీ వెనకడుగు వేసి, ఉద్యోగ వర్గాలను వంచించింది అని రాజకీయ వ్యవహారాల కమిటీ స్పష్టం చేసింది.

తెలంగాణ ప్రభుత్వాన్ని తలదన్నిన ఏపీ ప్రభుత్వం

అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ చర్యల వాళ్ళ సుమారు రెండున్నర లక్షల మంది రోడ్డునపడే పరిస్థితి నెలకొందని సభ్యులు ప్రస్తావించారు. “48 వేలమంది ఆర్టీసీ కార్మికులను తొలగించాలని తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాన్ని తలదన్నేలా అంతకు అయిదింతలు.. 2.5లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించేలా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద”ని శ్రీ పవన్ కల్యాణ్ గారు విమర్శించారు. రెగ్యులరైజ్ చేయమని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరుతున్న తరుణంలో ఈ విధమైన నిర్ణయం సరికాదన్నారు.

 23 , 24 తేదీల్లో విజయవాడలో సమావేశాలు

ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ నెల 23 వ తేదీన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు, ఈ నెల 24 న నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ స్థానాలతో పాటు ఆ జిల్లాకి సంబంధించి తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే మూడు అసెంబ్లీ స్థానాల సమీక్ష ఉంటుంది.