టిఎస్ ఆర్టీసి సమ్మెకు ఎపి ఎన్జీవోల మద్దతు… ఇదే ప్రథమం, కొత్త ట్రెండ్

 తెలంగాణ‌ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఆంధ్రలో మద్దతు లభిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయాక తెలంగాణలో జరుగుతున్న ఒక పోరాటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత బహిరంగంగా మద్దతు దొరకడ ఆశ్చర్యం.

తెలంగాణ ఆర్టీసి కార్మికుల కోర్కెలు న  న్యాయమైనవయినంత ఇలాపక్క రాష్ట్రాల నుంచి మద్దతు రావడం వింత.ఎపి ఎన్జీవోల సంఘం టిఎస్  ఆర్టీసి సమ్మెకు పూర్తి మద్దతు ప్రటించింది.

 వారి న్యాయమయిన  కోర్కెల కోసం చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు యన్.చంద్రశేఖర రెడ్డి, రాష్ట్ర కార్య‌ద‌ర్శి బండి శ్రీనివాసరావు, ఏపి ఎన్జీవోస్ పశ్చిమ కృష్ణ అధ్యక్షుడు ఏ.విద్యాసాగర్‌లు ప్రకటించారు.

అఖిలభారత రాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయ కాంపౌండ్‌లో శనివారం భోజన విరామ సమయంలో తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా పెద్ద ఎత్తున  ప్రదర్శన కూడా నిర్వహించారు.  ఇందులో పలువురు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏపి ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా ఆర్టిీసి ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.

ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని నెరవేర్చకపోవడం వల్లే సమ్మె చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.

తెలంగాణా ఆర్టీసి సిబ్బంది  గత 14 రోజులు నుండి తమ కోరికల సాధనకు సమ్మె చేస్తున్నప్పటికీ తెలంగాణా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరపకుండా ఉండటం  నిరంకుశ ధోరణి అని ఆయన వర్ణించారు.

 ఏపీలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని, దానిని తాము పూర్తిగా అభినందిస్తున్నామని ఆయన అన్నారు.

అదేవిధంగా తెలంగాణాలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా ఆచరణలో దానిని అమలు చేయకుండా మొండిగా వ్యవహరించడం శోచనీయం అని  అన్నారు.

చంద్రశేఖర్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే…

48 వేలమంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళితే వారితో చర్చలు జరపకుండా వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని ప్రకటించడం, ఆ కారణంగా ఆందోళనతో కొందరు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా భాధాకరం.

ప్రజాస్వామ్యంలో ఇటువంటి నిరంకుశ ధోరణి పనికిరాదు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు రెండూ మొన్నటివరకూ కలిసి ఉండేవి.

విధానపరమైన విభేధాలు ఉన్నా, కష్టం వచ్చినప్పుడు సంఘీభావం తెలపాల్సిన కనీస భాధ్యత మనపై ఉంది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ సంఘాలు తెలంగాణా ఆర్ టి సి ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి.

 ఇప్పటికైనా తెలంగాణా ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఆర్టిసి ఉద్యోగులను సంప్రదింపులకు పిలవాలి.

ఇదే విధమైన మొండి వైఖరిని తెలంగాణా ప్రభుత్వం విడనాడకపోతే దేశ వ్యాప్తంగా సమ్మె చేయడానికి కూడా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జరుగుతుంది.

ఏపి ఎన్జీవోస్ పశ్చిమ కృష్ణ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ..

తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగులు గత 14 రోజులుగా వారి న్యాయమైన కోరికల కోసం పోరాడుతుంటే పట్టించుకోకుండా ఆ ప్రభుత్వం వారిని ఉద్యోగం నుంచి తొలిగిస్తునట్లు ప్రకటించడాన్ని, తెలంగాణా ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఉద్యోగుల న్యాయమైన కోరికల కోసం సమ్మె చేసే హక్కు, నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు ఉందన్నారు.

ఏపి ఎన్జీవో స్టేట్ జనరల్ సెక్రటరి బి.శ్రీనివాసరావు, పశ్చిమ కృష్ణా కార్యనిర్వాహక కార్యదర్శి పి.రమేష్, స్టేట్ ఉమెన్ వింగ్ ట్రజరర్ శివలీల, లలితాంబ, అజయ్‌కుమార్, అమరావతి ఏపి ఎన్జీవో అధ్యక్షుడు పి.రమణ, విజయవాడ నగర శాఖ కార్యదర్శి జె.స్వామి, జలవనరుల శాఖకు చెందిన లంకేశ్వరరావు, కిషోర్, పలు సంఘాల ప్రతినిధులు, మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి తమ నిరసనను ఉద్యోగులు తెలిపారు.