ఢిల్లీ లో మార్చి 5న ధర్నా చేయాలని పార్టీ నేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 02 రాత్రి 10 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వందలాదిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలతో ఒక ప్రత్యేక రైలు దేశ రాజధాని బయలుదేరింది.
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో మార్చి 5 న వైయస్సార్సీపీ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఇవాళ ప్రకాశం జిల్లా తాళ్లూరులో ప్రకటించారు. మొదట పార్టీ అద్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తో సమావేశం అయిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కొందరు పార్టీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారని, మిగిలిన వారంతా ఈరోజు బయలు దేరుతారని చెప్పారు. విభజన చట్టంలోని ఆదేశాలను అమలు పర్చకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని, 11 రాష్ట్రాలకు హోదా కల్పించి ఏపీకి హోదా ఇవ్వడం లేదని వాపోయారు. కేంద్రానికి కనువిప్పు కలిగించేలా వైయస్సార్సీపీ ఆందోళన చేస్తోందని గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా గురించి మాట మారుస్తున్నారని, ఒక రోజు హోదా వల్ల ప్రయోజన ఏమిటని మరో రోజు హోదా కావాలని, అంటున్నారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు రోజుకో మాట చెబుతున్నారని ధ్వజమెత్తారు. హోదా డిమాండు చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా లోక్సభలో ప్రవేశపెడతామని చెప్పారు. ఈ తీర్మానానికి ఇతర పార్టీల వారు ఏమేరకు మద్దతు ఇస్తారో చూడాలని పేర్కొన్నారు. హోదాపై 184 నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై కూడా లోక్సభలో చర్చ జరుగుతుందని మేకపాటి అన్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు
వైయస్సార్సీపీ ఎంఎల్ ఏలు హాజరు కారు
చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మేకపాటి విమర్శించారు.వైయస్సార్సీపీకి చెందిన 23 మంది వైయస్సార్సీపీ ఎంఎల్ ఏలను , ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకున్నారని ప్రస్తావించారు. కొందరు ఎంఎల్ ఏలకు మంత్రి పదవులు కూడా ఇచ్చారని తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్ ఏలు తమ పదవులకు రాజీనామా చేయాలని, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వైయస్సార్సీపీ డిమాండు చేస్తోందని తెలిపారు. అంత దాకా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మా పార్టీ ఎంఎల్ ఏలు హాజరు కారని స్పష్టం చేశారు. వైయస్సార్సీపీకి చెందిన ఏడుగురు ఎంఎల్ సీలు కూడా హాజరు కారని చెప్పారు.
ఏకగ్రీవ రాజ్యసభ ఎన్నికలకు అవకాశం
వచ్చే రాజ్యసభ ఎన్నికలలో చంద్రబాబు రాజకీయ విన్యాసాలు చేసి నీతి మాలిన పనులకు పాల్పడితే మరింత చెడ్డ పేరును మూటగట్టు
కుంటారని మేకపాటి హెచ్చరించారు. రాజ్యసభ ఎన్నికలలో మూడు సీట్లకు గాను రేండు సీట్లు టీడీపీకి, ఒక సీటు వైయస్సార్సీపీకి దక్కుతాయన్న ఆశాబావాన్ని వ్యక్తం చేశారు. ఏకగ్రీవ ఎన్నికలకు అవకాశం ఉన్నదని చెప్పారు. ప్రజాస్వామ్య సూత్రాలకు విలువనివ్వకుండా చంద్రబాబు అవినీతి అక్రమాలకు పాల్పడితే ఆయన కొంప కొల్లేరవుతుందని హెచ్చరించారు. అసెంబ్లీ సీట్లుపెరుగుతాయని చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని , ప్రతిపక్ష ఎంఎల్ ఏలను వంచించి తీసుకున్నారని విమర్శించారు. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగదని కేంద్రం ఇది వరకే.స్పష్టంచేసిన సంగతిని గుర్తు చేశారు. ఇంతటి నీతి మాలిన ముఖ్యమంత్రి ( చంద్రబాబు ) దేశంలో ఎవరూ లేరని అన్నారు. ఆయనకు విశ్వసనీయత లేదని, ప్రజలు నమ్మడం లేదని మేకపాటి పేర్కొన్నారు.