జేసీ దివాకర్ రెడ్డికి సిపిఐ రామకృష్ణ ఊహించని షాక్

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి ఊహించని ఝలక్ ఎదురైంది. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే జేసీ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆయనకు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయి. ఇటీవలే జేసీ దివాకర్ రెడ్డి మీడియా ఎదుట మాట్లాడుతూ ఎన్నికల వ్యయం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రాలో రాజకీయ దుమారం రేపాయి.
ఎన్నికల వ్యయం పెరిగిపోయిందని, మాకు సుమారు 50 కోట్లు ఖర్చు అయిందని జేసీ వెల్లడించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. ఈసీ ఆదేశాలతో విచారణ జరిపిన  రిటర్నింగ్ అధికారి… జేసీ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని నిర్ధారించారు. ఆ నివేదికను కలెక్టర్ వీరపాండ్యన్ కు అందించగా ఆయన కూడా అదే నివేదికను ఈసీకి పంపారు.
కాగా ఈసీ ఇప్పటి వరకు జేసీపై చర్యలు తీసుకోకపోవడంపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. జేసీ పై చర్యలు ఎందుకు తిసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిపిఐ నేత రామకృష్ణ ఈసీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదీకి లేఖ రాశారు. అనంతపురంలో తన కుమారుడి పోటీకి 50 కోట్ల ఖర్చు అయిందని బహిరంగంగా జేసీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినప్పటికి కేసు కట్టలేదని లేఖలో ఆరోపించారు.
అనంతపురం పార్లమెంటు ఎన్నికల ఫలితాలు హోల్డ్ లో పెట్టాలని, 50 కోట్ల ముచ్చట తేలేవరకు విడుదల చేయరాదని లేఖలో రామకృష్ణ కోరారు. తక్షణమే జేసి మీద చర్యలు తీసుకోవాలని విన్నవించారు.  ఈ పరిణామంతో జేసికి గట్టి షాక్ తగిలినట్లే అయిందని రాజకీయ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *