ఢిల్లీ మట్టి సత్యాగ్రహం లో తెలుగు మట్టితో తెలుగు రైతులు

 

*మట్టి సత్యాగ్రహం లో రెండు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులు

*గాజీపూర్ మరియు సింగు బోర్డర్ లో జాతీయ కార్యక్రమంలో పాల్గొన్న రైతు స్వరాజ్య వేదిక నాయకులు*

దేశ వ్యాపితంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమంలో మట్టి సత్యాగ్రహం ఒక ముఖ్యమైన భాగంగా దశ గా మారింది.
1930లో ఏప్రిల్ 6 న జరిగిన ఉప్పు సత్యాగ్రహం దేశ వ్యాప్తంగా ప్రజలలో స్ఫూర్తిని నింపింది. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా సాగిన పోరాటం అది. దండి సత్యాగ్రహం స్పూర్తితో కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ రంగ చట్టాలపై ఉద్యమంలో భాగంగా వేలాది గ్రామాలు ఈ మట్టి సత్యాగ్రహం కార్యక్రమం లో పాల్గొన్నాయి.

ఈ కార్పొరేట్ చట్టాలకు వ్యతిరేకంగా తమ గ్రామాల నుండి మట్టి కుండలో మట్టిని పంపారు.వివిధ రాష్ట్రాల నుండి ఈ మట్టి కుండలు డిల్లీ చేరాయి.ఈ రోజు గాజేపూర్ సరిహద్దు లోనూ, సింగు బోర్డర్ లోనూ ఈ మట్టి కుండలతో ప్రదర్శనలు జరిగాయి.

ఈ ప్రదర్శనలకు మేధా పత్కర్, డాక్టర్ సునీలం, రాకేశ్ తికాయత్, యోగేంద్ర యాదవ్, హన్నన్ మొలా నాయకత్వం వహించారు.

ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలలో రైతు స్వరాజ్య వేదిక 200 గ్రామాల నుండి బలంగా పాల్గొన్నది. AIKSCC జాతీయ నాయకులు విస్సా కిరణ్ కుమార్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కొండల్, సాగరిక,పి.శంకర్, ఈశ్వ య్య నాయకత్వం వహించారు.

“ఈ ప్రచార కార్యక్రమం ప్రజలలో ఆసక్తిని పెంచింది. గ్రామాలలో వందలాది మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని మూడు కార్పొరేట్ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
మట్టి సత్యాగ్రహం ద్వారా ఈ ఉద్యమం దక్షిణ భారత దేశంలో వేలాది గ్రామాలలో బలోపేతం అయింది. ప్రజలు మనస్పూర్తిగా ఈ కార్యక్రమాన్ని బలపరిచారు” అని విస్సా కిరణ్ కుమార్ అన్నారు.

సాగరిక స్వయంగా రైతు ఆత్మహత్య బాధిత కుటుంబ సభ్యులు, “దేశంలో మరిన్ని రైతు ఆత్మహత్యలు జరగ కూడదని, రైతుల పంటలకు న్యాయమైన ధరలు లభించాలని ఈ పోరాటంలో పాల్గొంటున్నట్లు” తెలిపారు

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో రైతుల నుండి వచ్చిన మద్దతు దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14 వరకూ కొనసాగించాలని (సంవిధాన బచావో ఆందోళన్ దివస్) నిర్ణయించి నట్లు రైతు స్వరాజ్య వేదిక నాయకులు కొండల్,శంకర్ ప్రకటించారు.

మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,గుజరాత్,రాజస్థాన్,హర్యానా,పంజాబ్,తమిళనాడు,కర్ణాటక,తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా,బీహార్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుండీ పెద్ద సంఖ్యలో రైతులు ఈ ప్రదర్శన లో పాల్గొన్నారు.

జాతీయ నాయకులు ప్రదర్శన నుద్దేశించి మాట్లాడుతూ రైతు ఉద్యమం రోజు రోజుకూ మరింత బలోపేతం అవుతుందని,మూడు చట్టాలు రద్దు అయ్యే వరకూ కొనసాగుతుందని ప్రకటించారు. గ్రామాల నుండి మట్టిని డిల్లీకి పంపిన అన్ని గ్రామాల రైతులను నాయకులు అభినందించారు.

(విస్సా కిరణ్ కుమార్, రైతు స్వరాజ్య వేదిక
ఫోన్: 970 1705743)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *